Tuesday, April 30, 2024

రైతులతో రాజకీయమా..?( తీవ్ర విమర్శలు చేసిన రేవంత్ రెడ్డి.. )

తప్పక చదవండి
  • తెలంగాణ రైతు లోకానికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ..
  • రుణమాఫీ, కేసీఆర్ రైతు వ్యతిరేక విధానాలపై కార్యాచరణకు పిలుపు..
  • రైతు వేదికలను ఇన్నాళ్లు అలంకార ప్రాయంగా ఉంచిన బీ.ఆర్.ఎస్.
  • వాటిని రాజకీయ వేదికలుగా మార్చడానికి బరితెగించింది..
  • రైతు రుణ మాఫీ కోసం ఇన్నాళ్లు మనం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూశాం.
  • చివరి బడ్జెట్ కూడా ప్రవేశ పెట్టడం అయిపోయింది..
  • ఇక రుణమాఫీ చేయబోదన్న విషయం స్పష్టత వచ్చేసింది..

తెలంగాణ రైతాంగానికి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు.. రుణమాఫీ, కేసీఆర్ రైతు వ్యతిరేక విధానాలపై కార్యాచరణకు పిలుపు నిచ్చారు.. రాష్ట్రంలో రుణమాఫీకి అర్హులైన రైతుల సంఖ్య అక్షరాలా 31 లక్షలు. రూ.20 వేల కోట్ల మేర రుణాలు మాఫీ చేయాల్సిన ప్రభుత్వం రైతులను నిలువునా మోసం చేసింది. కేసీఆర్ మాటలకు మోసపోయి అప్పుల ఊబిలో చిక్కిన మన సహచరులు దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యలకు ఒడిగడుతున్నారు. ధాన్యం సేకరించిన 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తామని జారీ చేసిన ఆదేశాలు కాగితాలకే పరిమితమయ్యాయి. జూన్ 15 నాటికి రూ.6,800 కోట్ల మేర బకాయిలు ఉన్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా గత తొమ్మిదేళ్లలో లక్షల ఎకరాల అసైన్డ్ భూములను పేదల నుండి ప్రభుత్వం లాక్కుంది.. పేద గిరిజన, దళిత బిడ్డలకు భూములు ఇవ్వడానికి మాత్రం ప్రభుత్వానికి చేతులు రాలేదు. కానీ.. ఎన్నికలు సమీపిస్తుండటంతో పోడు భూముల పట్టాలపై కేసీఆర్ ప్రభుత్వం హడావుడి మొదలు పెట్టింది అన్నారు.. రాష్ట్ర వ్యాప్తంగా 11.50 లక్షల మంది ఆదివాసీలు పోడు పట్టాలకు అర్హులని తేలింది. కానీ, కేవలం నాలుగు లక్షల మందికి పట్టాలు ఇచ్చినట్టు చేసి చేతులు దులుపుకుంది. రైతులకు ఎరువులు ఫ్రీగాభిస్తామని ప్రభుత్వం మోసం చేసింది.

రైతుకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పి కేవలం 10 గంటలు కూడా ఇవ్వడం లేదు. సబ్ స్టేషన్లలో లాగ్ బుక్ లే దీనికి సాక్ష్యం. కాంగ్రెస్ పార్టీ ఈ ఆధారాలను బయటపెట్టడంతో ప్రభుత్వం ఉలిక్కిపడింది. అందుకే అన్ని సబ్ స్టేషన్లలో లాగ్ బక్ లను వెనక్కు తెప్పించుకుంది. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాలు దొంగాట ఆడుతున్నాయి. రైతులను మోసం చేసిన విషయంలో కేసీఆర్ ది ఆల్ టైం రికార్డు. రైతు వేదికల సాక్షిగా రాజకీయానికి బీఆర్ఎస్ నేతలు వస్తున్నారు. ఆ రైతు ద్రోహులకు బుద్ధి చెప్పడానికి ఇదొక సదవకాశం. ఈ సమావేశాల్లో మన సమస్యలపై నిలదేసేందుకు సిద్ధం కండి. రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తారో ప్రశ్నించండి. ధాన్యం డబ్బులు ఎప్పుడు జమ చేస్తారో ప్రశ్నించండి. పోడు భూములకు పట్టాలు ఎప్పుడు ఇస్తారో ప్రశ్నించండి. సమస్యలు పరిష్కరించుడో… బీఆర్ఎస్ ను బొంద పెట్టుడో తేల్చేద్దాం. ఈ రైతు ద్రోహి ప్రభుత్వాన్ని నిలువునా పాతరేద్దాం. ఇందుకు యావత్ తెలంగాణ రైతు లోకం సిద్ధం కావాలని పిలుపునిస్తున్నా. మీకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని హామీ ఇచ్చారు రేవంత్ రెడ్డి..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు