Monday, May 20, 2024

కెసిఆర్‌ పై పోటీ అంటే పోచమ్మ గుడి ముందే పోట్టేలును కట్టేసినట్టే : మంత్రి కెటిఆర్‌

తప్పక చదవండి

కామారెడ్డి : ముఖ్యమంత్రి కేసీఆర్‌ కొడంగల్‌కు రాకపోతే తానే కామారెడ్డిలో కేసీఆర్‌పై పోటీ చేసి ఓడిస్తనని పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ చురకలు వేశారు. కేసీఆర్‌ను సవాల్‌ చేసుడంటే పోచమ్మ గుడి ముందు పొట్టేలును కట్టేసినట్టే అని రేవంత్‌ను హెచ్చరించారు. కామారెడ్డి నియోజకవర్గంలోని బిక్నూరులో పార్టీ శ్రేణులతో నిర్వహించిన సభలో బుధవారం మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఉద్యమ సమయంలో తెలంగాణ బిడ్డలపై తుపాకీ ఎక్కుపెట్టిన రైఫిల్‌ రెడ్డి కేసీఆర్‌ను ఓడిస్తడట కామారెడ్డిల. కేసీఆర్‌ ఆగస్టు 21వ తేదీన కామారెడ్డిలో పోటీ చేస్తనని ప్రకటించినప్పటి నుంచి ప్రతిపక్షాలకు ఫ్యూజ్‌లు ఎగిరిపోయినయ్‌. అందుకే ఏదోదో మాట్లాడుతున్నరు. కేసీఆర్‌ ఏదో చెడగొడుతందుకు వస్తున్నడని దుష్ప్రచారం చేస్తున్నరు. వాస్తవానికి సీఎం కేసీఆర్‌ కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసమే కేసీఆర్‌ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నడు. నవంబర్‌ 9 తారీఖు నాడు కేసీఆర్‌ నామినేషన్‌ వేస్తుండ్రు. ఆ రోజు ఇంటికి ఒక్కరు చొప్పున కేసీఆర్‌ సభకు తరలిరావాలి’ అని పిలుపునిచ్చారు. ‘కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు వస్తడంటరు. అట్లనే ఇప్పుడు కామారెడ్డికి కేసీఆర్‌ వస్తున్నరు. కామారెడ్డిలో షబ్బీర్‌ అలీ ఇప్పటికే గంపన్న చేతిలో ఓడిపోయిండు. ఇప్పుడు కేసీఆర్‌ పోటీకి వస్తుండంటే ఆయన పోటీకి భయపడుతుండు. బీజేపీ ఆయన కూడా కేసీఆర్‌ విూద పోటీ అంటే వెనుకముందు అయితున్నడు. ఎన్నికల్లో ఎవని ప్రలోభాలకు లొంగొద్దు. బీజేపోడు ఇచ్చే పిప్పర్‌ మెంట్లకు, బిస్కెట్లకు ఆశపడొద్దు. కేసీఆర్‌ను గెలిపించుకుని ధమ్‌ బిర్యానీ తినాలి. కాంగ్రెసోడు, బీజేపోడు ఓటు కోసం ఏమిచ్చినా తీసుకోండ్రి. బీజేపోళ్లు సలాకా ఇచ్చినా తీసుకోండ్రి, సిమెంటు ఇచ్చినా తీసుకోండ్రి. ఎందుకంటే అవన్నీ మనల్ని ముంచి ఎత్తుకెళ్లిన గుజరాత్‌ దొంగ పైసలు. ఎవరేమిచ్చినా తీసుకుని ఓటు మాత్రం కేసీఆర్‌కే గుద్దుండ్రి. మోసాన్ని మోసంతోటే జయించాలి. ముల్లుముల్లుతోటే తియ్యాలి’ అని మంత్రి కేటీఆర్‌ హితవు పలికారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు