మహబూబాబాద్ : జిల్లాలోని ఇనుగుర్తి బాలికల సాంఘిక సంక్షేమ హాస్టల్లో ప్రిన్సిపాల్ వేధింపులు తాళలేక అటెండర్ ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన శుక్రవారం చోటు చేసుకోగా, విషయాన్ని బయటకు రానివ్వకుండా ప్రిన్సిపాల్ జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది.
ఇనుగుర్తి బాలికల సాంఘిక సంక్షేమ హాస్టల్లో స్వరూప అనే మహిళ అటెండర్గా పని చేస్తోంది. అయితే ఆమెకు ఓవర్ డ్యూటీలు వేయడం, వ్యక్తిగత పనులు చేయించుకోవడం, అనారోగ్యంతో ఉన్నా సెలవు కావాలంటే ఇవ్వకుండా ఒత్తిడికి గురి చేయడం లాంటి వేధింపులకు ప్రిన్సిపాల్ పాల్పడ్డారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాధితురాలు శుక్రవారం విషగుళికలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమె ప్రస్తుతం తొర్రూరులోని ప్రయివేటు ఆస్పత్రిలో కుటుంబ సభ్యులు చేర్పించి, చికిత్స చేయిస్తున్నారు. ప్రిన్సిపాల్పై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు స్వరూప కుటుంబ సభ్యులు సిద్ధమవుతున్నట్లు సమాచారం.