- కాంగ్రెస్ టిక్కెట్ కావాలా.. దరఖాస్తు చేసుకోండి
- దరఖాస్తుకు నిర్ణీత రుసుము ఖరారు
- 25 వరకు దరఖాస్తుల స్వీకరణ
- పీసీసీ చీఫ్ అయినా దరఖాస్తు చేసుకోవాల్సిందే
- దరఖాస్తు నమూనాను విడుదల చేసిన రేవంత్
- రుసుమును పార్టీ కార్యక్రమాలకు ఉపయోగం
హైదరాబాద్
ఎమ్మెల్యే టికెట్ ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ పక్రియను తెలంగాణ కాంగ్రెస్ ప్రారంభించింది. శుక్రవారం నుంచి ఈనెల 25 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. పిసిసి చీఫ్ తో సహా అంతా దరకాస్తు చేసుకోవాల్సిందేనని, ఎవరికీ నేరుగా టిక్కెట్ ప్రకటించే అవకాశం లేదన్నారు. గాంధీభవన్లో మల్లు భట్టి విక్రమార్క తదితరుల కలసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతిరోజు ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు చెప్పారు. ఈమేరకు దరఖాస్తు నమూనాను రేవంత్ విడుదల చేశారు.ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు దరఖాస్తు రుసుము 25వేలుగా నిర్ణయించారు. బీసీ, ఓసీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము 50వేలు. అర్జీల స్వీకరణ తర్వాత అర్హులైన వారిపై సర్వేలు చేయిస్తాం. ప్రదేశ్ ఎన్నికల కమిటీ వడపోసిన జాబితాను స్క్రీనింగ్ కమిటీకి పంపుతాం. స్క్రీనింగ్ కమిటీ తర్వాత కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీకి పంపుతుంది. అక్కడ కూడా అభ్యర్థి ఎంపిక తేలకపోతే సీడబ్ల్యూసీకి పంపుతారు. పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నేత కూడా దరఖాస్తు చేసుకోవాల్సిందే. నమూనా దరఖాస్తును ఆన్లైన్లోనూ తీసుకోవచ్చని రేవంత్ తెలిపారు. ఈ మేరకు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున పోటీ చేయాలనుకునే అభ్యర్థుల నుంచి దరఖాస్తులను టీపీసీసీ స్వీకరించనుంది. దరఖాస్తులను పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీఏల్పీ నేత భట్టి విక్రమార్క గాంధీ భవన్లో విడుదల చేశారు. దరఖాస్తు రుసుము నాన్ రిఫండబుల్ అని.. పార్టీ కార్యక్రమాలకు ఉపయోగిస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ నెల 25 తర్వాత దరఖాస్తులను స్కూట్రీని చేస్తామన్నారు. ప్రతీ దరఖాస్తుదారుడి బలాలు, బలహీనతలపై సర్వేలు నిర్వహిస్తామన్నారు. సామాజిక సమీకరణాలు, అభ్యర్థుల బలాలను అంచనా వేసి స్క్రీనింగ్ కమిటీకి నివేదిక ఇస్తామని చెప్పారు. చివరిగా సెంట్రల్ ఎలక్షన్ కమిటీ అభ్యర్థులను ఖరారు చేస్తుందని తెలిపారు. మీడియాలో అభ్యర్థులు ఖరారు అని వచ్చే వార్తలు అవాస్తవమని అన్నారు. 25 తర్వాత ఎవరైనా పార్టీలో చేరి టిక్కెట్ అడిగితే పీఏసీ చర్చించి నిర్ణయం తీసుకుంటామని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ చాలా కాలంగా అధికారంలో లేకపోవడంతో పార్టీ నిర్వహణకు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. నిధుల సమస్య ఏర్పడటంతో … వినూత్న మార్గాల ద్వారా పార్టీ నేతల నుంచే నిధులు సమీకరిస్తున్నారు. చాలా రాష్ట్రాల్లో టిక్కెట్ల కోసం దరఖాస్తులు చేసేవారి దగ్గర అప్లికేషన్ ఫీజులు వసూలు చేస్తూ వస్తున్నారు. తెలంగాణలోనూ అదే పద్దతి పాటిస్తున్నారు. ఒక్కో నియోజకవర్గం నుంచి నలుగురు ఐదుగురు నేతలు పోటీ పడుతూంటారు. టిక్కెట్ కావాలంటే దరఖాస్తు చేసుకోవాల్సిందేనని స్పష్టం చేయడంతో అందరూ అప్లికేషన్లు కొని.. దరఖాస్తు చేసుకోవాలి. రిజర్వుడు కేటగరి సీట్లను మినహాయించినప్పటికీ.. పార్టీకి ఈ అప్లికేషన్ల ద్వారానే ఒకటి రెండు కోట్ల వరకూ నిధులు లభిస్తాయన్న అభిప్రాయం ఉంది.