Friday, May 17, 2024

ఆంక్షల అమలులో అధికారులు విఫలం

తప్పక చదవండి
  • లజ్‌పత్ నగర వద్ద అత్యధికంగా 959 ఏక్యూఐ
  • ఆదివారం సాయంత్రం అత్యల్ప కాలుష్యం
  • టపాసులతో దారుణంగా పడిపోయిన గాలి నాణ్యత
  • ఆంక్షలను అతిక్రమించి.. టపాసుల మోత
  • గతేడాదితో పోల్చితే చాలా తక్కువగానే..
  • సుప్రీంకోర్టు నిషేధాన్ని పక్కనపెట్టి ఢిల్లీ వాసులు

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ నగరంలో రెండు రోజుల పాటు మెరుగుపడిన వాయు నాణ్యత సూచీ.. మళ్లీ దీపావళి పండుగ కారణంగా అమాంతం పెరిగిపోయింది. నిషేధిత రసాయనాలతో తయారు చేసిన టపాసులపై నిషేధం విధిస్తూ నవంబర్ 7న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పలువురు ఢిల్లీ వాసులు పక్కనపెట్టారు. నిషేధాజ్ఞలను ఉల్లంఘించి ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో టపాసులు కాల్చారు. షాపూర్ జాట్, హౌజ్ ఖాస్ ప్రాంతాల్లో క్రేకర్స్ మోత వినిపించింది. సాయంత్రం 4 గంటల తర్వాత టపాసుల మోత వినిపించిందని, అయితే గత ఏడాది కంటే చాలా తక్కువగా ఈ వాతావరణం కనిపించిందని స్థానికులు చెబుతున్నారు. అక్కడక్కడ కొంతమంది మినహా జనాలు పెద్దగా టపాసులు కాల్చడంపై ఆసక్తి చూపలేదని పేర్కొన్నారు. భారీగా టపాసులు, మందుగుండ పేల్చడంతో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. నగరంలోని చాలా చోట్ల ఏక్యూఐ 500పైగా నమోదుకాగా.. అక్కడక్కడ 900 వరకూ చేరడం గమనార్హం. సోమవారం ఉదయం 6 గంటలకు అత్యధికంగా లజ్‌పత్ నగర్ వద్ద 959 ఏక్యూఐ నమోదుకాగా.. తర్వాత జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం వద్ద 910, కరోల్ బాగ్ వద్ద 779 నమోదయ్యింది.

కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (సీపీసీబీ) నమోదిత కేంద్రాల సమాచారం ప్రకారం ఢిల్లీలో సగటున వాయు నాణ్యత 300గా నమోదయ్యింది. అంతేకాదు, గాల్లో పీఎం 2.5 కూడా కొన్ని చోట్ట 500 దాటేసింది. గాల్లో వాయు నాణ్యత సూచీ 0-50గా ఉంటే ఉత్తమంగా.. 51 నుంచి 100గా ఉంటే సంతృప్తికరం.. 101-200 ఉంటే సాధారణం.. 201-300 ఉంటే తీవ్రం, 301- 400 ఉంటే చాలా తీవ్రం, 401-450 అతి తీవ్రం, 450 దాటితే అత్యంత తీవ్రంగా పరిగణిస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నిర్దేశిత ప్రమాణాల ప్రకారం ఢిల్లీలో వాయు కాలుష్యం 80 నుంచి 100 శాతం అధికంగా ఉంది. ఆదివారం సాయంత్రం దేశ రాజధానిలో ఎనిమిదేళ్ల తర్వాత దీపావళి రోజున ఆకాశం స్పష్టంగా కనిపించింది. ఇలా దీపావళి పండుగ రోజున సూర్యరశ్మి సమృద్ధిగా లభించడం ఎనిమిది సంవత్సరాల తర్వాత ఇదే మొదటిసారి. సాయంత్రం 4 గంటలకు గాలి నాణ్యత సూచీ 218గా ఉంది. గత మూడు వారాల్లో నమోదైన అత్యల్ప ఏక్యూఐ ఇదే. కాగా, తీవ్ర వాయు కాలుష్యంతో సతమతమవుతోన్న ఢిల్లీవాసులకు నవంబరు 10న కురిసిన వర్షపు జల్లులు ఉపశమనం కలిగించాయి. రెండు రోజుల పాటు పలు చోట్ల మోస్తరు నుంచి సాధారణ వర్షాలు కురవడంతో కాలుష్య తీవ్రత తగ్గింది. దీపావళి రోజున కాల్చే టపాసులపై దేశవ్యాప్తంగా సుప్రీంకోర్టు గతవారం నిషేధం విధించింది. తమ ఉత్తర్వులు కేవలం ఢిల్లీకే పరిమితం కాదని, దేశం మొత్తానికి వర్తిస్తాయని స్పష్టం చేసింది. అంతేకాదు, గత సెప్టెంబరులో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం టపాసులను నిషేధిస్తూ తీసుకున్న నిర్ణయంపై జోక్యం చేసుకోడానికి కూడా నిరాకరించింది. ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని స్పష్టం చేసింది. ఇదే సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం మానేసి, కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోవాలని సూచించింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు