- ఎంఐఎం తొలి జాబితా విడుదల
- గతంలో ఏడు స్థానాల్లోనే పోటీ
- ఆరుగురి పేర్లతో తొలి జాబితా
- మిగతా మూడు స్థానాలు త్వరలో వెల్లడి
- అభ్యర్థులను ప్రకటించిన ఎంపీ అసదుద్దీన్
హైదరాబాద్ : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీలు తమ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించి ప్రచారం ముమ్మరం చేస్తున్నాయి. ఏఐఎంఐఎం అభ్యర్థుల తొలి జాబితాను పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ శుక్రవారం సాయంత్రం విడుదల చేశారు. తొలి జాబితాలో ఆరుగురి పేర్లను ప్రకటించారు. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే తమ అసెంబ్లీ సీట్లే కీలకమని, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల్లో తొమ్మిది చోట్ల పోటీ చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఎంఐఎం ప్రాతినిద్యం వహిస్తున్న చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకత్పురా, బహదూర్పురా, నాంపల్లి, కార్వాన్, మలక్పేట్తోపాటు ఈసారి జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్ సెగ్మెంట్లలో బరిలోకి దిగుతున్నట్లు పేర్కొన్నారు. జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్, బహదూర్పూర్ సెగ్మెంట్లలో అభ్యర్థుల పేర్లను త్వరలో ప్రకటిస్తామని ఆయన స్పష్టంచేశారు. జూబ్లీహిల్స్ రాజేంద్రనగర్ సెగ్మెంట్లలో ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ రెండు సీట్లలో ఈ సారి అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య పోటీ హోరాహోరీగా ఉండగా, ఎంఐఎం ఎంట్రితో పోరు మరింత రసవత్తరంగా మారనుంది.ఈ సారి తొమ్మిది స్థానాల్లో పోటీ చేస్తామని, మిగిలిన మూడు స్థానాల అభ్యర్థులను త్వరలో ప్రకటించనున్నట్లు ఆయన తెలిపారు.
ఎంఐఎం పార్టీ తొలి జాబితా..
చార్మినార్- జుల్ఫికర్ అహ్మద్
చాంద్రయాణ్ గుట్ట – అక్బరుద్దీన్ ఓవైసీ
మలక్ పేట – అహ్మద్ బలాలా
నాంపల్లి- మజీద్ హుస్సేన్
కార్వాన్ – కౌసిర్ మోహిద్దీన్
యాకత్ పురా – జఫార్ హుస్సేన్ మిరాజ్