- డిస్ప్యూట్ లో ఉన్న ల్యాండ్ను వికలాంగుల పార్క్కు ఎలా కేటాయించారు..?
- కరీంనగర్లో పెరిగిన భూముల రెట్లతో ప్రాజెక్ట్ రద్దు చేశారా..?
- ఏ రాజకీయ నాయకులకు లబ్ది చేయడానికి అడ్డంకులు..?
- పర్యవేక్షణ లేకుండా భూమి కేటాయించిన అధికారులు ఎవరు..?
- రెవెన్యూ అధికారులు ఇచ్చిన ప్రొసిడింగ్స్ కాఫీ ఎక్కడ..?
- 13వ బిఎఫ్డి మీటింగ్లో ప్రాజెక్ట్ ను రద్దు ప్రస్తావన లేదు..
- 14వ బిఎఫ్డి మీటింగ్లో ప్రాజెక్ట్ ను రద్దు చేయడం ఏంటి..?
- ఆ నిధులను ఇతర ప్రయోజనాలకు ఎలా ఉపయోగిస్తారు..?
- ప్రాజెక్ట్ రద్దు చేసిన కెఎస్సిసిఎల్ అధికారులపై వికలాంగుల హక్కుల చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి
“స్మార్ట్ సిటీల మిషన్ లో స్మార్ట్ స్కామ్” అనే శీర్షికతో ఆదాబ్ హైదరాబాద్ తేదీ 28.03.2024 రోజున ఒక శీర్షికను ప్రచురించడం జరిగింది. ఈ కథనానికి స్మార్ట్గా స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఒక తప్పుల తడకతో ఓ రీజయిండర్ లెటర్ ను ఆదాబ్ హైదరాబాద్ కు పంపించి వివరణ ఇవ్వడం జరిగింది. ఈ రీజయిండ్కు సంబంధించిన పూర్తి వివరాలు ఒకసారి చూద్దాం…
రీజయిండర్ లెటర్ మొదటి అంశం ప్రకారం 10 వ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మీటింగ్ తేదీ 09 జూన్, 2023న జరిగింది. ఈ మీటింగ్ లో రూ. 4 కోట్లతో కరీంనగర్ లో స్పెషల్లీ ఎబుల్డ్ పార్క్ నిర్మించుటకై పరిపాలన అనుమతులు ఇవ్వడం, టెండర్ నోటిఫికేషన్ ద్వారా, టెండర్ ను ఎస్ఆర్ఎస్వి ఇండస్ట్రీస్ వారికి కేటాయించడం జరిగింది.
రీజయిండర్ లెటర్ రెండవ అంశం ప్రకారం పనిని దక్కించుకున్న ఎస్ఆర్ఎస్వి ఇండస్ట్రీస్ వారు పనులు ప్రారంభించారు. కానీ, కేటాయించిన స్థలంలో డిస్ప్యూట్ ఉన్న కారణంగా కాంట్రాక్ట్ దక్కించుకున్న ఏజెన్సీ వారు కొన్ని నెలలుగా పనులు నిలిపివేసినట్లు రిజయిండర్లో పేర్కొన్నారు. డిస్ప్యూట్ లో ఉన్న ల్యాండ్ ను కావాలని వికలాంగ పిల్లల పార్క్ నిర్మాణం కోసం కేటాయించిందా.. లేక పెరిగిన భూముల రేట్లను చూసి రాజకీయ నాయకులు నియ్యతి ఖరాబ్ చేసుకున్నారా అనే అనుమానం కలుగుతుంది. ప్రాజెక్ట్ కోసం కేటాయించబడిన భూమి డిస్ప్యూట్ లో ఉన్నపుడు సంబందిత ఆర్.డి.వో కు తెలియచేయాలి. వారు వారికున్న అధికారాలతో సమస్య పరిష్కరించాలి.. ఈ ప్రాసెస్ ను అధికారులు ఎందుకు చేపట్టలేదు అని కూడా అనేక అనుమానాలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం ప్రభుత్వ భూములన్నీ రెవెన్యూ డిపార్ట్మెంట్ అధీనంలో ఉంటాయి. ప్రభుత్వ భూమి మీద పార్క్ నిర్మాణం చేసే కన్న ముందు ల్యాండ్ కేటాయింపులో భాగంగా జిల్లా కలెక్టర్ ద్వారా కరీంనగర్ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ కు ల్యాండ్ కేటాయించబడినట్లు ఒక ప్రొసీడింగ్ అందచేయాలి. దాని తర్వాతనే మిగిలిన ప్రక్రియ మొదలవ్వాలి.
కానీ, ఇవేమీ జరగకుండానే వికలాంగ పిల్లల కోసం ప్రత్యేక పార్క్ ఏర్పాటు, ప్రాజెక్ట్ పూర్తయిన 2 సంవత్సరాల పాటు పార్క్ ఆపరేషన్, దాని సంబంధించిన మెయింటెనెన్స్ కోసం అంచనాలు, వివరణాత్మక సర్వే, ప్రిపరేషన్ డిజైన్, డ్రాయింగ్లు, పర్యవేక్షణ, టెండర్లతో సహా వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదిక తయారీకి కన్సల్టెన్సీని నియమించాలని కోరుతూ ప్రతిపాదన కోసం అభ్యర్థన టెండర్ నోటీసును జారీ చేయడం, ఏజెన్సీ ను నియమించుకోవడం, డిజైన్ రూపొందించుకోవడం, దాని తదనంతరం తేదీ 14.03.2022 రోజున టెండర్ నోటీసు నంబర్: 38/కెఎస్సిసిఎల్/2021-22/1 ద్వారా కరీంనగర్ స్మార్ట్ సిటీ కార్పోరేషన్ లిమిటెడ్ రూ. Rs.3,05,96,165/- అంచనా విలువతో ఒక టెండర్ నోటీసును ఎస్ఆర్ఎస్వి ఇండస్ట్రీస్ వారికి కేటాయించడం అనేవి చక చక జరిగిపోయాయి. ఇది ఇలా ఉంటే తేదీ 30.06.2022 న జరిగిన కరీంనగర్ స్టార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ (కెఎస్సిసిఎల్) 13వ డైరెక్టర్ల బోర్డ్ సమావేశంలో స్మార్ట్ సిటీ మిషన్ కింద అమలు చేయాల్సిన ప్రాజెక్ట్ల తుది జాబితాను డైరెక్టర్ల ముందు ఉంచి, స్పెషల్గా ఏబుల్డ్ పార్క్ యొక్క ప్రోగ్రెస్ ను “సైట్ క్లీనింగ్”గా అధికారులు పేర్కొని, నోట్ ఆమోదించడానికి డైరెక్టర్ల ముందు ఉంచినప్పుడు వికలాంగ పిల్లల అవసరముల కొరకై కేటాయించబడిన సైట్ డిస్ప్యూట్ లో ఉన్నది అని ఎందుకో పేర్కొనలేదో అన్న విషయం 13 వ బోర్డు ఆఫ్ డైరెక్టర్ ల మీటింగ్ లో అధికారులు తెలపకపోవడం అనేక అనుమానాలకు తావీస్తుంది.
రీజయిండర్ లెటర్ మూడవ అంశం ప్రకారం 14 వ బోర్డు ఆఫ్ డైరెక్టర్ మీటింగ్ తేదీ: 03.01.2023 రోజున జరిగింది. ఈ మీటింగ్ లో స్పెషల్లీ ఎబుల్డ్ పార్క్ ప్రాజెక్ట్ ను జాబితాలో నుంచి తొలగించి, దానికి కేటాయించబడిన నిధులను స్మార్ట్ సిటీ ఫేస్-2 రోడ్లు, బుల్ సెమెన్ సెంటర్ లో సమీకృత మార్కెట్ నిర్మించుటకై బోర్డు ఆఫ్ డైరెక్టర్ ల మీటింగ్ లో ఆమోదించినట్లు వారు తెలిపారు. కానీ సైట్ డిస్ప్యూట్ లో ఉన్నందున ఈ సైట్ కు బదులుగా స్పెషల్లీ ఎబుల్డ్ పార్క్ ప్రాజెక్ట్ ను ఇంకొక సైట్ కు ఎందుకు మార్చలేదో అనే అనుమానాలు కలగడమే కాకుండా, వికలాంగులే కదా.. మనల్ని ఏం చేయగలరు అన్న అహంకార పూరిత దోరణితో నిధులను దారి మళ్లీంచారన్న అనుమాలు వికలాంగుల సంఘాలు వ్యక్తం చేస్తున్నారు.
స్మార్ట్ సిటీకి కేటాయించిన నిధులలో పెద్ద మొత్తంలో రోడ్లు, డ్రైనేజ్ పనులకు అధిక మొత్తంలో వినియోగించారు. కొంత భాగం మాత్రమే పార్క్లు ఇతరత్రా వాటికి కేటాయించడం జరిగింది. అయితే ఇక్కడ రోడ్లు, డ్రైనేజీ గుత్తేదారులకు బిల్లులు చెల్లించడానికి స్పెషల్లీ ఎబుల్డ్ పార్క్ ప్రాజెక్ట్కు కేటాయించిన నిధులను అధికారులు, గుత్తేదారులతో లోపాయకారి ఒప్పందం చేసుకొని దారి మళ్లీంచారని తెలుస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగుల హక్కుల చట్టం ప్రకారం వారికి వసతులు కల్పిస్తుంటే, కరీంనగర్ స్మార్ట్ సిటీలో భాగంగా స్పెషల్లీ ఎబుల్డ్ పార్క్ నిర్మాణం కోసం కేటాయించబడిన నిధులు దారి మళ్లీంచడం అత్యంత భాదాకరం. వికలాంగులకు కేటాయించిన నిధులను దారి మళ్లీంచడం, వికలాంగుల హక్కుల చట్టాన్ని ఉల్లంఘించడం అవుతుంది. కావున బోర్డ్ ఆప్ డైరెక్టర్స్ లపై, సంబంధిత అధికారులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని వికలాంగుల సంఘ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అదే విధంగా వెంటనే మరో చోట ఎబుల్డ్ పార్క్ నిర్మాణాన్ని చేపట్టాలని కోరుతున్నారు.