- ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న బిజెపి
- దేశాన్నికాపాడుకోవాల్సిన బాధ్యత అందరిదీ
- ఇందిరాపార్క్ వద్ద ధర్నాలో డిప్యూటి సిఎం భట్టి
హైదరాబాద్
దేశంలో బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని అన్నారు. పార్లమెంటులో ప్రతిపక్ష ఎంపీల సస్పెన్షన్ను నిరసిస్తూ హైదరాబాద్లోని ఇందిరాపార్క్ దగ్గర ఇండియా కూటమి శుక్రవారం ధర్నా నిర్వహించింది. ఈ ధర్నాలో భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియంతృత్వ పోకడలతో మోదీ పాలన కొనసాగుతోందని అన్నారు. దేశంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నించారు. దేశంలో స్వేచ్ఛగా మాట్లాడే హక్కు లేదని.. ప్రశ్నిస్తే అరెస్టులు చేయడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. పార్లమెంటు భవనంలో దాడిపై వివరణ ఇవ్వాలని అడిగిన 146 మంది ఎంపీలను సస్పెండ్ చేశారని ఈ సందర్భంగా భట్టి విక్రమార్క గుర్తు చేశారు. పార్లమెంటును రక్షించలేని బీజేపీ.. దేశ రక్షణను పూర్తిగా గాలికి వదిలేసిందని విమర్శించారు. అనేక మంది త్యాగాల ఫలితంగా దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ప్రస్తుతం దేశంలో అరాచక పాలన సాగుతోందని భట్టి మండిపడ్డారు. పార్లమెంటు ఘటనపై హోంమంత్రి నుంచి ఎలాంటి సమాధానం రావడంలేదని దుయ్యబట్టారు. ఈ ధర్నాలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, రాజకీయ ప్రముఖులు, తదితరలు పాల్గొన్నారు.