Monday, May 6, 2024

బిల్డర్లు కాంట్రాక్టర్లు కాదు.. సంపద సృష్టికర్తలు

తప్పక చదవండి
  • సంపద సృష్టించే వారికి అవసరమైన సాయం చేస్తాం
  • జాతి నిర్మాణానికి బిల్డర్స్‌ చేస్తున్న కృషికి అభినందనలు
  • పెట్టుబడులకు తెలంగాణ అన్ని రకాలుగా అనుకూలం..
  • బిల్డర్స్‌ కన్వెన్షన్‌ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడి..

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ లో నిర్మాణ రంగం చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో 31వ బిల్డర్స్‌ అసోసియేషన్‌ కన్వెన్షన్‌ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. నిర్మాణ రంగంలో గతంలో ఉన్న పెద్ద కంపెనీలు ఇప్పుడు కనిపించడం లేదన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం మిమ్మల్ని కాంట్రాక్టర్లుగా చూడట్లేదని, వెల్తె క్రియేటర్లుగా చూస్తున్నామని చెప్పారు. నిర్మాణ రంగానికి అన్ని విధాల సహకరిస్తామిన డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. దేశ నిర్మాణ రంగంలో తెలుగు రాష్ట్రాల కాంట్రాక్టర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని భట్టి విక్రమార్క అన్నారు. ‘‘బిల్డింగ్‌ త్రూ టైం, టెక్నికల్‌ వాల్యూమ్‌’’ పుస్తకాలను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. అనంతరం ప్రతినిధులను ఉద్దేశించి డిప్యూటీ సీఎం మాట్లాడారు. దేశంలో జరుగుతున్న నిర్మాణ రంగాల్లో తెలుగు రాష్ట్రాల కాంట్రాక్టర్ల కాంట్రిబ్యూషన్‌ ఎక్కువగా ఉన్నదని, దేశ సంపదను సృష్టించడంలో తెలుగు రాష్ట్రాల బిల్డర్స్‌ కీలక భూమిక పోషిస్తున్నారని తెలిపారు. ఇలాంటి వారిని ప్రోత్సహించడం ప్రభుత్వాల బాధ్యత అని చెప్పారు. భారతదేశం ప్రజాస్వామిక, సంక్షేమ రాజ్యమని అన్నారు. ‘‘దేశంలో సంక్షేమ రాజ్యం అమలు కావాలంటే సంపద కావాలని, సంపద సృష్టించే సంస్థలు వచ్చినప్పుడే ప్రజల సంక్షేమ అవసరాలను ప్రభుత్వాలు తీర్చగలవని అన్నారు. సంపద సృష్టించేటు వంటి సంస్థలను గాయ పరిచే ఆలోచన ఇందిరమ్మ రాజ్యంలో ఉండబోదని అన్నారు. నిర్మాణ రంగంలో వచ్చిన అనేక విప్లవాత్మక మార్పులతో దేశంలో నిర్మాణ రంగం చాలా ముందుకు దూసుకు పోతున్నదని వివరించారు. బ్యాంకు గ్యారంటీ రుణాలు తెచ్చుకొని నిర్మాణ రంగంపై పెట్టుబడి పెట్టిన సంస్థలకు సకాలంలో బిల్లులు రాకపోవడం వల్ల ఆర్థిక ఇబ్బందుల కారణంగా నాడు మార్కెట్లో ఒక వెలుగు వెల్గినటు వంటి ప్రముఖ నిర్మాణ రంగ సంస్థలు నేడు కనిపించకుండా పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. స్వతహాగా నిర్మాణ రంగంలో రాణిస్తూ జాతి నిర్మాణానికి బిల్డర్స్‌ చేస్తున్న కృషిని వివరిస్తూ వారికి అభినందనలు తెలిపారు. హైదరాబాద్‌ చాలా అందమైన పట్టణమని పెట్టుబడులకు అనువైన ప్రాంతమని వివరించారు. తెలంగాణ రాష్ట్రం వాతావరణ పరంగా, ఆర్థికపరంగా, భాషా పరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా దేశంలో ఉన్నటు వంటి వారు ఇక్కడికి వచ్చి స్థిరపడి వ్యాపారాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందని చెప్పారు. తెలంగాణకు వచ్చి సంపద సృష్టించే వారికి కావాల్సిన సహాయ సహకారాలు ఇందిరమ్మ రాజ్యంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం అందిస్తుందని హామీ ఇచ్చారు. బిల్డర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా జాతీయ అధ్యక్షులు ఎస్‌.ఎన్‌ రెడ్డి, చైర్మన్‌ బి.శ్రీనయ్య లు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో పనులు చేసిన కాంట్రాక్టర్లకు చేసిన నిర్మాణ పనులకు బిల్లులు చెల్లించకుండా ఇబ్బంది పెట్టిందని దీంతో చాలామంది కాంట్రాక్టర్లు ఆర్థిక సమస్యలతో కొట్టు మిట్టాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లకు ప్రభుత్వం ఇచ్చి రావాల్సిన బకాయిలను వీలైనంత త్వరగా ఇప్పించారని కోరారు. ఇరిగేషన్‌ ప్రాజెక్టులో నిర్మాణం చేసే కాంట్రాక్టర్లకు కొన్ని పన్నుల నుంచి ఇచ్చే మినహాయింపు, రాయితీలను భవన నిర్మాణం కాంట్రాక్టర్లకు కూడా ఇవ్వాలని ఈ సందర్భంగా వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్‌ సెక్రెటరీ సచితానంద రెడ్డి, రాష్ట్ర చైర్మన్‌ దేవేందర్‌ రెడ్డి, కో వైస్‌ చైర్మన్‌ డి.వి.ఎన్‌ రెడ్డి, నేషనల్‌ కన్వెన్షన్‌ చైర్మన్‌ ఆర్‌ రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు