- అమ్మవార్లను దర్శించుకుంటానన్న సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం మహా జాతర పోస్టర్ను ఆవిష్కరించారు. రాష్ట్ర సచివాలయంలో శనివారం మేడారంలోని సమ్మక్క సారలమ్మ పోస్టర్ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫిబ్రవరి 23న మేడారం జాతరకు వెళ్లి సమ్మక్క సారలమ్మను దర్శించుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి మేడారం పూజారుల సంఘం సభ్యులకు హామీ ఇచ్చారు. ములుగు జిల్లా మేడారంలోని సమ్మక్క సారలమ్మ మేడారం జాతరకు రావాలని సీఎం రేవంత్రెడ్డికి ఆహ్వానం అందింది. మేడారం ఆలయ పూజారుల సంఘం సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వాన పత్రికను సచివాలయంలో శనివారం అందజేసింది. వచ్చే నెలలో జరుగనున్న మేడారం జాతర ఏర్పాట్లు, సంబంధిత పనులపై దేవాదాయశాఖ అధికారులు సీఎం రేవంత్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. మంత్రులు సీతక్క, పొంగులేటిశ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ సమక్షంలో మేడారం జాతర పోస్టర్ ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.