Saturday, July 27, 2024

రద్దు నిర్ణయం.. రాజ్యాంగబద్దమే..

తప్పక చదవండి

370 ఆర్టికల్‌ రద్దు సమర్థనీయమే..

  • రాష్ట్రపతి తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నించలేం..
  • ఆర్టికల్‌ రద్దుకు రాష్ట్ర అనుమతి అవసరం లేదు
  • జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక సార్వభౌమాధికారం లేదు..
  • ఈ ఆర్టికల్‌ తాత్కాలిక ఏర్పాటు మాత్రమే..
  • కాశ్మీర్‌ అన్ని రాష్ట్రాలతో సమానమే
  • లద్దాఖ్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయడం సరైనదే
  • కాశ్మీర్‌ స్వయంప్రతిపత్తిపై సుప్రీం ధర్మాసనం కీలకతీర్పు
  • త్వరగా కాశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించాలన్న సీజేఐ

న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌): జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370 రద్దును సుప్రీంకోర్టు సమర్థించింది. ఇది రాజ్యాంగబద్దమే అని సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఆర్టికల్‌ 307 రద్దుని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సమర్థించింది. ఇది కేంద్ర ప్రభుత్వ నిర్ణయమని, పార్లమెంటు నిర్ణయాన్ని కొట్టిపారేయలేమని చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ వివరించారు. జమ్మూ కశ్మర్‌ భారతదేశంలో చేరినప్పుడు సార్వభౌమాధికారం లేదని, కేంద్రం తీసుకునే ప్రతి చర్యనూ సవాలు చేయకూడదని సీజేఐ పేర్కొన్నారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలో జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ సూర్యకాంత్‌లు తీర్పు వెలువరించారు. ఆర్టికల్‌ 370ని రద్దు చేయడానికి కేంద్రానికి రాష్ట్రం అనుమతి అవసరం లేదని సీజేఐ పేర్కొన్నారు. ఇదే సందర్భం లో జమ్మూ,కాశ్మీర్‌లో వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని సూచించారు. జమ్మూకశ్మీర్‌ అంశంలో రాష్ట్రపతి ప్రకటనపై జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ఆర్టికల్‌ 370 రద్దుపై కేంద్రం వాదనలను సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. ఆర్టికల్‌ 370 అనేది తాత్కాలిక నిబంధన మాత్రమే అని, శాశ్వతం కాదని స్పష్టం చేసింది. ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం సోమవారం తమ నిర్ణయాన్ని ప్రకటించింది. రాజ్యాంగ బద్ధంగానే ఆర్టికల్‌ 370 రద్దు నిర్ణయం జరిగిందని తెలిపింది. రాజ్యాంగంలోని అన్ని అంశాలూ కశ్మీర్‌కు వర్తిస్తాయని, మిగిలిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో జమ్మూకశ్మీర్‌ సమానమే అని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. ఆర్టికల్‌ 370 రద్దు వెనుక ఎటువంటి దురుద్దేశం కనిపించడం లేదని ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యా నించింది. ఈ మేరకు కేంద్రం నిర్ణయానికి అనుకూలంగా తీర్పు వెలువరించింది. జమ్మూ కశ్మీర్‌ కు ప్రత్యేక హోదా కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 370 ని 2019 ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. అనంతరం జమ్మూకశ్మీర్‌ ను రెండు కేంద్రపాలిత (జమ్మూకశ్మీర్‌, లడఖ్‌) ప్రాంతాలుగా ప్రకటించింది. సుప్రీంకోర్టు తీర్పులోని ముఖ్యమైన అంశాలు ఇలావున్నాయి. భారత యూనియన్‌లో చేరిన ప్పుడు జమ్ముకాశ్మీర్‌కు ప్రత్యేక సార్వభౌమత్వం లేదని సీజేఐ వ్యాఖ్యానించారు. భారత రాజ్యాంగంలోని ప్రతి నిబంధనను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమ్మతి అవసరం లేదని కూడా సీజేఐ పేర్కొన్నారు. ఆర్టికల్‌ 370 తాత్కాలిక నిబంధన. రాష్ట్రంలో యుద్ధ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. జమ్మూకాశ్మీర్‌ కూడా అన్ని రాష్ట్రాల లాంటిదే. ఇతర రాష్ట్రాలకు విభిన్నంగా అంతర్గత సార్వభౌమాధికారం లేదు. ఈ మేరకు రాజ్యాంగంలో కూడా ప్రస్తావన లేదు. లద్దాఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా పునర్‌వ్యవస్థీకరించడం సమర్థనీయం అనిఅన్నారు. ఒక రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చవచ్చా.. లేదా అనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం లేదని సీజేఐ అభిప్రాయపడ్డారు. ఆర్టికల్‌ 370 ముఖ్య ఉద్దేశ్యం జమ్మూ కాశ్మీర్‌ను నెమ్మదిగా దేశంలోని ఇతర రాష్ట్రాలతో సమానంగా తీసుకురావడమేనని జస్టిస్‌ కౌల్‌ పేర్కొన్నారు. డొంక దారిలో నిబంధనల సవరణ సరికాదు. ఒక విధానాన్ని సూచించినప్పుడు దానిని తప్పకుండా అనుసరించాలి. ఆర్టికల్‌ 367 ఉపయోగించి ఆర్టికల్‌ 370 సవరణ పక్రియ చేపట్టడంపై జస్టిస్‌ కౌల్‌ స్పష్టత ఇచ్చారు. ప్రభుత్వం ’నిష్పాక్షిక నిజం, సయోధ్య కమిటీని ఏర్పాటు చేయాలి. ఈ అంశంతో ముడిప డి ఉన్న సున్నితమైన అంశాలను పరిగణలోకి తీసుకోవా లని జస్టిస్‌ కౌల్‌ సిఫార్సు చేశారు. ఇదిలావుండగా తీర్పు నేపథ్యంలో కశ్మీర్‌ అంతటా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. తీర్పును రాజకీయం చేయవద్దంటూ బీజేపీ కోరింది. శాంతిభద్రతలకు విఘాతం కలిగించబోమని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఒమర్‌ అబ్దుల్లా తెలిపారు.
ఆర్టికల్‌ 370 రద్దును వ్యతిరేకిస్తూ కూటమిగా జమ్ము`కశ్మీర్‌ పార్టీలు ఏర్పడ్డాయి. గుప్కార్‌ అలయన్స్‌ పేరుతో సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. పిటిషన్లపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపింది. ఈ ఏడాది ఆగస్ట్‌ 2 నుంచి ధర్మాసనం సుదీర్ఘంగా విచారణ జరిపింది. మొత్తంగా ఆర్టికల్‌ 370ను రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి ఉందని ధర్మాసనం పేర్కొంది. హక్కుల విషయంలో జమ్ముకశ్మీర్‌ కు ప్రత్యేకత ఏవిూ లేదు. మిగిలిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో అది సమానమే. ఆర్టికల్‌ 1, ఆర్టికల్‌ 370 ప్రకారం భారత్‌ లో జమ్మూకశ్మీర్‌ అంతర్భాగమే. కేంద్రం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని సవాల్‌ చేయడం సరికాదు.
370 ఆర్టికల్‌ రద్దు అంశంపై ఇప్పటికే 3 తీర్పులు ఉన్నాయి. గత తీర్పులను పిటిషనర్లు సవాల్‌ చేయలేదని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా జమ్ముకశ్మీర్‌ నుంచి లద్దాఖ్‌ ను విభజించి దాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడాన్ని సైతం సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. ప్రస్తుతం, జమ్మూకశ్మీర్‌ లో రాష్ట్ర హోదాను వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని కేంద్రాన్ని ఆదేశించింది. 2024, సెప్టెంబర్‌ 30లోగా జమ్మూకశ్మీర్‌ లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని కేంద్ర ఎన్నికల సంఘానికి సూచించింది. జమ్మూకశ్మీర్‌ కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్‌ 370ను కేంద్ర ప్రభుత్వం 2019 ఆగస్ట్‌ 5న పూర్తిగా రద్దు చేసింది. ఆ రాష్టాన్ని 2 కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. ఈ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ జమ్మూకశ్మీర్‌ కు చెందిన పలు పార్టీలు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. వీటిపై సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ ఏడాది ఆగస్ట్‌ 2 నుంచి సుదీర్ఘంగా విచారించింది. సెప్టెంబర్‌ 5న తీర్పును రిజర్వ్‌ చేసి సోమవారం తాజాగా తీర్పు వెలువరించింది. కీలక తీర్పు వెలువడిన నేపథ్యంలో అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా చర్యలను చేపట్టింది. గత రెండు వారాలుగా కశ్మీర్‌ లోయలోని 10 జిల్లాల్లో పోలీసులు భారీగా మోహరించారు. ఇప్పటికే కొందరు నాయకులను అదుపులోకి తీసుకోగా, మరికొందరిని గృహ నిర్బంధంలో ఉంచారు. ప్రజలను రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు