- ధరణి దందాను బద్దలు కొడతాం..
- ధరణితో 35 లక్షల ఎకరాలు లూటీ
- కలెక్టర్లను అడ్డం పెట్టుకుని భూదోపిడీ
- విఆర్వోలు చేయాల్సిన పని కేసీఆర్ చేస్తున్నారు
- అంతకంటే ఆధునిక విధానాన్ని తీసుకొస్తాం పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి..
అధికారంలోకి రాగానే కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ధరణిని రద్దు చేస్తుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. దీంతో రైతులు అరిగో పడుతున్నారని, భూములు మాయం అవుతున్నాయని మండిపడ్డారు. తాము ధరణి సమస్యలను లేవనెత్తితే పరిష్కరించకుండా ధరణి కావాలా వద్దా అంటూ కేసీఆర్ ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు. రేవంత్ విూడియాతో మాట్లాడుతూ.. ధరణిని సీఎం కేసీఆర్ తన దోపిడీకి వాడుకుంటున్నారు. ధరణి వచ్చాక 35 లక్షల ఎకరాల దళిత, గిరిజన భూములను కొల్లగొట్టారు. కేసీఆర్ దళారీగా మారి వేలమంది వీఆర్వోల పని ఆయనే చేస్తున్నారు. కలెక్టర్లను అడ్డుపెట్టుకుని భూములు దోచుకుంటున్నారు. అంతకంటే అత్యాధునిక విధానాన్ని తీసుకు వచ్చి భూములకు రక్షణ కల్పిస్తామని రేవంత్ ప్రకటించారు. టైటిల్ గ్యారంటీ ఇచ్చి భూములకు రక్షణ కల్పిస్తాం. ధరణి ఉన్నంత కాలం దళిత, గిరిజనుల భూములకు రక్షణ లేదని స్పష్టం చేశారు. గతంలో కాళేశ్వరం, పాలమూరు`రంగారెడ్డి ప్రాజెక్టులు కేసీఆర్కు ఏటీఎంగా మారితే… ఇప్పుడు ధరణిని కేసీఆర్ ఏటీఎంగా మార్చుకున్నారు. ఎన్ని వందల కోట్లు వచ్చాయో, ఎన్ని వందల ఎకరాలు ఆక్రమించుకున్నారో లెక్కలు చూసుకుంటున్నారు. ధరణిని రద్దు చేస్తే రైతు బీమా, రైతు బంధు ఎలా వస్తుందని ప్రశ్నిస్తున్నారు. ధరణి తెచ్చింది 2020లో.. రైతుబంధు, రైతు బీమా మొదలు పెట్టింది 2018లో.. అంటూ.. అలాంటప్పుడు ధరణి అనగానే ఎందుకు ఉలిక్కి పడుతున్నాడో గమనించాలని అన్నారు. గతంలో రైతు రుణమాఫీ, పంట నష్టం చెల్లించిన ఘనత కాంగ్రెస్ది. రెవెన్యూ శాఖలో ఉన్న వివరాల ఆధారంగానే సంక్షేమ పథకాలు అమలు చేస్తారు. ధరణిపై 12 వేల గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు పెట్టేందుకు సిద్దమా? దోపిడీని ప్రశ్నిస్తే… మంత్రి శ్రీనివాస్ గౌడ్ బీసీ కార్డును ముందు పెడుతున్నారు. మరి నువ్వు అక్రమ కేసులు పెట్టిన వారు బీసీలు కాదా? అని నిలదీశారు. ప్రగతి భవన్, రాజ్ భవన్ మధ్య అగాధం ఉన్నట్లు కేసీఆర్ నమ్మించారు. ఉప్పు, నిప్పు అన్నట్లు వ్యవహరించారు. ఇప్పుడు ఎన్నికలు వస్తుండటంతో ఇద్దరూ రాజ్భవన్లో తలుపులు మూసి మాట్లాడుకున్నారు. విూ మధ్య ఏం రహస్యం ఉంది? ప్రజా సమస్యలపై మాట్లాడాలంటే అందరి ముందే మాట్లాడుకోవచ్చు కదా? ఇన్నాళ్లు గవర్నర్ను బీజేపీ అధ్యక్షురాలు అని కేసీఆర్ అన్నారు. ఇప్పుడు గవర్నర్ దగ్గరకు వెళ్లి బీఆర్ఎస్ అధ్యక్షుడు మాట్లాడుతున్నారు. వీళ్లిద్దరి మధ్య ఎన్నికల పొత్తు అయినట్లా? కానట్లా? ప్రజలు ఆలోచించాలన్నారు. మోదీకి అసదుద్దీన్ ఓవైసీ ఛోటా భాయ్ అంటూ రేవంత్ వ్యాఖ్యానించారు. అక్కడ మోడీ చెప్పినట్లు ఇక్కడ ఓవైసీ మాట్లాడుతారని అన్నారు.