- నాణ్యత ప్రమాణాలు పట్టించుకోరా..?
- అవినీతి మత్తులోనే అధికారులున్నారా..?
- కాంట్రాక్టర్ పనుల్లో నాణ్యత కనబడలేదా..?
- పర్యవేక్షణ అధికారుల పనితనం ఇదేనా..?
- వేసిన ఏడాది కూడా పనికిరాని రోడ్డు..
- రూ.6.70 లక్షలు అవినీతికి ఆవిరేనా..?
- ఎమ్మెల్యే అభివృద్ధికి కాంట్రాక్టర్ చిల్లులు..
- శీలంపల్లి,అంతారం రోడ్డే దీనికి నిదర్శనం..
చిలిపిచేడ్ : రహదారులు ప్రగతికి చిహ్నాలు ఒకప్పటి మాట.. రహదారులు కాంట్రాక్టర్ల జేబులు నింపే ఆదాయమార్గాలు నేటి మాట. నాణ్యత ప్రమాణాలు లేకుండా అడ్డగోలుగా అధికారులతో కుమ్మక్కై మంజూరైన లక్షలాదిరూపాయలను దక్కించుకోవడం కోసం అల్లాటప్పాగా పైపూతగా రోడ్డులు వేసి, బిల్లులు ఎత్తుకొని జంప్ జిలానీలు అవడం సర్వసాధారణంగా మారింది. అందుకు నిదర్శనమే శీలంపల్లి నుండి అంతారం ప్రధాన రహదారి శీలంపల్లి, అంతారం రోడ్డు కాంట్రాక్టర్ల కక్కుర్తికీ ఆవిరైందా..? లేకపోతే అధికారుల అవినీతికీ చిహ్నంగా నిలిచిందా..? బాగుచేస్తామని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని చెప్తున్నా ఎమ్మెల్యేకు కాంట్రాక్టర్లు, అధికారులు చిల్లులు వేశారా..? రోడ్డు నిర్మాణంలో నాణ్యత లోపించడానికీ కారణమేమిటి..? ఓక పక్క రోడ్డు నిర్మాణం జరిగి ఒక సంవత్సరం గడవకముందే.. మరో పక్క రోడ్డు గుంతలు పడటం నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది. ఆర్ అండ్ బీ అధికారుల పర్యవేక్షణ కొరవడిరదనటానికి, క్వాలిటీ కంట్రోల్ శాఖ తనిఖీలు లేకనే రోడ్డు నాసిరకానికి కారణం. పది కాలాల పాటు పదిలంగా ఉండాల్సిన రోడ్డు నిర్మాణంలో నాణ్యత డొల్లతనంగా మారిందని మండిపడుతున్నారు స్థానిక ప్రజలు. రెండేళ్ల క్రితమే చిలిపిచేడ్ మండలంలోని శీలంపల్లి గ్రామ ప్రధాన రహదారి నుండి అంతారం గ్రామ ప్రధాన రహదారి వరకు డబుల్ రోడ్డు నిర్మాణం పనులు మంజూరయ్యాయి.
రూ.6.70 లక్షల అంచనాల పనులు కాంట్రాక్టర్లు దక్కించుకున్నారు. సుమారు 9.50 కిలోమీటర్లు డబుల్ రోడ్డు నిర్మాణం మంజూరు అవ్వగా 8 కిలోమీటర్ల మేర నిర్మాణము పూర్తి చేశాడు కాంట్రాక్టర్. మిగితా రోడ్డును త్వరలోనే పూర్తి చేసి ప్రయాణికులకు రక్షణగా ప్రమాదాలను దూరం చేస్తామన్నారు. అయితే పనులు జరిగే సమయంలో అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా పనులు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రమాదాల హెచ్చరిక బోర్డులేవీ :
ఈ రోడ్డు పనులు జరుగుతున్న సమయంలో వాహనదారులకు ప్రమాదాలు జరగకుండా హెచ్చరిక బోర్డులను కాంట్రాక్టర్ ఏర్పాటు చేయకపోవడం వలన వాహనదారులు ప్రమాదాల బారినపడు తున్నారని స్థానికులు చెప్తున్నారు. రోడ్డు విస్తరణ పనుల ప్రదేశంలో ప్రమాద సూచిక బోర్డులను ఏర్పాటు చేయలేదు. దీనితో రాత్రి సమయాల్లో ద్విచక్ర వాహనదా రులకు ప్రమాదలు జరిగే అవకాశం ఉందంటున్నారు.