Thursday, May 2, 2024

అధికార దుర్వినియోగం జరక్కుండా చూడండి

తప్పక చదవండి
  • నిధుల మళ్లింపు, అసైన్డ్‌ భూముల మార్పు జరుగుతోంది
  • కెసిఆర్‌ అధికార దుర్వినయోగంపై కన్నేయండి
  • సిఇవో వికాస్‌ రాజ్‌తో కాంగ్రెస్‌ నేతల భేటీ.. వినతిపత్రం అందచేత

హైదరాబాద్‌ : తెలంగాణ ఎన్నికల ఫలితాల వేళ రాష్ట్రంలో అధికారం దుర్వినియోగం కాకుండా చూడాలని కాంగ్రెస్‌ నేతలు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌ రాజ్‌ ను కోరారు. ఈ మేరకు శనివారం ఉదయం ఆయన్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌ రెడ్డి , ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, ప్రచార కమిటీ చైర్మెన్‌ మధుయాష్కీ, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అంజన్‌ కుమార్‌ యాదవ్‌, ఇతర సీనియర్‌ నేతలు సీఈవోను కలిసిన వారిలో ఉన్నారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఈసీ దృష్టికి తీసుకొచ్చారు. ప్రధానంగా 4 అంశాలపై ఫిర్యాదు చేశారు. ఈ నెల 4న జరగబోయే కేబినెట్‌ భేటీలో కేసీఆర్‌ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా నిలువరించాలని ఈసీని కోరినట్లు తెలుస్తోంది. అలాగే, నిధుల విడుదలకు సంబంధించి ప్రభుత్వ ఆదేశాలపైనా దృష్టి సారించాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. సీఈవోను కలిసిన అనంతరం కాంగ్రెస్‌ నేత ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిబంధనలు పాటించడం లేదని, ఆ పార్టీకి సంబంధిచిన కాంట్రాక్టర్లకు నిధులు మంజూరు చేయిస్తున్నారని కాంగ్రెస్‌ నేతలు సీఈవోకు ఫిర్యాదు చేశారు. ’రైతు బంధు నిధులను కాంట్రాక్టర్ల బిల్లులకు మళ్లిస్తున్నారు. సుమారు రూ.6 వేల కోట్లను తమకు నచ్చిన వారికి ఇచ్చేందుకు సర్కారు యత్నిస్తోంది. సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లోని భూముల్ని ధరణి పోర్టల్‌ లోకి మార్చేస్తున్నారు. అసైన్డ్‌ భూములు ఇతరుల పేర్లపై రిజిస్టేష్రన్‌ చేయకుండా చూడాలి. ఆ భూముల రికార్డులు మారకుండా చూడాలి.’ అని ఈసీని కోరినట్లు చెప్పారు. ప్రభుత్వ లావాదేవీలపై నిఘా పెట్టాలని, 4 అంశాలపై వికాస్‌ రాజ్‌ కు ఫిర్యాదు చేసినట్లు వివరించారు. ఎన్నికల ఫలితాల వేళ సోమవారం కేబినెట్‌ భేటీలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోకుండా నిలువరించాలని ఈసీని కోరినట్లు ఉత్తమ్‌ తెలిపారు. ’ఎన్నికల ఫలితాల వేళ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. ఆదివారం గెలుపు ధ్రువపత్రాలను మా చీఫ్‌ ఎలక్షన్‌ ఏజెంట్లు తీసుకుంటారు. ఈ మేరకు ఆదేశాలు ఇవ్వాలని సీఈవోను కోరాం.’ అని చెప్పారు. సీఎం కేసీఆర్‌ కేబినెట్‌ భేటీ ఎందుకు ఏర్పాటు చేశారో తెలియదని, రాజీనామాలు సమర్పించేందుకే కేబినెట్‌ మీటింగ్‌ ఏర్పాటు చేసి ఉండొచ్చని పేర్కొన్నారు. సిఈవోతో భేటీ అనంతరం ఉత్తమ్‌ మాట్లాడుతూ.. రైతుబంధు నిధుల దారి మళ్లింపుపై ఢల్లీిలో సీఈసీ దృష్టికి కూడా తీసుకెళ్లామన్నారు. నాలుగు అంశాలపై సీఈవో వికాస్‌రాజ్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. రైతుబంధు నిధులను మళ్లిస్తున్నారని ఫిర్యాదు చేశామన్నారు. భూ రికార్డులు మారుస్తున్నట్టు తమకు సమాచారం ఉందన్నారు. అసైన్డ్‌ ల్యాండ్స్‌ రికార్డులు మారుస్తున్నారన్నారు. ప్రభుత్వ లావాదేవీలపై నిఘా పెట్టాలని సీఈసీకి ఫిర్యాదు చేశామని ఉత్తమ్‌కుమార్‌ వెల్లడించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు