- 4.5 కి.మీ. పొడవులో ఛార్ధామ్ రోడ్డు ప్రాజెక్ట్
- పైపుల ద్వారా ఆక్సిజన్ పంపే ప్రయత్నాలు
- సహాయక చర్యలు కొనసాగిస్తున్న రెస్క్యూ బృందాలు
- యమునోత్రి జాతీయ రహదారిలో భాగంగా నిర్మాణ దశలో ఉన్న సొరంగం
ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లాలో నిర్మాణ దశలో ఉన్న ఓ సొరంగం కొంతభాగం ఆదివారం కూలింది. నిర్మాణంలో ఉన్న సొరంగం కుప్పకూలిన.. 40 మంది కార్మికులు చిక్కుకున్నారు. ఉత్తరకాశి జిల్లా సిల్కయారా-దండల్గావ్లను కలిపేలా చార్ధామ్ రోడ్డు ప్రాజెక్ట్లో భాగంగా ఈ సొరంగ మార్గం నిర్మాణం జరుగుతోంది. ఈ సొరంగం మార్గం అందుబాటులోకి వస్తే యమునోత్రి ధామ్కి ఏకంగా 26 కిలోమీటర్ల దూరం తగ్గిపోనుంది. ఆదివారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు. నాలుగున్నర కిలోమీటర్ల పొడవైన ఈ సొరంగంలో 150 మీటర్లు కూలిపోయినట్టు చెప్పారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు హుటాహుటిన అక్కడకు చేరుకున్నాయి. జిల్లా యంత్రాంగం అప్రమత్తం చేయడంతో ఉత్తరకాశీ ఎస్పీ అర్పన్ యదువంశీ ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్రమాదంలో 40 మంది కార్మికులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. సొరంగం తెరవాలంటే దాదాపు 200 మీటర్ల స్లాబ్ను తొలగించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. లోపలి చిక్కుకున్న కార్మికుల కోసం పైపు ద్వారా సొరంగంలోకి ఆక్సిజన్ పంపే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రమాదం గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.