- పదో సీజన్ వేలంలో భారీ ధర పలికిన కబడ్డీ ఆటగాళ్ళు..
- 2 కోట్ల మార్కు దాటిన ముగ్గురు ఆటగాళ్లు..
- రెండు రోజుల వేలంలో 118 మంది ఆటగాళ్లు అమ్ముడయ్యారు
- వేలం చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా పవన్ సెహ్రావత్ తన సొంత రికార్డును బద్దలు కొట్టాడు
- మహ్మద్రెజా షాద్లౌయ్ చియానే అత్యంత ఖరీదైన విదేశీ ఆటగాడిగా నిలిచాడు
- లీగ్ చరిత్రలో అత్యంత ఖరీదైన డిఫెండర్గా ఫజెల్ అత్రాచలి తన రికార్డును నిలబెట్టుకున్నాడు
- కేటగిరీ– సి ఆటగాళ్ళలో అమీర్ మహ్మద్ జఫర్దానేష్ అత్యధిక మొత్తం అందుకున్నాడు
- డి– కేటగిరీ ఆటగాళ్లలో నితిన్ కుమార్ అత్యధిక బిడ్గా సాధించాడు
హైదరాబాద్ : ప్రో కబడ్డీ లీగ్ (పీకేఎల్) సీజన్– 10 ఆటగాళ్ల వేలాన్ని మషాల్ స్పోర్ట్స్ 9,-10 వ తేదీల్లో ముంబైలో విజయవంతంగా నిర్వహించింది. తెలుగు టైటాన్స్ ఏకంగా 2.6 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన పవన్ సెహ్రావత్ లీగ్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. రెండు రోజుల పాటు జరిగిన ప్లేయర్ వేలంలో మొత్తం 118 మంది ఆటగాళ్లు 12 ఫ్రాంచైజీల్లో చోటు దక్కించుకున్నారు.
సి కేటగిరీలో ఇరానియన్ల జాక్ పాట్
ఇరాన్కు చెందిన అమీర్ మహమ్మద్ జఫర్దానేష్ ఈ ఏడాది ఆటగాళ్ల వేలంలో సి కేటగిరీలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. అతడిని యు ముంబా రూ. 68 లక్షలకు కొనుగోలు చేసింది. అదే దేశానికి చెందిన జఫర్దానేష్ స్వదేశీయుడు అమీర్ హోస్సేన్ బస్తామిని తమిళ్ తలైవాస్ రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది.
డి కేటగిరీ ప్లేయర్లకూ భారీ మొత్తం
బెంగాల్ వారియర్స్32.2 లక్షలకు కొనుగోలు చేసిన నితిన్ కుమార్ డి కేటగిరీలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. మసనముత్తు లక్ష్మణన్ ను తమిళ్ తలైవాస్ జట్టు రూ31.6 లక్షలకు సొంతం చేసుకోగా.. అంకిత్ను రూ. 31.5 లక్షలకు పాట్నా పైరేట్స్ కొనుగోలు చేసింది. వేలంలో రికార్డు స్థాయి ధర దక్కించుకోవడంపై స్టార్ రైడర్ పవన్ సెహ్రావత్ సంతోషం వ్యక్తం చేశాడు. జట్టుకు టైటిల్ అందించేందుకు తనవంతు కృషి చేస్తానని చెప్పాడు. ’జట్టు పట్ల నాకు బాధ్యత ఉంది. ఒక ఫ్రాంచైజీ ఓ ఆటగాడిని ఇంత ఎక్కువ ధరకు కొనుగోలు చేసినట్లయితే అతను తమ జట్టును టైటిల్ కు చేరువ చేయాలని కచ్చితంగా కోరుకుంటుంది. ఈ విషయంలో తెలుగు టైటాన్స్ కోసం నా బాధ్యతలను తప్పకుండా నిర్వర్తిస్తాను’ అని తెలిపాడు.
పీకేఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన డిఫెండర్ గా గుజరాత్ జెయింట్స్ సొంతం చేసుకున్న ఫజల్ అత్రాచలి మాట్లాడుతూ, గుజరాత్ జెయింట్స్లో చేరడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది చాలా మంచి టీమ్. ఈ జట్టు తరఫున నేను ఐదో సీజన్ ఆడాను. ఆటగాళ్లను ఎలా చూసుకోవాలో వారికి తెలుసు. నన్ను మళ్లీ జట్టులోకి తీసుకున్నందుకు ఆనందంగా ఉంది’ అని తెలిపాడు. మషాల్ స్పోర్ట్స్ సంస్థ స్పోర్ట్స్ లీగ్స్ అధినేత, లీగ్ కమిషనర్ అనుపమ్ గోస్వామి ప్రో కబడ్డీ లీగ్ తరపున మాట్లాడుతూ ‘మరో అసాధారణమైన పీకేఎల్ ఆటగాళ్ల వేలాన్ని విజయవంతంగా నిర్వహించిన లీగ్ వాటాదారులను, మషాల్ టీమ్ని అభినందిస్తున్నా. ప్రారంభ రోజు ఎ, బి కేటగిరీల్లో స్టార్ ప్లేయర్లు రికార్డు బ్రేకింగ్ బిడ్ల తర్వాత రెండు రోజు డి కేటగిరీలో కూడా అద్భుతమైన బిడ్లను చూశాము. లీగ్ మొత్తం టాలెంట్ పూల్ పై పీకేఎల్ జట్లకు నమ్మకం ఉండటం నిజంగా గొప్ప విషయం. ఇది లీగ్ విజయాన్ని కొనసాగించడంతో పాటు కబడ్డీ క్రీడాకారులకు అపార అవకాశాలను అందిస్తుంది’ అని పేర్కొన్నారు.