కెప్టెన్ రోహిత్ శర్మకు ఒక సరికొత్త అవకాశం మళ్లీ తలుపు తట్టేలాగే కనిపిస్తోంది. ఎందుకంటే 2024లో ఆఫ్గానిస్తాన్ తో ప్రారంభమయ్యే టీ 20 సిరీస్ కి హార్దిక్ పాండ్యా దూరమయ్యేలా ఉన్నాడు. అతనింకా గాయం నుంచి కోలుకోలేదు. అలాగే ప్రస్తుతం టీ 20 తాత్కాలిక కెప్టెన్ గా ఉన్న సూర్యకుమార్ యాదవ్ కూడా గాయంతో రెస్ట్ తీసుకుంటున్నాడు. ఈ పరిస్థితుల్లో బీసీసీఐ ముందు మళ్లీ రోహిత్ శర్మ ఒక్కడే కనిపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో టీ 20 వరల్డ్ కప్ నకు ముందు ఆటగాళ్లను అంచనా వేసే ఏకైక సిరీస్ గా దీనిని పేర్కొంటున్నారు. మరి రోహిత్ శర్మ ఎలా ఆడతాడు? ఆడిస్తాడు? అనేదానిపై ప్రపంచ కప్ కెప్టెన్సీ ఆధారపడి ఉందని క్రీడా పండితులు పేర్కొంటున్నారు. 2024 , జనవరి 11, 14, 17 తేదీల్లో అప్ఘానిస్థాన్ జట్టు మూడు టీ20ల సిరీస్ ఆడేందుకు భారత్లో పర్యటించనుంది. మొహాలీ, ఇండోర్, బెంగళూరు వేదికల్లో ఈ మ్యాచ్ లు జరగనున్నాయి. అయితే ఈ సిరీస్లో రోహిత్ శర్మతోపాటు విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా సైతం బరిలోకి దిగుతారని అంటున్నారు. అదే జరిగితే టీ 20 ప్రపంచకప్ లో కూడా ఆడతారా? అనే చర్చ అప్పుడే మొదలైంది. టీమిండియాకు గాయాల బెడద ఎక్కువైంది. ఇప్పటికే మహ్మద్ షమీ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, ఇంకా కొత్త ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ అందరూ గాయాలపాలై క్రికెట్ కి దూరంగా ఉన్నారు. రుతురాజ్ వేలికి గాయమైంది. దీంతో అప్ఘాన్తో సిరీస్లో అతడు ఆడే అవకాశాలు తక్కువేనని అంటున్నారు. సూర్యకుమార్ అయితే ఫిబ్రవరి పడుతుందని అంటున్నారు. హార్దిక్ అయితే ఏకంగా ఐపీఎల్ మ్యాచ్ లతో, ముంబై కెప్టెన్ గా రీ ఎంట్రీ ఇస్తాడని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో మరి సీనియర్స్ పరిస్థితేమిటి? అనే ప్రశ్న ఉదయిస్తోంది. అలాగే వారు జట్టులోకి వస్తే జూనియర్స్ మాటేమిటని కూడా అంటున్నారు. ప్రస్తుతం ప్రతిభావంతులు ఎక్కువ కావడంతో టీమ్ ఇండియాలో స్థానం కోసం ఎవరిని ఎంపిక చేయాలనేది టీమ్ మేనేజ్మెంట్ కి పెద్ద తలనొప్పిగా మారింది. అప్ఘాన్ తో టీ 20కి భారత జట్టు ఇలా ఉండవచ్చు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కొహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, యశస్వి జైశ్వాల్, తిలక్ వర్మ, శ్రేయస్ అయ్యర్, రింకూ సింగ్, రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, జితేశ్ శర్మ, సంజూ శాంసన్, అర్షదీప్ సింగ్, ముకేశ్ కుమార్