విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో విషాదం నెలకొన్నది. ఏ కష్టం వచ్చిందో తెలియదుకానీ ఓ కుటుంబం బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడినది. ఎండీ మొహినుద్దీన్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి విశాఖపట్టణంలోని మర్రిపాలంలో ఉంటున్నారు. ఆయనకు భార్య సంషినిషా, కుమార్తె జహీదా, కుమారుడు అలీ ఉన్నారు. ఆయనకు విజయనగరం జిల్లా కొత్తవలస సమీపంలోని చింతపాలెంలో కొంత వ్యవసాయ భూమి ఉంది. సోమవారం సాయంత్రం కుటుంబసభ్యులంతా కలిసి పొలంవద్దకు వెళ్లారు. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ, అందరూ బావిలో దూకారు. ఈ ఘటనలో మొహినుద్దీన్, అతడి భార్య సంషినిషా, కుమార్తె జహీదా చనిపోగా.. కుమారుడు అలీ ప్రాణాలతో బయటపడ్డాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేని పోలీసులు.. వారి ఆత్మహత్యకు గల కారణాలేంటనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు.