దుబాయ్ వేదికగా జరిగిన ఐపీఎల్ 2024 మినీ వేలంలో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్కు భారీ ధర పలికిన విషయం తెలిసిందే. కోల్కతా నైట్రైడర్స్ ప్రాంచైజీ అతడిని ఏకంగా రూ. 24.75 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఇదే అత్యధిక ధర. మరోవైపు ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ను సన్రైజర్స్ హైదరాబాద్ రూ. 20.50 కోట్లు పెట్టి కనుగోలు చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఇది రెండో అత్యధిక ధర. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ వేలం విధానం సరిగా లేదని అభిప్రాయపడ్డాడు. ‘మిచెల్ స్టార్క్ లీగ్ దశలో మొత్తం 14 మ్యాచులు ఆడి పూర్తి కోటా ఓవర్లు బౌలింగ్ చేస్తే.. అతడు వేసే ఒక్కో బంతి విలువ సుమారు రూ. 7,60,000 అవుతుంది. ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. అయితే నా మదిలో ఓ ప్రశ్న ఉంది. ప్రపంచంలో సహా ఐపీఎల్లో జస్ప్రీత్ బుమ్రా అత్యుత్తమ బౌలర్. అతడికే రూ.12 కోట్లు చెల్లిస్తే.. స్టార్క్కి రూ. 25 కోట్లు ఇస్తున్నారు. ఇది చాలా తప్పు. వారికి డబ్బు వచ్చిందని నేను అసూయపడడం లేదు. ప్రతి ఒక్కరికీ ఎక్కువ డబ్బు రావాలని కోరుకుంటున్నా కానీ.. ఈ విధానం సరిగా లేదు’ అని ఆకాశ్ చోప్రా అన్నాడు. ‘ఇది ఐపీఎల్. ఒకరికి చాలా తక్కువ, మరొకరికి భారీ మొత్తం ఎలా వస్తుంది?. ఒకవేళ జస్ప్రీత్ బుమ్రా, విరాట్ కోహ్లీ వారి ఫ్రాంఛైజీలను వీడి వేలంలోకి వస్తే.. వారికి కూడా కాసుల వర్షం కురుస్తుంది. కోహ్లీ రూ. 42 కోట్లు, బుమ్రా రూ. 35 కోట్ల ధర పలుకుతారు. ఈ విధానంతో ప్లేయర్స్ మధ్య అసమానతలు ఏర్పడతాయి. ఈ సమస్యకు ఓ పరిష్కారం ఉంది. ఒక ఫ్రాంఛైజీ ఖర్చు చేసే మొత్తం రూ. 200 కోట్లు అయితే .. అందులో రూ.150-175 కోట్లు భారత ఆటగాళ్లను కొనడానికి వెచ్చించాలి. మిగతా డబ్బును విదేశీ ఆటగాళ్లకు కోసం ఖర్చు చేయాలి’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు.