- తమ హక్కులకోసం పోరాటం చేస్తున్నారు..
- ఈ పోరాటం నిరంతరం కొనసాగుతుంది..
- చేవెళ్లలో పండగ సాయన్న విగ్రహావిష్కరణ..
- కార్యక్రమంలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్..
- హాజరైన పలువురు ప్రముఖులు..
తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజుల తిరుగుబాటు ఒక ఉప్పెనలా దూసుకునిపోతోంది.. తమ హక్కులకోసం దశ దిశలా నినదిస్తున్నారు.. ముదిరాజులు ఒకే తాటిపైకి రావడం ముదావహం.. బహుజనుల రాజ్యం ఏర్పడటానికి ఈ ఉద్యమం మరింత ప్రాణం పోస్తుంది అనడానికి ఎలాంటి అనుమానం లేదు..
హైదరాబాద్ : రాష్ట్రంలో ముదిరాజ్లు అంతా ఒకేతాటిపైకి వచ్చి తమ హక్కులకోసం పోరాటం చేస్తున్నారని ఎన్ఎంఆర్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షులు నీలం మధు ముదిరాజ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం, చేవెళ్ల పట్టణంలో పండగసాయన్న విగ్రహావిష్కరణకు స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య, సంగారెడ్డి నియోజకవర్గ బిజెపి నాయకులు పులిమామిడి రాజు, కాసాని వీరేష్, బిత్తిరి సత్తి, దగడ్ సాయి గార్లతో కలిసి హాజరైన నీలం మధు ముదిరాజ్కు ఘన స్వాగతం పలికారు. అనంతరం నిర్వాహకులు నీలం మధు ముదిరాజ్ను ఘనంగా సత్కరించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ముదిరాజ్లు రాజ్యాధికారం కోసం ఏకమై పోరాటానికి సిద్ధం అవుతున్నారని తెలిపారు. పార్టీలు గుర్తించకపోవడంతో నష్టపోయే అవకాశం ఉందని తెలిపారు. జనాభా ప్రాతిపదికన ముదిరాజ్లకు అన్ని పార్టీలు టికెట్లు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో స్వతంత్రంగా పోటీకి దిగి వారి బలాన్ని నిరూపించుకుంటామని హెచ్చరించారు.. స్థానిక ప్రజాప్రతినిధులు, సంఘం పెద్దలు, ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.