Friday, April 26, 2024

నోటు తీసుకోకుండా ఓటు వేసే పరిస్థితులు రావాలి..

తప్పక చదవండి
  • తెరాస ప్రభుత్వం మొదటిసారి గెలిచినప్పుడు నిర్మాణాత్మక పాత్ర పోషించింది..
  • రెండవసారి గెలిచినప్పుడు డిస్ట్రక్షన్ పాత్రలో కొనసాగుతూ బీ.ఆర్.ఎస్ గా మారింది
  • తెలంగాణ ప్రజా ప్రతినిధులపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు…
  • ఈ సారి ఇక్కడి ప్రజలు మార్పు కోరుకుంటున్నారు.
  • టీడీపీకి అవకాశం ఇవ్వమని కోరుతున్నాం..
  • ప్రజలు ఆదరిస్తే ప్రజలు మెచ్చే స్వపరిపాలనను అందిస్తాం..
  • టీడీపీ నాయకులు కాసాని వీరేష్ ముదిరాజ్…

హైదరాబాద్ : గతంలో టీడీపీ పార్టీ పెట్టినప్పుడు అతిసామాన్యుడు ఎమ్మెల్యే , ఎంపీ తో పాటు పలు రాజకీయ పదవులు చేప్పట్టే అవకాశం ఉండేది. కానీ నేడు రాజకీయాలు పూర్తిగా డబ్బు రంగు పులుముకున్నాయి.ఇప్పుడు ఒక సర్పంచ్ గా పోటీ చేసే అభ్యర్థి సుమారు కోటి రూపాయలు ఖర్చు చేసే పరిస్థితి ఏర్పడిందంటే ఇక ఎమ్మెల్యే, ఎంపీల సంగతి వేరే చెప్పాల్సిన పనే లేదు. ఇటీవల జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో కొన్ని వందల కోట్లు ఖర్చయ్యాయని విశ్లేషకులు,పత్రికలు గొంతెత్తి చెబుతున్నారు. ఇలా కోట్లు కుమ్మరిస్తూ పొతే ప్రజాస్వామ్యం ఎలా బ్రతుకుతుంది.. ? ప్రజలకు మంచి చేసే నాయకులు ఎలా వస్తారు.. ? మార్పు ప్రజల నుంచి రావాలి. విద్యావంతులు ప్రజలను చైతన్యవంతులను చేయాలి. ప్రజలు మంచి వ్యక్తికి, పార్టీకి అవకాశం కల్పించాలి.. కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గుణగణాలని పుణికిపుచ్చుకున్న యువ లీడర్ విద్యావంతుడు, న్యాయవాది.. కాసాని వీరేష్ ముదిరాజ్ తో ఆదాబ్ చిట్ చాట్.. మా ప్రేక్షకుల కోసం..

రిపోర్టర్ :- నమస్కారం కాసాని వీరేష్ ముదిరాజ్ గారు.
కాసాని వీరేష్ :- నమస్కారం..

- Advertisement -

రిపోర్టర్ :- మీ మనసంతా నింపుకున్న అభ్యుదయ భావాలను ఈ లోకానికి పరిచయం చేయాలనే సంకల్పంతో మీ దగ్గరికి వచ్చాము.. ముందుగా మీ రాజకీయ జీవితం ఎలామొదలయ్యింది.
కాసాని వీరేష్ :- మేము మా కుటుంబ పెద్దల నుంచి (తాత,తండ్రి,బాబాయిలు ) అడిగిన వారికి లేదనకుండా చేతనయిన సహాయం చేస్తూనే వస్తున్నాం. ఆర్థికంగా కొంత బలంగా ఉన్న మా పెద్దలు ఎమ్మెల్సీలుగా,జెడ్పి ఛైర్మెన్ లుగా ,ఎంపీపీ లుగా సర్పంచులుగా, ఉపసర్పంచులుగా పని చేసి ప్రజలకు ఏంతో మంచి చేశారు. . వారి నుంచే ప్రజలకు మంచి చేయడం నేర్చుకున్నా..

రిపోర్టర్ :- మీరు ఎం చదువుకున్నారు..
కాసాని వీరేష్ :- ఎంబీఏ, ( ఐ.టి.ఎఫ్. ) ఎల్.ఎల్.బీ.,

రిపోర్టర్ : రాజకీయాల్లో మీ రోల్ మోడల్ ఎవరు..?
కాసాని : నాకు స్ఫూర్తి నిచ్చింది మొదటగా దివంగత ఎన్టీ రామారావు గారు , దివంగత రాజీవ్ గాంధీ గారు , దివంగత రాజశేఖర్ రెడ్డి గారు , నా నిత్య జీవితంలో నా రాజకీయ జీవితంలో నా రోల్ మోడల్ మా కాసాని జ్ఞానేశ్వర్ గారే .. టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు మంచి అడ్మినిస్ట్రేటర్ గొప్ప నాయకుడు వారి ఆలోచనలు,కమ్మిట్మెంట్,ప్రజలకు మంచి చేయాలనుకునే తపన ఆయన్ని గొప్ప నాయకుడిని చేశాయి. అదే స్ఫూర్తిని నేను కొనసాగించాలనుకుంటున్నాను.

రిపోర్టర్ :- మరి టీడీపీలో ఎందుకు జాయిన్ అయ్యారు..?
కాసాని వీరేష్ :- గతంలో మేము మా కుటుంబ సభ్యులు టీడీపీతో పనిచేశాం.టీడీపీ పార్టీ పెట్టినప్పుడు అతిసామాన్యుడు కూడ ఎమ్మెల్యే , ఎంపీలతో పాటు పలు రాజకీయ పదవులు చేప్పట్టే అవకాశం వచ్చింది. ఇప్పుడు గొప్పగా రాజకీయాల్లో వెలుగు వేలుగుతున్ననాయకులెందరికో ఒకప్పుడు టీడీపీ రాజకీయ ఓనమాలు నేర్పింది. వాళ్లంతా ఒకప్పుడు సామాన్య జీవితం గడిపినవాళ్ళే.. మా కుటుంబ నేపథ్యం కూడా అదే సామాన్యులకు,సంబండ వర్గాల ప్రజలకు అవకాశం కల్పించడమే ..టీడీపీ అదే స్ఫూర్తిని కొనసాగిస్తుంది. అందుకే టీడీపీ పార్టీలో చేరాం..

రిపోర్టర్ :- టీటీడీపీలో ఒక సామాజిక వర్గానికే ప్రాముఖ్యత ఉంటుందా.
కాసాని వీరేష్ :-అలాంటిది ఏమి లేదు.. అన్నివర్గాల ప్రజలను టీడీపీ ఆదరిస్తోంది.మరీ ముఖ్యంగా సంబండ వర్గాల ప్రజలను చైతన్య పరిచి వారి చేతుల్లో అధికారం ఉంచాలన్నదే మా ప్రయత్నం. అందుకే తొలుత కాసాని జ్ఞానేశ్వర్ గారు మంగలి కులానికి చెందిన వ్యక్తికీ టికెట్ ఇస్తామని ప్రకటించారు. కుటుంబ పాలనకు, రాచరిక వ్యవస్థకు చరమగీతం పాడాలన్నదే మా లక్ష్యం.

రిపోర్టర్ :- టీటీడీపీకి తెలంగాణలో ప్రజాదరణ ఇంకా ఉందని భావిస్తున్నారా..?
కాసాని వీరేష్ :- కాసాని జ్ఞానేశ్వర్ గారి రాకతో టీటీడీపీ కార్యకర్తల్లో, నాయకుల్లో నూతనోత్సహం ఉరకలేస్తోంది.తెలంగాణాలో టీడీపీ కార్యకర్తలు రెట్టింపు ఉత్సహంతో పనిచేస్తున్నారు. టీడీపీ శకం ముగిసిపోయిందని ప్రచారం చేస్తున్న ఓ వర్గం వారికి కాసాని జ్ఞానేశ్వర్ సమాధానంగా నిలిచారు. టీడీపీకి క్రమశిక్షణ కలిగిన నాయకులు, కార్యకర్తలున్నారు. వారితో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను. తెలంగాణాలో టీడీపీ అభిమాన గణం సుస్థిరంగా ఉంది .. అందులో ఎలాంటి సందేహం లేదు..టీడీపీ ని తప్పకుండ ప్రజలు ఆదరిస్తానే నమ్మకం ఉంది.

రిపోర్టర్ :- బి.ఆర్ఎస్ గా మారిన తెరాసా పనితీరు ఎలావుందీ..
కాసాని వీరేష్ :- తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి కెసిఆర్ తో పాటు తెలంగాణ రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరు జాక్ గా ఏర్పడి పెద్ద యుద్ధమే చేశారు.చాలా మంది అమరవీరులు ప్రాణాలను సైతం కోల్పోయారు. చివరికి తెలంగాణను సాధించుకున్నాం. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం మొదటిసారి గెలిచినప్పుడు నిర్మాణాత్మక పాత్ర పోషించింది. అందులో ఎలాంటి సందేహం లేదు.. అందుకే ప్రజలు మరింత మెజార్టీ ఇచ్చి రెండవసారి కూడా అవకాశం కల్పించారు. కానీ రెండవసారి గెలిచిన తెరాస డిస్ట్రక్షన్ పాత్రలో కొనసాగుతూ .. బి.ఆర్ఎ.స్ గా మారింది. నమ్మిన ప్రజలను నట్టేట ముంచింది.. ఇది నేను చెబుతున్నది కాదు.. కళ్ళముందు కనిపిస్తున్న వాస్తవం.. అందుకే ప్రజల్లో ఎమ్మెల్యే, ఎంపీ ల పని తీరుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పుడు ప్రజలు మార్పు రావాలని.. మరో కొత్త ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు. ఆ కొత్త ప్రభుత్వం టి.డీ.పీ అయితే బావుంటుందని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారని నేను అనుకుంటున్నాను..

రిపోర్టర్ :- ప్రభుత్వ తీరుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని మీరు ఎలా చెప్పగలరు..?
కాసాని వీరేష్ :- ముఖ్యమంత్రి ఓ కార్యక్రమంలో చెప్పిన మాటలు..రాష్ట్రంలో ఇటీవల జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే ప్రభుత్వంపై వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందొ ఇట్టే అర్ధం అవుతుంది. తమ పార్టీ నేతలే అవినీతికి పాల్పడ్డారని కెసిఆర్ స్వయంగా సభలో చెప్పడం.. తెరాస గుర్తుతో గెలిచి అభ్యర్థుల్లో 40కి పైగా సీట్లు కొత్తవారికంటూ పలు పత్రికల్లో ప్రచారం జరుగుతుండటం ఈ ప్రచారాలను ఆ పార్టీ నేతలు ఖండించకపోవడం బట్టి చూస్తుంటే ఎమ్మెల్యే, ఎంపీ ల పని తీరుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నిజమని స్పష్టమవుతుంది.

రిపోర్టర్ :- వ్యతిరేకత నిజమనుకుందాం .. కానీ టీడీపీకి అవకాశం ఇస్తారా..?
కాసాని వీరేష్ :- తెలంగాణ ప్రజలు చాలా ఉన్నతంగా ఆలోచిస్తారు. ఇప్పుడు రాష్త్రంలో జరుగుతున్న పరిణామాలు ప్రజలకు పూర్తిగా తెలుసు.. టీడీపీ గతంలో ఏం చేసిందన్న స్పష్టత కూడా ప్రజల్లో ఉంది. అందుకే నిర్భయంగా ప్రజల్లోకి వెళ్లగలుగుతున్నాం . శ్రీ కాసాని జ్ఞానేశ్వర్ గారి ఆధ్వర్యంలో ఇంటింటికి టీడీపీ జెండా,ఎజెండా కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ప్రజలకు మరోసారి అవకాశం కల్పించమని కోరుతున్నాం.. వారు ఆశీర్వదిస్తే ఖచ్చితంగా అధికారం చేపడుతాం. ప్రజల కోసం పనిచేసే టీడీపీ ప్రభుత్వమే తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ రావాలి .. చంద్రబాబు నాయుడు గారు ఎంతో విజన్ ఉన్న గొప్ప నాయకుడు అయన నాయకత్వంలో మేమంతా ముందుకు సాగుతాం..

రిపోర్టర్ :- ఈ సారి ఎన్నికల్లో మీరు పోటీ చేస్తారా..? ఒకవేళ చేస్తే ఎక్కడి నుంచి.. ?
కాసాని వీరేష్ :- నేను పార్టీ, జాతీయ, రాష్ట్ర అధ్యక్షుల సూచనల మేరకు మాత్రమే నడుచుకుంటాను. వారు అవకాశం ఇచ్చి ఆదేశిస్తే తప్పక పోటీ చేస్తాను..

రిపోర్టర్ :- పరిగి నుంచి అంటూ వార్తలు వినబడుతున్నాయి.. నిజమేనా..?
కాసాని వీరేష్ :- పరిగి నియోజకవర్గం నుంచి పోటీ చేయమని కార్యకర్తలు , నాయకులు ఒత్తిడి తెస్తున్నారు. నాకు మా కుటుంబ సభ్యులకు 25 ఏండ్ల నుంచి పరిగితో.. అక్కడి ప్రజలతో అనుబంధం ఉంది. అందుకే వారు ఆహ్వానిస్తున్నారు. పార్టీ, జాతీయ, రాష్ట్ర అధ్యక్షులు అవకాశం ఇస్తే తప్పక పోటీ చేస్తాను..

రిపోర్టర్ :- ఎన్నికల్లో గెలిస్తే ప్రజలకు ఎం చేస్తారు.
కాసాని వీరేష్ :- ప్రజలకు మనస్ఫూర్తిగా మంచి చేస్తాను. విద్య, వైద్యం,రోడ్లు,తాగునీరు,నిరుద్యోగంపై ప్రధానంగా దృష్టిపెడతాను. ఇక్కడి నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వచ్చే విధంగా పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తాను. సంబండ వర్గాల ప్రజల అభ్యున్నతికి పాటుపడుతాను.

రిపోర్టర్ :- చివరిగా ఓ ప్రశ్న యువతకు మీరు ఎం చెబుతారు..
కాసాని వీరేష్ :- చదువుకున్న యువతీ,యువకులు రాజకీయాలను అసహ్యించుకుంటున్నారు. మార్పు రావాలంటే యువతీ,యువకుల పాత్ర రాజకీయాల్లో చాలా అవసరం. వారు ప్రజలను చైతన్య పరచాలి. మంచి ప్రభుత్వం ఏర్పాటులో యువతీ,యువకులు భాగస్వామ్యులు కావాలి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు