Monday, May 13, 2024

ఉద్యోగాల పేరుతో గురుకుల ఉద్యోగి శఠగోపం..

తప్పక చదవండి
  • గురుకుల పాఠశాలలో అవుట్సోర్సింగ్ అటెండర్ చేతివాటం..
  • 50 రోజులుగా పాఠశాల విధులకు ఎగనామం..
  • కోటి రూపాయలతో పరారైన కిలాడి లేడీ..
  • దాదాపు 70 మంది బాధితులకు టోకరా.
  • లబోదిబోమని తలపట్టుకున్న బాధితులు.

వైరా, 24 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :
గురుకుల పాఠశాలల్లో ఔట్ సోర్సింగ్ అటెండర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి అక్రమంగా వసూలు చేసిన సుమారు రూ. కోటితో ఓ కిలాడీ లేడీ ఉడాయించి ఘరానా మోసానికి పాల్పడింది. దీంతో ఆ కిలాడి లేడీకి నగదు చెల్లించిన బాధితులు లబోదిబోమంటున్నారు. ఖమ్మం జిల్లా వైరా మండలంలోని రెబ్బవరం గ్రామంలో ఉన్న మహాత్మ జ్యోతిబాపూలే బీసీ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో ఔట్ సోర్సింగ్‌లో అటెండర్‌గా పనిచేస్తున్న బాజి జ్యోతి గురుకుల పాఠశాలల్లో అటెండర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికి ఒక్కొక్కరి వద్ద రూ. 1.50 లక్షలు చొప్పున సుమారు 70 మంది వద్ద కోటి రూపాయలకు పైగా అక్రమంగా వసూలు చేసింది. నగదు చెల్లించి ఆరు నెలలు గడుస్తున్నా ఉద్యోగాలు ఇప్పించకపోవడంతో బాధితులు ఆమెపై ఒత్తిడి పెంచడంతో సుమారు నెలన్నర క్రితం పరారైంది. అప్పటినుంచి ఇప్పటివరకు ఆమె ఆచూకీ కనీసం లభించలేదు.

జిల్లాలోని గురుకుల పాఠశాలల్లో అవుట్ సోర్సింగ్ అటెండర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, హైదరాబాద్ లో తనకు సంబంధం ఉన్న ఉన్నతాధికారుల ద్వారా ఆ ఉద్యోగాలు ఇప్పిస్తానని ఆమె నమ్మ పలికింది. ఒక్కో ఉద్యోగానికి రూ.3 లక్షలు చెల్లించాలని ఆ కిలాడీ లేడి బాధితులకు స్పష్టం చేసింది. ముందుగా రూ.1.50 లక్షల నగదు అడ్వాన్స్ చెల్లించాలని, 15 రోజుల్లో ఉద్యోగం వస్తుందని.. ఆ తర్వాత మిగిలిన రూ. 1.50 లక్షలు ఇవ్వాల్సి ఉంటుందని ఆమె పేర్కొంది. నాపై నమ్మకం లేకుంటే ముందుగా మీరిచ్చే నగదుకు ప్రామిసరి నోటు రాసిస్తానని హామీ ఇచ్చింది. ఆ మేరకు నగదు చెల్లించిన ప్రతి ఒక్కరికి లక్షన్నర రూపాయలతో ఆమె ప్రామిసరీ నోటు రాసి ఇచ్చింది. దీంతో నమ్మిన అమాయక ప్రజలు తమ పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని ఆశపడి సుమారు జిల్లాలో 70 మంది ఆమెకు రూ.1.50 లక్షలు లెక్క చెల్లించినట్లు తెలిసింది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగంలో చేరిన తర్వాత మొదటి మూడు సంవత్సరాలు నెలకు రూ. 25000 జీతం వస్తుందని, ఆ తర్వాత ఉద్యోగం పర్మినెంట్ అయి రూ.40 వేల జీతం వస్తుందని ఆమె బాధితులకు ఆశ చూపింది. ప్రామిసరీ నోటు రాసి ఇవ్వటంతో పాటు ఉద్యోగం పర్మినెంట్ అవుతుందని నమ్మ పలకడంతో నిరుపేదలు వడ్డీకి అప్పుచేసి, బంగారు నగలు తాకట్టు పెట్టి ఆమెకు నగదును చెల్లించారు. ఆమె గత మే నెల 9వ తేదీ నుంచి కనిపించకుండా పోయింది . ఈ కిలాడీ లేడీ వైరా మండలంలోని వైరా, గౌండ్లపాలెం, రెబ్బవరం, ముసలమడుగు, సిరిపురం, కొణిజర్ల మండలం చిన్న మునగాల, పెద్ద మునగాల బోనకల్లు మండలం బ్రాహ్మణపల్లి, కలకోట గ్రామాలతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆమె అక్రమ వసూళ్లకు పాల్పడింది. సుమారు 70 మందికి పైగా బాధితుల నుంచి ఆ కిలాడీ లేడి కోటి రూపాయలకు పైగా అక్రమంగా వసూలు చేసి ఉడాయించింది. ప్రస్తుతం కిరాయికి ఉన్న ఇంటి చుట్టూ, రెబ్బవరంలోని గురుకుల పాఠశాల చుట్టూ ప్రదిక్షణలు చేస్తున్నారు. కాగా వైరా మండలం రెబ్బవరం గ్రామంలో ఉన్న మహాత్మ జ్యోతిబాపూలే బిసి వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో ఔట్ సోర్సింగ్ విధానంలో అటెండర్‌గా పనిచేస్తున్న కిలాడీ లేడీ బాజి జ్యోతి ఏలాంటి సమాచారం లేకుండా 50 రోజులుగా తన విధులకు ఏగనామం పెట్టింది . ఈ ఏడాది మే మూడో తేదీ నుంచి ఆమె పాఠశాలలో విధులకు హాజరు కావడం లేదు. దీంతో బాతులు లబోదిబోమంటున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు