ప్రస్తుతం ముంబై ఇండియన్స్ కెప్టెన్గా రోహిత్ శర్మ ఉన్నాడు. ఇప్పుడు రోహిత్ వయసు 36 ఏళ్ల కాబట్టి.. భవిష్యత్తు కెప్టెన్ కోసం ముంబై ప్రాంచైజీ ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగానే ఐపీఎల్ 2024 మినీ వేలంకు ముందు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్గా ఉన్న హార్దిక్ పాండ్యాను ముంబై ట్రేడ్ చేసుకుంది. వచ్చే సీజన్ కాకపోయినా.. ఆ తర్వాతి ఎడిషన్లలో హార్దిక్ జట్టు పగ్గాలు అందుకోనున్నాడు. అయితే ముంబై కెప్టెన్గా హార్దిక్ కంటే సూర్యకుమార్ యాదవ్ సరైనోడని భారత మాజీ క్రికెటర్ అజేయ్ జడేజా అంటున్నాడు. టీ20 ప్రపంచకప్ 2024 కోసం ఐపీఎల్ 2024 సీజన్ ఆడకుండా రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకోవాలని అజేయ్ జడేజా పేర్కొన్నాడు. రోహిత్ మాత్రమే కాదు ఇతర భారత ఆటగాళ్లు కూడా టీ20 ప్రపంచకప్ కోసం ఐపీఎల్ 2024 ఆడకుండా ఉండాలన్నాడు. ‘ఐపీఎల్ 2024 సీజన్ నుంచి రోహిత్ శర్మ బ్రేక్ తీసుకుంటే.. సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ జట్టును నడిపించాలి. ఐసీసీ టోర్నీల్లో రాణించాలంటే.. భారత ఆటగాళ్లు ఐపీఎల్కు బ్రేక్ ఇచ్చి ఫిట్నెస్పై దృష్ఠి పెట్టాలి. విదేశీ ఆటగాళ్లు ఇదే చేస్తున్నారు. కానీ భారత ఆటగాళ్లు మాత్రం ఐపీఎల్ ఆడుతున్నారు. కనీసం టీ20 ప్రపంచకప్ 2024 కోసమైనా ఐపీఎల్ 2024 ఆడకుండా ఉండాలి’ అని జడేజా సూచించాడు.