మీర్పేట్ : సమాజంలో ఎన్నో రకాల మనుషులు ఉంటారని, అయితే వారి హోదా, ఆత్మగౌరవం వల్లనే సరైన గుర్తింపు లభిస్తుందని డీజీపీ అంజనీకుమార్ అన్నారు. రకరకాల మనుషుల్లో ట్రాన్స్ జెండర్లు కూడా ఓ వర్గంగా ముద్ర పడ్డారని, వారిని సైతం ఇతర వర్గాలతో సమానంగా తయారు చేసే లక్ష్యంతో మీర్పేట్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ప్రత్యేకంగా కౌన్సెలింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం ఓ కొత్త ప్రయోగం లాంటిదని ఆయన అన్నారు. ప్రజ్వల హోమ్ వ్యవస్థాపకురాలు డాక్టర్ సునీతా కృష్ణన్ ఆధ్వర్యంలో రాచకొండ కమిషనరేట్లోని మీర్ పేట్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన ట్రాన్స్ జెండర్స్ కౌన్సెలింగ్ సెంటర్ వికల్ప్ ను సాయంత్రం ఆయన ప్రారం భించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ, ట్రాన్స్ జెండర్ల సమస్యలు తెలుసుకొని, వారికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించి సమాజంలో గౌరవప్రదమైన స్థానం కల్పించే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం ద్వారా సత్ఫలితాలు సాధించాల్సిన అవసరం ఉందన్నారు. రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ మాట్లాడుతూ, ట్రాన్స్ జెండర్లు కూడా సమాజంలో ఒక భాగమని, వారికి అన్ని వర్గాల వారు అండగా నిలవాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. కార్యక్రమంలో రాచకొండ జాయింట్ సీపీ సత్యనారాయణ, ఎల్బీనగర్ డీసీపీ సాయిశ్రీ, వనస్థలిపురం ఏసీపీ భీంరెడ్డి, మీర్ పేట్ ఇన్స్ పెక్టర్ కిరణ్ కుమార్ ఇతర సిబ్బంది ట్రాన్స్ జెండర్లు పాల్గొన్నారు.