- సంచలన వ్యాఖ్యలు చేసిన మోహన్ భగవత్..
ముంబై : మణిపూర్ హింసాకాండకు బయటి శక్తులే కారణమని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ మంగళవారం ఆరోపించారు. మణిపూర్ హింసను కొందరు ప్రేరేపించారని, ఈశాన్య రాష్ట్రం భగ్గుమనేందుకు వారే కారణమని అన్నారు. చాలా కాలంగా అక్కడ మైతీలు, కుకీలు కలిసిమెలసి బతుకుతున్నారని, వారి మధ్య చిచ్చు పెట్టి అంతర్యుద్ధంలో ఎవరు ప్రయోజనాలు పొందుతున్నారని ప్రశ్నించారు. అక్కడ జరిగిన విషయంలో బయటి శక్తులు ఉన్నాయని, హింసాకాండను రేపి అవి చలి కాచుకుంటున్నాయని వ్యాఖ్యానించారు. నాగపూర్లో ఆరెస్సెస్ దసరా ర్యాలీని ఉద్దేశించి మోహన్ భగవత్ మాట్లాడారు. మార్క్సిస్ట్ మేధావులు మీడియా, బోధనా రంగంలో తమ పట్టును ఉపయోగించుకుని దేశ విద్యా వ్యవస్ధను, సంస్కృతిని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. జనవరి 22న అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుందని, ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఆలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు.
ఇక మణిపూర్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మూడురోజు పాటు మకాం వేశారని, ఈ ఘర్షణలను కొందరు ప్రేరేపించారని, అసలు ఇది జరిగింది కాదని, పనిగట్టుకుని కొందరు హింస చెలరేగేలా వ్యవహరించారని మోహన్ భగవత్ ఆరోపించారు. శాంతి నెలకొంటుందనుకున్న సమయంలో కొన్ని ఘటనలు మళ్లీ జరిగాయని, ఇది ఇరు వర్గాల మధ్య దూరం పెంచాయని పేర్కొన్నారు.