Saturday, July 27, 2024

గెలుపుపై ఎవరి ధీమా వారిదే

తప్పక చదవండి
  • విజయం తమదే అన్న భరోసాలో కెసిఆర్‌
  • ఎగ్జిట్‌ పోల్స్‌తో కాంగ్రెస్‌లో ధీమా
  • 3 వరకు అన్ని పార్టీల్లోనూ టెన్షన్‌

హైదరాబాద్‌ : ఓ వైపు బిఆర్‌ఎస్‌లో అధికారం తమదే అన్న ధీమా..మరోవపై ఎగ్జిట్‌ పోల్స్‌తో కాంగ్రెస్‌లో అధికారం తమదే అన్న భావన బలపడిన నేపథ్యంలో 3న ఎవరి భవితవ్యం ఏంటన్నది బయటపడనుంది. అయితే కాంగ్రెస్‌ మాత్రం అధికారంలోకి రావడం ఖాయమన్న రీతిలో ఏర్పాట్లు చేసుకుంటోంది. సిఎం కెసిఆర్‌ మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. 4న కేబినేట్‌ భేటీకి ఆదేశించారు. విజయం మనదే అని పార్టీ శ్రేణలుకు భరోసా ఇచ్చారు. కాంగ్రెస్‌ కూడా ఇదే ధీమాతో ఉంది. 3 వరకు అన్ని పార్టీలకు టెన్షన్‌ తప్పేలా లేదు. ఎవరు విజేతలో..ఎవరు పరాజితులో అన్న ఫలితం కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఒక వైపు.. ఎగ్జిట్‌ పోల్స్‌.. మరోవైపు రూరల్‌ ప్రాంతాల్లో నమోదైన ఓటింగ్‌ శాతాన్ని బట్టి ఈసారి అధికారం తమదేనని కాంగ్రెస్‌ భావిస్తోంది. మరీ ఎవరు రాజు.. ఎవరు రాణినో తెలియాలంటే డిసెంబర్‌ 3 వరకు ఆగాల్సి ఉంది. ప్రజల నాడీ ఎటువైపు ఉందో.. కౌంటింగ్‌ ప్రారంభమైన 2, 3 గంటలకు తేలనుంది. ఎగ్జిట్‌ పోల్స్‌ నిజమవుతాయా లేకుంటే అట్టర్‌ ప్లాప్‌ అవుతాయా అన్నది మరికొన్ని గంటల్లోనే క్లియర్‌ కట్‌గా తెలిసిపోనుంది.మరోవైపు తెలంగాణలో ఓటర్ల తీర్పుపై తెలుగు రాష్టాల్రతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగోళ్లు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఐదు రాష్టాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినా.. ఈసారి మాత్రం తెలంగాణలో ఎవరు గెలుస్తారన్న చర్చ నడుస్తోంది. వాస్తవానికి తెలంగాణలో కంటే పొరుగు రాష్టాల్లోన్రే ఎక్కువ ఆసక్తి నెలకొంది. పెద్ద ఎత్తున బెట్టింగ్‌లు కూడా కాస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక గెలుపుపై ఎవరి అంచనాలు వాళ్లకు ఉన్నాయి. పోలింగ్‌ ముగిసిన అనంతరం వెలువడిన ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలతో నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అంచనాలు తారుమారు కావడంతో ఒక విధమైన ఆందోళన మొదలైంది. పైకి గాంభీర్యంగా మేమే అధికారంలోకి వస్తామని చెప్పుకుంటున్నా.. లోలోపల మాత్రం తెలియని టెన్షన్‌ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక దాదాపుగా ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలన్నీ కాంగ్రెస్‌ వైపే మొగ్గు చూపాయి. ఈసారి హస్తం హవా బాగా ప్రభావం చూపినట్లుగా కనిపిస్తోంది. అర్బన్‌ ఏరియాలో ఎలాగున్నా… రూరల్‌ ఏరియాలో మాత్రం చాలా బిగ్‌ ఛేంజ్‌ కనిపించినట్లుగా ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలను బట్టి అర్థమవుతోంది. ముఖ్యంగా దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్‌ గాలి బాగా వీచినట్లుగా తేటతెల్లమవుతోంది. ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో కాంగ్రెస్‌ క్లీన్‌ స్వీప్‌ చేయొచ్చని అంచనాలు వేస్తున్నారు. అంతేకాకుండా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో కూడా చెయ్యి పార్టీకి ఊహించని విజయం దక్కొచ్చని సర్వేలు చెప్పుకొస్తున్నాయి. అలాగే మిగిలిన జిల్లాల్లో కూడా ఈసారి ఓ మోస్తరు నుంచి అధిక శాతం సీట్ల గెలుపొందుతామని కాంగ్రెస్‌ ధీమా వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా సింగరేణి ప్రాంత ఓటర్లతో పాటు నిరుద్యోగులు, కొత్త ఓటర్లు తమ వైపే ఉన్నారని అంచనాకు వస్తోంది. ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణి ప్రాంతంలోని నియోజకవర్గాల్లో ఎక్కువ స్థానాలు తమ ఖాతాలోనే పడతాయని కాంగ్రెస్‌ ధీమాగా ఉంది. అంతేకాకుండా హైదరాబాద్‌ శివార్లలో కూడా కాంగ్రెస్‌కే భారీగా పోలింగ్‌ నమోదైందని అంచనా వేస్తోంది. తెలంగాణ ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన పోలింగ్‌ పక్రియ ముగిసింది. ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. గెలుపు కోసం ప్రధాన పార్టీలన్నీ అహర్నిశలు శ్రమించాయి. ఈసారి 70కు పైగా ఓటింగ్‌ శాతం నమోదైంది. అర్బన్‌ ఏరియాలో ఓటర్లు బద్దకించినా.. రూరల్‌లో మాత్రం పోలింగ్‌ కేంద్రాలు జాతరను తలపించాయి. గ్రావిూణ వాసులు చైతన్యం పొంది ఓటు వేశారు. ఇక చిన్నపాటి ఘర్షణలు తప్పా ప్రశాంతంగా పోలింగ్‌ ముగిసింది. పోలీసులు, అధికారులంతా ఊపిరిపీల్చుకున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు