Saturday, April 27, 2024

అందరికీ ఓటుకై ఆ మహనీయుని పోరాటం

తప్పక చదవండి

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది వ్యక్తి అస్తిత్వాన్ని నిలబెడుతూ, వ్యవస్థ మార్పుకు నాంది పలుకుతుంది. ఓటనేది కుల ,జాతి, మత ,లింగ, భాషలకు అతీతంగా అందరికీ కల్పించిన సార్వత్రిక సమానత్వ హక్కు. ఈ నేపథ్యంలో ప్రజలకు ఓటు పట్ల చైతన్యం కలిగించడానికి భారతీయ ఎన్నికల సంఘం ప్రతి ఏటా జనవరి 25న జాతీయ ఓటర్‌ దినోత్సవం నిర్వహి స్తుంది. భారతదేశంలో 1951లో 17.32 కోట్ల ఓటర్లుండగా… ప్రస్తుతం 2023 నాటికి 94.50 కోట్ల ఉన్నారు. ఓటర్ల నమోదు ప్రతి ఏటా గణనీయంగా పెరుగుతుందని భారతీయ ఎన్నికల సంఘం పేర్కొన్నడం అభినందనీయం. ఈ క్రమంలో ఓటు దుర్వినియోగం ఆందోళన కలిగిస్తుంది. నేడు ఓటు ఒక సరుకుగా, ఎన్నికల వ్యవస్థ ఒక మార్కెట్‌ గా మారింది. ఓటర్లు ప్రలోభాలకు గురికావడమే దీనికి కారణం. ముఖ్యంగా డబ్బు, మద్యంతో పాటు రకరకాల కానుకలతో రాజకీయ నాయకులు ప్రజల ఓట్లను కొల్లగొడుతున్నారు. ఈ పరిణామాలు ప్రజాస్వామ్యానికి గోడ్డలి పెట్టు. రాజకీయాల్లో నేరస్తుల సంఖ్య కూడా విపరీతంగా పెరుగు తుంది. మరోవైపు ప్రజా అవసరాలు తీర్చే సమర్థ ప్రజాప్రతి నిధులు రాజకీయాల్లో అరుదుగానే కనిపిస్తున్నారు. దీంతో 75 వసంతాల స్వతంత్ర భారతదేశంలో ఇప్పటికి ప్రజల జీవన ప్రమాణాలు ఆశించిన స్థాయిలో పెరగలేదు. నేటికీ కోట్లాది ప్రజల పేదరికం, దారిద్య్రం, నిరుద్యోగం, నిరక్షరాస్యత ,అనారోగ్యం వంటి సమస్యలు ఇంకా సమసిపోలేదు. ప్రజల్లో కులతత్వం, మతతత్వం వంటి సంకుచిత భావజాలలు పెల్లుభీకుతున్నాయి. వీటిని మార్చడంలో ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వాలు విఫలమైనాయి. దీనికి ప్రధాన కారణం ఓటు దుర్వినియోగమే.
ఓటు చరిత్ర తెలుసుకో… భారత రాజ్యాంగం సార్వత్రిక వయోజన ఓటు హక్కును కల్పించింది. తద్వారా 18 సంవత్సరాలు నిండిన ప్రతి భారతీయుడిన్ని ప్రజాస్వామ్యంలో బాగం చేసింది. దీనికి బీజం వేసిన మొట్టమొదటి వ్యక్తి డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ ఒకప్పుడు ఈ దేశంలో అట్టడుగు వర్గాలకు ఓటు హక్కును తిరస్క రించిన చరిత్ర అగ్రకులాలది. వీరు ఆదాయ పన్ను, భూమిశిస్తూ కట్టేవారికి మరియు డిగ్రీ చదివిన వారికి ఓటు హక్కు కల్పిం చాలని బ్రిటిష్‌ వారి ముందు ప్రతిపాదించారు. ఈ క్రమంలో అంబేద్కర్‌ అట్టడుగు, అణగారిన వర్గాలకు ఓటు హక్కు ఇవ్వాలని బ్రిటిష్‌ వారిని విజ్ఞాపించాడు. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉండాలనే విశ్వమానవ సూత్రాన్ని ప్రతిపాదించాడు. తద్వారా ఈ దేశ పౌరులందరికి రాజకీయ భాగస్వామ్యం దొరికింది. అమెరికా లాంటి ఆధునిక దేశ మహిళలకు ఓటు హక్కు లేని కాలంలోనే భారతీయ స్త్రీలకు ఓటు హక్కు కల్పించిన ఘనత ఆయనదే. ఈ చారిత్రక సత్యం కోట్లాది భారతీయులకు తెలియకపోవడం బాధాకరం. ఈ విషయాన్ని తెలంగాణలోని ధర్మ సమాజ్‌ పార్టీ అధినేత డాక్టర్‌ విశారదన్‌ మహారాజ్‌ పదివేల కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్ర నొక్కిచెప్పింది. ఆయన సామాన్య ప్రజలను పాలకులుగా మార్చే ఓటు చరిత్ర, పోరాటం గురించి చైతన్యం చేయడం పలువురిని ఆలోచింపజేసింది. ఈ రాజ్యంలో మనకు వాటా దక్కాలంటే ఓటనే ఆయుధంతో యుద్ధం చేయాలనే స్పృహను కలిగించడం ఆయన సామాజిక నిబద్ధతకు నిదర్శనం. నేడు మెజార్టీ ప్రజలు ఆత్మగౌరవానికి చిహ్నమైన ఓటును అమ్ము కొని అణచివేతకు గురవుతున్నారు. ఈ స్థితిని మార్చుకోవాలంటే ఖచ్చితంగా నీ ఓటు ప్రాముఖ్యతను గుర్తేరగాలి. దాని వెనుక ఉన్న మహనీయుల పోరాటం తెలుసుకోవాలి. ఈ విషయాన్ని ప్రభుత్వం మరియు అధికారులు విస్తృతంగా ప్రచారం చేయాలి.
ప్రజలే అంతిమ నిర్ణేతలు…ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు. కావున ఓటు హక్కు ప్రాముఖ్యతపైన భారతీయ ఎన్నికల కమిషన్‌, అధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థలు విస్తృతంగా ప్రచారం చెయాలి. అంతేకాకుండా ఓటర్‌ నమోదు కార్యక్రమా లను విరివిరిగా చేపట్టాలి. భారతీయ ఎన్నికల కమిషన్‌ ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించకుండా గట్టి చర్యలు చేపట్టాలి. నేర రాజకీయాలను అరికట్టాలి. ప్రలోభాలకు గురిచేసే రాజకీయ నాయకులను, వాటి బారిన పడే ఓటరును కఠినంగా శిక్షించే చట్టాన్ని తీసుకురాలి. ఎన్నికల సమయంలో మద్యం విక్రయాల్ని నిషేధించాలి. ప్రతి భారతీయుడికి ఓటు చరిత్రను తెలియజేయాలి. దీనికై సాంకేతికతను విస్తృతంగా వినియోగించాలి. ఓటుపై మరింత చైతన్యం పెరగాలంటే దాని ప్రాముఖ్యతను గురించి విద్యార్థి దశలో తెలపాలి. ఇటీవల 9వ తరగతి నుంచి ఓటుపై అవగాహన కల్పించడానికి కేంద్ర విద్యా శాఖతో ఎన్నికల కమిషన్‌ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకోవడం సానుకూల అంశం. ఇది విద్యార్థి ఓటు నమోదు పట్ల బాధ్యత కలిగియుండి, సత్ప్రవర్తనతో ఓటు వేయడానికి బీజాలు పడతాయి. సమకాలీన రాజకీయాలను అట్టడుగు వర్గాల ప్రజలు మరింతగా శాసించాలి. అప్పుడే వారు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ప్రజాస్వామ్యంలో ఓటు మన భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. కావున ప్రతి ఒక్కరు ఓటు విజ్ఞానంతో ముందుకెళ్లాలి.
` సంపతి రమేష్‌ మహారాజ్‌, 7989579428

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు