- ఇరు రాష్ట్రాల్లో కొందరు నేతల ఇళ్లల్లో దాడులు..
- న్యాయవాదులు, పౌరహక్కుల నేతల ఇళ్లల్లో కూడా..
- ఎలాంటి అధికారిక ప్రకటన చేయని అధికారులు..
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఆంధ్రప్రదేశ్తో పాటు, తెలంగాణలోనూ సోమవారం కొందరు నేతల ఇళ్లలో సోదాలు జరగడం అందరినీ కలవరానికి గురి చేసింది. మొత్తం 60 చోట్ల ఒకకాలంలో సోదా లు జరుగుతుననట్లు తెలుస్తోంది. కొందరు న్యాయ వాదులు, పౌరహక్కుల సంఘం నేతల ఇళ్లలో సోదా లు కొనసాగుతున్నట్లు సమాచారం. అమర బంధు మిత్రుల సంఘం, పౌర హక్కుల నేతల సంఘం ఇళ్లలో సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ఏపీ విషయానికొస్తే.. నెల్లూరు జిల్లాలోని వెంకటేశ్వర్లు, తిరుపతిలో క్రాంతి చైతన్య, హైదరాబాద్ లోని భవాని, అన్నపూర్ణ, అనూష, పౌర హక్కుల సంఘం నేత సురేష్ ఇంట్లో ఎన్ఐఏ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. అయితే ఈ సోదాలు ఎందుకు జరుగుతున్నాయన్న దానిపై మాత్రం ఇప్పటి వరకు అధికారులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఎన్ఐఏ సోదాల నేపథ్యంలో స్థానిక పోలీసులు భారీ ఎత్తున బందోబస్తును ఏర్పాటు చేశారు.
అంతేకాకుండా తిరుపతిలో ఉన్న న్యాయవాది క్రాంతి చైతన్య, నెల్లూరులో ఉన్న అరుణ, గుంటూరుకు చెందిన డాక్టర్ రాజారావు, ప్రకాశంలోని చీమకుర్తికి చెందిన దుడ్డు వెంకట్రావు, సంతమాగూలూరులో ఓరు శ్రీనివాస రావు, రాజమంత్రిలోని బొమ్మెరలో పౌర హక్కుల నేత నాజర్, హార్లిక్స్ ఉద్యోగి కోనాల లాజర్, శ్రీకాకుళం జిల్లాలో కేఎన్పీఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మిస్కా కృష్ణయ్య ఇళ్లలో కూడా ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.