Sunday, April 28, 2024

నేడే నాగర్ కర్నూల్ లో బీజేపీ ‘‘నవ సంకల్ప సభ‘‘

తప్పక చదవండి
  • సాయంత్రం 4 గంటలకు సభకు హాజరు కానున్న బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా
  • మోదీ 9 ఏళ్ల విజయాలు… కేసీఆర్ వైఫల్యాలను ఎండగట్టనున్న నడ్డా
  • ‘‘సంపర్క్ సే సమర్ధన్’’లో భాగంగా ఇద్దరు ప్రముఖులను కలవనున్న నడ్డా
  • మోదీ 9 ఏళ్ల పాలనను వివరిస్తూ పుస్తకాన్ని అందజేయనున్న జేపీ
  • సభ సక్సెస్ తో చరిత్ర సృష్టిద్దామన్న బండి సంజయ్
  • మీ దమ్ము చూపాలంటూ బీజేపీ కార్యకర్తలకు బండి పిలుపు
  • నాగర్ కర్నూల్ జిల్లా పోలింగ్ బూత్ అధ్యక్షులతో బండి సంజయ్ టెలికాన్ఫరెన్స్..

( నాగర్ కర్నూలు జిల్లాలో బీజేపీ దమ్ము చూపే అవకాశం వచ్చింది. రేపటి జేపీ నడ్డా హాజరయ్యే బహిరంగ సభను కనీవినీ ఎరగని రీతిలో సక్సెస్ చేసి సత్తా చాటాలి : బండి సంజయ్.. )

హైదరాబాద్, 24 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :
‘‘మహా జనసంపర్క్ అభియాన్’’లో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో నేడు సాయంత్రం 4 గంటలకు బీజేపీ నిర్వహించబోయే బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పార్టీ జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాశ్ నడ్డా ఈ బహిరంగ సభకు హాజరై దిశానిర్దేశం చేయనున్న నేపథ్యంలో ఈ సభకు ప్రాధాన్యత ఏర్పడింది. మోదీ 9 ఏళ్ల పాలన పూర్తయిన నేపథ్యంలో ఈ బహిరంగ సభకు ‘‘నవ సంకల్ప సభ‘‘ అని నామకరణం చేశారు. నేటి మధ్యాహ్నం 12 గంటలకు జేపీ నడ్డా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు రానున్నారు. అక్కడి నుండి నేరుగా నోవాటెల్ చేరుకుని భోజనం చేస్తారు. అటు నుండి ‘‘సంపర్క్ సే సమర్థన్‘‘ లో భాగంగా టోలిచౌక్ లోని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్, జూబ్లిహిల్స్ ఫిల్మ్ నగర్ లోని పద్మశ్రీ ఆనంద శంకర్ జయంతిల నివాసాలకు వెళతారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ 9 ఏళ్ల పాలన విజయాలను వివరించడంతోపాటు మోదీ ప్రభుత్వం సాధించిన ప్రగతిపై పుస్తకాలను అందజేస్తారు. అక్కడి నుండి సాయంత్రం 4 గంటలకు శంషాబాద్ వెళ్లి ప్రత్యేక హెలికాప్టర్ లో నాగర్ కర్నూలు చేరుకుంటారు. నేరుగా జడ్పీ హైస్కూలు మైదానంలో నిర్వహించే బహిరంగ సభకు హాజరవుతారు. దాదాపు గంటన్నరపాటు సభలోనే ఉంటారు. ఈ సందర్భంగా మోదీ 9 ఏళ్ల పాలనలో సాధించిన ప్రగతి, అభివృద్ధి, సంక్షేమ పథకాలతోపాటు కేసీఆర్ సర్కార్ వైఫల్యాలను ఎండగడతారు.

- Advertisement -

ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ నేటి బహిరంగ సభ ఏర్పాట్లపై నాగర్ కర్నూలు జిల్లాలోని పార్టీ పోలింగ్ బూత్ అధ్యక్షులు, ఆ పై స్థాయి నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్ తో కలిసి సంజయ్ మాట్లాడారు..

నాగర్ కర్నూలు జిల్లాలో బీజేపీ దమ్ము చూపే అవకాశం వచ్చింది. రేపటి జేపీ నడ్డా హాజరయ్యే బహిరంగ సభను కనీవినీ ఎరగని రీతిలో సక్సెస్ చేసి సత్తా చాటాలి. ఒకవైపు బీఆర్ఎస్-కాంగ్రెస్ పార్టీలు కలిసి బీజేపీని దెబ్బతీసేందుకు ఏ విధంగా కుట్రలు చేస్తున్నాయో మనందరికీ తెలుసు. బీఆర్ఎస్-కాంగ్రెస్ ఎప్పటి నుండో కలిసే పోటీ చేస్తున్నయ్. పార్లమెంట్ లోపల బయటా కలిసే బీజేపీకి వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. తెలంగాణలోని 30 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు కేసీఆర్ డబ్బులు పంపిణీ చేశారు. రెండు పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా ఇప్పటి వరకు జరిగిన ఉప ఎన్నికల్లో ప్రజలు బీజేపీనే ఆదరిస్తూ వస్తున్నారు. కాంగ్రెస్ కు డిపాజిట్లు గల్లంతు చేస్తున్నారు. పెరుగుతున్న బీజేపీ గ్రాఫ్ ను దెబ్బతీసేందుకు కేసీఆర్, కాంగ్రెస్ నేతలు ప్రజల్లో తప్పుడు ప్రచారాలతో అయోమయం సృష్టిస్తూ కలిసి కుట్ర చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో జేపీ నడ్డా హాజరయ్యే బహిరంగ సభ కీలకం కానుంది. మోదీ 9 ఏళ్ల పాలనలో సాధించిన విజయాలతోపాటు కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టబోతున్నారు. ఈ తరుణంలో ప్రతి ఒక్క కార్యకర్త సభకు హాజరుకావడంతోపాటు తనతోపాటు ఒక్కో కార్యకర్త 50 మందిని తీసుకుని రావాలి. భారతమాతా కీ జై… జై శ్రీరాం… వందేమాతరం నినాదాలతో నేటి బహిరంగ సభ మారుమోగాలి. కనీవినీ ఎరగని రీతిలో సభను సక్సెస్ చేయాలి. దేశవ్యాప్తంగా చర్చ జరిగేలా సభ నిర్వహించాలి. తద్వారా నాగర్ కర్నూలు కార్యకర్తలు సత్తా చాటాలి. తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు. కలిసికట్టుగా పనిచేసి సభను విజయవంతం చేయాలని కోరారు బండి సంజయ్..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు