- వేణు గోపాల స్వామికి చెందిన భూమిని కైంకర్యం చేసిన కబ్జాకోరులు..
- పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన రాష్ట్రీయ వానర సేన..
- రిటైర్డ్ ఐఏఎస్ ని కమిషనర్ గా కొనసాగించడంపై అనుమానాలు..
- అధికార పార్టీ నాయకులకు కొమ్ము కాస్తున్న
దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు.. - తగిన చర్యలు తీసుకోకపోతే ఆ శాఖ కార్యాలయాన్ని
ముట్టడిస్తాం : హెచ్చరించిన రాష్ట్రీయ వానర సేన..
దేవుడేమైనా చూస్తున్నాడా..? ఏమైనా చేస్తాడా..? అన్న బరితెగింపుతో దేవుడి మాన్యాలను చెరబడుతున్న కబ్జాకోరులు రోజు రోజుకూ వారి ప్రతాపాన్ని చూపిస్తున్నారు.. ముఖ్యంగా అధికార పార్టీ నాయకుల అండదండలతో.. కొందరు అవినీతి పరులైన సంబంధిత శాఖ అధికారులతో కుమ్మక్కై దేవుడి భూములను అడ్డగోలుగా కైంకర్యం చేస్తున్నారు.. కానీ వారికి తెలియని విషయం ఏమిటంటే.. ప్రస్తుతానికి తాత్కాలిక ఆనందం పొందవచ్చు.. భగవంతుడు అన్నీ గమనిస్తూనే ఉంటాడు.. దేవుడి మాన్యాలను కొల్లగొట్టినవారు ఎవరూ బాగుపడిన దాఖలాలు లేవు.. తాజాగా శ్రీ వేణుగోపాల స్వామి భూమిని చెరబట్టిన కబ్జా చరిత్ర ఒకటి వెలుగు చూసింది.. ఆ వివరాలు చూద్దాం..
హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా, తలకొండపల్లి మండల్, మక్తమాదారం గ్రామంలో శ్రీ వేణుగోపాల స్వామికి సంబంధించిన సర్వే నెంబర్లు 1 నుంచి 22 వరకు, సర్వే నెంబర్లు 311 నుంచి 325 వరకు, 327 నుంచి 335 వరకు గల దాదాపు 224 ఎకరాల భూమి కలదు. కొన్ని వేల సంవత్సరాల చరిత్ర గల ఈ దేవాలయ భూమిపై అధికార పార్టీ నాయకుల కన్ను పడ్డది. కొంతమంది రియల్ ఎస్టేట్ మాఫియా కబ్జా చేసి లేవుట్లుగా మార్చి అమ్ముకోవడం జరిగింది. గతంలో రాష్ట్రీయ వానర సేన, పలుమార్లు ఫిర్యాదు చేసినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది దేవాదాయ శాఖ. స్థానికంగా ఉండే జిల్లా మంత్రి, అధికార పార్టీ ఎమ్మెల్యేల కను సన్నలలోనే ఇదంతా జరిగినట్లు స్పష్టమైన సమాచారం ఉన్నప్పటికీ దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ చట్టపరమైన చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు కూడా అధికార పార్టీకి భయపడి ఎటువంటి చర్యలు తీసుకోలేక పోతున్నారు. ఈ విషయంపై రాష్ట్రీయ వానర సేన 15 నవంబర్ 2021 న ఫిర్యాదు చేసి స్పష్టమైన ఆధారాలతోటి దేవాదాయ ధర్మాదాయ శాఖకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అప్పటినుంచి ఇప్పటివరకు పలుమార్లు ఫిర్యాదులు ఇచ్చినప్పటికీ అధికార పార్టీకి భయపడి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కాగా సెప్టెంబర్ ఒకటి 2023న ఎండోమెంట్ కమిషనర్ అనిల్ కుమార్ ని కలిసి మరోమారు కంప్లైంట్ ఇచ్చి 20 రోజుల లోపు భూ కబ్జాకు పాల్పడ్డ వ్యక్తులపై క్రిమినల్ కేసులు పెట్టి, దేవాలయ భూమిని స్వాధీనం చేసుకోవాలని, చేయని పరిస్థితులలో రాష్ట్రీయ వానరసేన దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యాలయాన్ని ముట్టడిస్తుందని హెచ్చరిస్తోంది.