Tuesday, May 7, 2024

మోదీ మనసు నిండా విషం : మండలి చైర్మన్‌ గుత్తా

తప్పక చదవండి

నల్లగొండ: ప్రధాని మోదీ పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ తెలంగాణపై విషం చిమ్మారని మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి విమర్శించారు. గుజరాత్‌లో రక్తపుటేరులు పారిన సంఘటనలు ఇంకా మోదీ మరచిపోనట్లు లేదని, అవే ఇప్పటికీ మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. 2003లో బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌ రావుతో కలిసి నల్లగొండలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. బీజేపీ చేసిన అన్యాయాలు అక్రమాలు అన్నీ ఇన్నీ కావన్నారు. ఆంధ్ర పాలకుల ఒత్తిళ్లకు లొంగి 1969లో తెలంగాణ ఇవ్వలేదని, ఉద్యమ నాయకుడు కేసీఆర్ అలుపెరుగని పోరాటంతో దిగివచ్చిన కేంద్రం ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారని చెప్పారు. ప్రజల ఒత్తిడి మేరకు తెలంగాణ ఏర్పాటు అయిందని స్పష్టం చేశారు. మోదీ మనసు నిండా విషం ఉందని, ప్రధాని మాట్లాడే దాంట్లో అర్థం లేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభ్యపెట్టేలా హామీలు ఇస్తున్నదని చెప్పారు. గ్యారంటీ హామీలన్నీ ఉత్తివేనని, ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రల్లో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏం చేయాలన్నా సీఎం కేసీఆర్ వల్లే సాధ్యమవుతుందని, అది తెలంగాణ ప్రజలకు తెలుసన్నారు. కాంగ్రెస్ చెప్పేవన్నీ బోగస్ అని, ఆ హామీలు ఆచరణలో సాధ్యం కాదని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌కు ఓ విజన్ లేదని, వారికి అధికారం దాహమే ఉందని విమర్శించారు. గ్యారంటీ హామీల్లో రూ.2 లక్షల రుణమాఫీని ఎందుకు మర్చిపోయారని నిలదీశారు. కాంగ్రెస్, బీజేపీల కల్లబొల్లి మాటలు ప్రజలు నమ్మొద్దని సూచించారు. తెలంగాణ కోసం రాజీనామా చేయమంటే పారిపోయిన వ్యక్తి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అని విమర్శించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టడమే ఆ పార్టీ పని అన్నారు. పువ్వు గుర్తు పార్టీ పతనం ప్రారంభమైందని చెప్పారు. అందుకే మళ్లీ మహిళ రిజర్వేషన్ బిల్లు అంటూ హడావిడి చేస్తున్నారని చెప్పారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు