- దేవరకొండ నియోజకవర్గం, చింతపల్లి మండలంలో
చెలరేగిపోతున్న భూ మాఫియా.. - గుట్టలు తవ్వడం.. చెరువులు నింపడం ఇదే వీరి తంతు..
- ఎనిమిదేండ్లలో పలు చెరువుల దురాక్రమణ..
- లంచాలు తీసుకుని ప్రేక్షక పాత్రలో రెవెన్యూ, ఇరిగేషన్ శాఖ అధికారులు..
- ఇది సిగ్గుచేటు అంటున్న స్థానికులు..
- జరుగుతున్న ఆక్రమణలను అడ్డుకోకపోవడం దారుణం..
- జిల్లా కలెక్టర్ స్పందించి.. అవినీతి అధికారులపై
చర్యలు తీసుకుని, కబ్జాదారులను శిక్షించి చెరువును
రక్షించాలని కోరుతున్న స్థానికులు..
హైదరాబాద్ : దేవరకొండ నియోజకవర్గం, చింతపల్లి మండలం, రాంనగర్ పోలపల్లి గ్రామ సమీపంలో ఉన్న చెరువులో యథేచ్ఛగా కబ్జాలు జరుగు తున్నాయి. గుట్టలు తవ్వి చెరువులు నింపుతున్నా అధికారుల మాత్రం తమకు సంబంధం లేనట్టు ప్రేక్షక పాత్ర వహిస్తున్న తీరును ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తుందని చెప్పాలి. ప్రభుత్వ భూముల నుండి మట్టి తవ్వి, చెరువులు నింపి, రియల్ మాఫి యాలకు మరొక రూపకంగా రూపుదిద్దుకుంటుంటే అధికారులకు చలనం లేదా.. ? ఎఫ్.టి.ఎల్. పరిధి దాటి మరీ వచ్చి నిర్మాణాలు జరుగుతున్నాయి. ఎఫ్.టి.ఎల్. (ఫుల్ ట్యాంక్ లెవెల్) దిమ్మెలను తొలగించి మరీ చెరువు పరిధిలోని భూముల్లోకి చొచ్చుకువస్తున్న కబ్జాగాళ్లు రాత్రికి రాత్రి భూమి చదును చేయడం, మొరం డంపు చేసి, చెరువు స్థలాన్ని కబ్జా చేసేస్తున్నారు. అధికార పార్టీ నేతల అండతో.. ఇరిగేషన్, రెవెన్యూ, కార్పొరేషన్ లోని కీలక అధికా రులను గుప్పిట్లో పెట్టుకుంటూ.. బరితెగించి ఆక్రమణలను యథే చ్ఛగా సాగిస్తున్నట్లుగా ఆరోపణలున్నాయి. వాస్తవానికి చింతపల్లి మండలం, రాంనగర్ పోలేపల్లి గ్రామానికి సంబంధించిన చెరువు ప్రముఖమైనదని చెప్పాలి.

ఆ మూడు శాఖల వైఫల్యంతోనే ఆక్రమణలు జరుగుతున్నాయి.. వాస్తవానికి పోలేపల్లి రాంనగర్ చెరువు కబ్జాలు నిలువరించడంలో ఇరిగేషన్, రెవెన్యూ, అధికారుల పాత్ర ఉందని చెప్పక తప్పదు. ఎఫ్ టి ఎల్ దిమ్మెలను తొలగించి మరీ నిర్మాణాలు చేపడుతున్న వారిపై ఇరిగేషన్ అధికారులు కబ్జాదారులపై క్రిమినల్ చర్యలకు ఫిర్యాదు చేయకుండా తాత్సారం చేస్తున్నారు. అధికారుల సహకారంతో భూ కబ్జాదారులు మరింతగా రెచ్చిపోయే నిర్మాణ పనులు శరవేగంగా చేస్తున్నారు.. ఇక చెరువు భూములకు సమీపంలోని పట్టా, రిజిస్ట్రేషన్ భూములకు అసలు సర్వే నెంబర్లకు బై నెంబర్లు వేస్తూ.. చెరువు, భూములను రిజిస్ట్రేషన్లు చేయించేస్తున్నారని ఆరోపణలున్నాయి. చెరువు స్థలం ఎకరాల్లో ఆక్రమణకు గురైనట్లు గతంలోనే రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు తేల్చినప్పటికీ న్యాయస్థానాల్లో కేసులున్నాయని పేర్కొంటూ.. కూల్చివేతలకు దూరంగా ఉంటున్నారు..

కలెక్టర్ ఆధ్వర్యంలోని టాస్క్ ఫోర్స్ ముందుకు కదిలితే తప్ప.. అక్రమణల తొలగింపు సాధ్యం కాదని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.. కబ్జాలే తమ వృత్తిగా మార్చుకున్న కొందరు.. గడిచిన ఏడేనిమిదేళ్లుగా దేవరకొండ నియోజక వర్గంలో ప్రధాన జలాశయాలను వదలకుండా చెరబడుతున్నారు. ఫుల్ ట్యాంకు లెవల్ కోసం ఏర్పాటుచేసిన రాళ్లను తొలగించేసి, చదునుచేసి, మొరం పోస్తూ.. ఆక్రమణలకు పాల్పడుతున్నారు. ఖాళీ స్థలాలను చదును చేస్తూ.. రాత్రికి రాత్రే మొరం అక్కడ నింపుతూ.. బేస్మెంట్ లెవల్ నిర్మాణాలను చేపడుతున్నారు. కొద్ది కాలం తర్వాత చిన్నగా ఒక ఇంటి నిర్మాణం చేపట్టి.. కార్పోరేషన్ అధికారులకు చేతులు తడిపి.. ఇంటి నెంబర్ తెచ్చుకుని క్రమబ ద్ధీకరించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల భవిష్యత్ తరాలకు నీటి అవసరాలతో బాటు, ఆహ్లాదాన్ని పంచే అవకాశం ఉన్న చెరు వులు కనుమరుగై పోయే ప్రమాదం వుంది.. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు దృష్టి సారించి చెరువును రక్షించాలని స్థానికులు కోరు తున్నారు.. కాగా ఈ తతంగం వెనకాల ఒక బీజేపీ నాయకుడు ఉన్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. ఆ నాయకుడు ఎవరు..?ఈ వ్యవహారానికి ఆయనకు ఉన్న సంబంధం ఏమిటి..? అనే విషయాలను ఆధారాలతో మీ ముందుకు తీసుకుని రానుంది ‘ ఆదాబ్ హైదరాబాద్ ‘.. ‘ మా అక్షరం వినీతిపై అస్త్రం ‘..