- సైకో జగన్కు ఎక్స్పైరీ డేట్ ఫిక్స్
- కుట్రలతో చంద్రబాబును జైలుకు పంపారు
- మంత్రుల అవినీతిని జైలకు పంపిస్తాం
- కోనసీమలో తిరిగి ప్రారంభమైన లోకేశ్ యువగళం
అంబేడ్కర్ కోనసీమ : రాష్ట్రంలో మంత్రులకు కౌంట్ డౌన్ మొదలైందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. కోనసీమ జిల్లా రాజోలు మండలం తాటిపాకలో నిర్వహించిన బహిరంగ సభల్లో ఆయన మాట్లాడారు. తాను ఏ తప్పూ చేయలేదు కనుకే మళ్లీ ఇక్కడ నిలబడ్డానని పేర్కొన్నారు. ’టీడీపీ అధినేత చంద్రబాబును జైలుకు పంపితే నా పాదయాత్ర ఆగుతుందని అనుకున్నారు. వైసీపీ నేతలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా పాదయాత్ర ఆగదు. వ్యవస్థలను మేనేజ్ చేసి 53 రోజులు చంద్రబాబును జైల్లో పెట్టారు. నాపై కూడా సీఐడీ కేసులు పెట్టారు. ఇప్పటి వరకూ 6 కేసులు పెట్టినా ఒక్క ఆధారం లేదు. స్కిల్ కేసులోనూ ఒక్క ఆధారం చూపలేకపోయారు.
ఆనాడు పవన్ కల్యాణ్ వస్తుంటే ఎలా అడ్డుకున్నారో చూశాం. ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి. అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లించే బాధ్యత నేను తీసుకుంటా.’ అని లోకేశ్ వ్యాఖ్యానించారు. స్కిల్ కేసులో తమ పార్టీ ఖాతాలోకి డబ్బు వచ్చిందని నిరూపించగలరా.? అంటూ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. వైసీపీ నేతలు అన్న క్యాంటీన్లపైనా కేసులు పెడతారని, ఏం చేసినా వెనక్కు తగ్గేది లేదని స్పష్టం చేశారు. సైకో జగన్కు ఎక్స్ పైరీ డేట్ ఫిక్స్ అయ్యిందని.. మూడు నెలల్లో సైకో పిచ్చాసుపత్రికి ప్యాకప్ అంటూ నారా లోకేష్ వ్యాఖ్యలు చేశారు. సోమవారం రాజోలు నియోజకవర్గం పొదలాడలో 210వ రోజు పాదయాత్రను యువనేత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువగళం పాదయాత్రకు 79 రోజులు బ్రేక్ ఇచ్చినందుకు క్షమించాలన్నారు. పాదయాత్రలో అన్ని వర్గాల వారిని కలిసి వారి సమస్యలు తెలుసుకున్నానని.. టీడీపీ ` జనసేన అధికారంలోకి వచ్చిన వెంటనే అందరి కష్టాలు తీరుస్తానని భరోసా ఇచ్చినట్లు తెలిపారు. ప్రతి వంద కిలోమీటర్ల పాదయాత్రకు గుర్తుగా ప్రత్యేక హామీలు ఇచ్చానన్నారు. వైసీపీ నాయకుల అవినీతిని భయటపెట్టానని.. ఒక్క ఛాన్స్ పేరుతో జగన్ చేస్తున్న దోపిడీ భయటపెట్టానని చెప్పారు. పాదయాత్ర మొదలుపెట్టిన మొదటి రోజు నుంచే సైకో జగన్ అడ్డుకోవడానికి స్కెచ్లు వేశారన్నారు. అన్న ఎన్టీఆర్ ఇచ్చిన గొంతు ఆపే మగాడు పుట్టలేదని… ముందే చెప్పా సాగనిస్తే పాదయాత్ర… అడ్డుకుంటే దండయాత్ర అని యువనేత హెచ్చరించారు. చంద్రబాబును అరెస్ట్ చేసి యువగళం పాదయాత్రను సైకో జగన్ ఆపారని మండిపడ్డారు. చంద్రబాబును చూస్తే సైకోకు భయమని.. సొంత అమ్మని, చెల్లిని చూసినా జగన్కు భయమే అని వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుపై అనేక కేసులు పెట్టారని మండిపడ్డారు. పార్టీ అకౌంట్లోకి రూ.27 కోట్లు వచ్చాయంటున్నారని.. అరేయ్ ఫూల్స్ అవి తమ కార్యకర్తలు సభ్యత్వం కోసం చెల్లించిన రుసుము అంటూ విరుచుకుపడ్డారు.ఒక్క రూపాయి అవినీతి జరిగినట్టు రుజువు చెయ్యగలిగారా?అని ప్రశ్నించారు. హైకోర్టులో నిజం గెలిచిందన్నారు. తనపై కూడా అనేక కేసులు పెట్టారని.. సీఐడీ విచారణకు పిలిచారని అన్నారు. తప్పు చేస్తే చంద్రబాబే తనను వదిలిపెట్టరన్నారు. ‘ఆఖరికి మా అమ్మ భువనమ్మ, నా భార్య బ్రాహ్మణిపై కూడా కేసులు పెడతాం అరెస్ట్ చేస్తాం అని మంత్రులు మాట్లాడారు. ఆ మంత్రులకు భయం పరిచయం చేసే బాధ్యత నాది‘ అని హెచ్చరించారు. సైకో బెదిరింపులకు, ఉడత ఊపులకు తాము భయపడలేదని స్పష్టం చేశారు. ప్రజల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎన్ని ఇబ్బందులు పడినా ఓర్చుకున్నామన్నారు. ఒక పక్క యువగళం, మరోపక్క చంద్రబాబు భవిష్యత్తుకి గ్యారంటీ, మరోపక్క పవన్ కళ్యాణ్ వారాహి యాత్రతో సైకో భయంతో వణికిపోయారన్నారు. ఈ మూడు కార్యక్రమాలు ఆపాలనే అక్రమ కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 53 రోజుల పాటు ప్రజా పోరాటం జరిగిందని.. చంద్రబాబు గొప్పతనం ప్రపంచం అంతా తెలిసిందన్నారు. ల్యాండ్, స్యాండ్, వైన్, మైన్ మాఫియా డాన్గా మారిన పిచ్చోడు మూడు నెలల్లో పర్మినెంట్గా జైలుకి పోవడం ఖాయమన్నారు.
‘అవినీతికి పాల్పడిన టోటల్ వైసీపీ ఇన్ జైల్. జైలర్ ఎవరో తెలుసా… చంద్రబాబు .. మీ తాట తీస్తారు. ఇది ఖాయం రాసిపెట్టుకోండి‘ అని హెచ్చరించారు. మూడు నెలలు ఓపిక పట్టాలని టీడీపీ కార్యకర్తలను వేధించిన వైసీపీ వారికి వడ్డీతో సహా చెల్లిస్తా అని లోకేష్ స్పష్టం చేశారు. దాదాపు రెండున్నర నెలల సుదీర్ఘ విరామం అనంతరం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ’యువగళం’ పాదయాత్ర సోమవారం నుంచి పునఃప్రారంభమైంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుతో పాదయాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడగా, దాదాపు 79 రోజుల విరామం అనంతరం ఎక్కడ ఆపేశారో అక్కడి నుంచే లోకేశ్ పాదయాత్ర మొదలుపెట్టారు.ఈ క్రమంలో టీడీపీ ముఖ్య నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. దీంతో సందడి వాతావరణం నెలకొంది. పాదయాత్రలో భాగంగా పి.గన్నవరం పరిధిలో గెయిల్, ఓఎన్జీసీ బాధితులతో లోకేశ్ ముఖాముఖి నిర్వహించారు. సెప్టెంబరు 8న లోకేశ్ యాత్ర రాజోలు మీదుగా పొదలాడ చేరుకుంది. ఆ మరుసటి రోజు చంద్రబాబు అరెస్టు కావడంతో లోకేశ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. చంద్రబాబుకు ఇటీవల బెయిల్ మంజూరు కావడంతో యాత్రను మళ్లీ ప్రారంభించాలని నిర్ణయించారు. అయితే, ఈసారి షెడ్యూల్ మార్పు చేశారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో రాజోలు, పి.గన్నవరం, అమలాపురం, ముమ్మిడివరం, కాకినాడ నగరం, కాకినాడ గ్రామీణం, పిఠాపురం, తుని నియోజకవర్గాల మీదుగా యాత్ర సాగేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. రోజుకు 15 కి.మీ. నుంచి 20 కి.మీ. మేర పాదయాత్ర, మధ్యలో బహిరంగ సభలు, స్థానికులతో ముఖాముఖి నిర్వహిస్తూ లోకేశ్ ముందుకు సాగనున్నారు.