- రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాల మూసివేత
హైదరాబాద్ : తెలంగాణ ఎన్నికల ఫలితాలకు కౌంట్డౌన్ ప్రారంభమైంది. ఆదివార ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభం కానుండగా 10 గంటలకల్లా తొలి ఫలితం రానుంది. మరికొన్ని గంటల్లో అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది. 119 నియోజకవర్గాల్లో ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. ఈసారి బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడుతుందా.. లేదంటే చెయ్యి పార్టీ అధికారాన్ని హస్తం గతం చేసుకుంటుందో తేలిపోనుంది. ఫలితాలపై నేతల్లో.. ప్రజల్లో నరాలు తెగే ఉత్కంఠ సాగుతోంది. ఇంకోవైపు బెట్టింగ్లు కూడా పెద్ద ఎత్తున నడుస్తున్నాయి. ఈ క్రమంలో మందు పార్టీల కోసం ఏర్పాట్లు సాగుతు న్నాయి. అయితే మద్యం దుకాణాల మూసివేతకు ఇసి ఆదేశాలు ఇచ్చింది. ఆదివారం షాపులు మూపతడనున్నారు. ఇక ఆదివారం ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రం వ్యాప్తంగా మందు షాపులు మూసివేయాలని పోలీస్ శాఖ ఆదేశించింది. ఈ మేరకు వైన్ షాపు యజమానులకు నోటీసులు జారీ చేసారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే భాగ్యనగరంలో వైన్ షాపులు మూసివేయాలని హైదరాబాద్ పోలీస్ కమీషనర్ సందీప్ శాండిల్యా ఆదేశాలు జారీ చేశారు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర పటిష్టమైన భద్రతా ఏర్పాటు చేసినట్లు వెల్లడిరచారు. ర్యాలీల్లో ఉద్రిక్తతలు చోటుచేసుకుండా చర్యలు చేపట్టారు. మద్యం షాపులతో పాటు, బార్లు కూడా మూతపడనున్నాయి.