- ధర్నాలు, రాస్తారోకోలు..దిష్టి బొమ్మ దహనం
- ఎక్కడిక్కడ టిడిపి నేతల అరెస్ట్ తో ఉద్రిక్తత
- ఆందోళనకు దిగిన ఎమ్మెల్యే వేగుళ్ల అరెస్ట్
విజయవాడ : టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్పై ఏపీ అట్టుడుకుతోంది. ఎక్కడికక్కడ ఆందోళనలకు దిగారు. సిఎం జగన్ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. వైసిపి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రోడ్లపైకి వచ్చి ధర్నాలు,రాస్తారోకోలు నిర్వహించారు. తెలుగు రాష్టాల్లోన్రి ప్రజాస్వామ్య వాదులంతా చంద్రబాబు అరెస్ట్పై స్పందిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబును నంద్యాలలో ఈ ఉదయం 6 గంటలకు పోలీసులు అరెస్ట్ చేయడంపై రాష్ట్రవ్యాప్తంగా టిడిపి శ్రేణులు భగ్గుమన్నాయి. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఆయనను అదుపులోకి తీసుకుని రోడ్డు మార్గంలో విజయవాడకు తరలించారు. తమ అధినేతలు అరెస్ట్ చేసిన నేపథ్యంలో టీడీపీ శ్రేణులు ఎక్కడికక్కడ ఆందోళన కార్యక్రమాలను చేపట్టాయి. ఆందోళన కారులను పోలీసులు కూడా ఎక్కడిక్కడే అరెస్ట్ చేసారు. తెలుగుదేశంనేతలను గృహనిర్బంధం చేశారు. మరోవైపు చంద్రబాబును తరలిస్తున్న రోడ్డు మార్గంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు నిరసనలకు దిగారు. ఈ నేపథ్యంలో, చంద్రబాబు కాన్వాయ్ రూటును పోలీసులు మార్చారు. పొదిలి నుంచి ఒంగోలు వైపు కాన్వారుని మళ్లించారు. గుంటూరు విూదుగా విజయవాడకు తరలించేలా ఏర్పాటు చేశారు. చంద్రబాబు నాయుడును నంద్యాలలో శనివారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో కోనసీమలో స్థానిక కపిలేశ్వరపురం రోడ్డులోని ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు ఆందోళనకు దిగారు. దీంతో పట్టణ పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఎమ్మెల్యే వేగుళ్ళతోపాటు మరో 21 మంది టిడిపి నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కలవపువ్వు సెంటర్ తదితరచోట్ల పోలీసులు మోహరించారు. ఇదిలా ఉండగా టిడిపి పట్టణ అధ్యక్షులు ఉంగరాల రాంబాబును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా బంద్ పాటించాలని టిడిపి నాయకులు పిలుపు నిచ్చారు. తెలుగు దేశం పార్టీ ఎంపీ కేశినేని నాని కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని సీఐడీ పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసిన విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. చంద్రబాబును రాజకీయ కక్షతోనే అరెస్ట్ చేశారని, వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు. కేశినేని నాని ప్రధాన మంత్రి కార్యాలయానికి కూడా ఓ ట్వీట్ చేశారు. చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్ట్ చేశారని తెలిపారు. ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకోవాలని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని, న్యాయాన్ని బలపరచాలని కోరారు. చంద్రబాబు నాయుడికి న్యాయం జరగాలని, ప్రజాస్వామ్యం చాలా విలువైనదని తెలిపారు. చంద్రబాబు దశాబ్దాల తరబడి అంకితభావంతో దేశానికి సేవలందిస్తున్నారని తెలిపారు. స్వచ్ఛమైన పాలన కోసం, అభివృద్ధి కోసం ఆయన అంకిత భావంతో చేసిన కృషిని ఇష్టపడే ప్రజలంతా ఆయన అరెస్ట్తో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారన్నారు.