- తన అక్కల కాళ్లుమొక్కి ఆశీర్వాదాలు తీసుకున్న కేసీఆర్..
- అనుబంధాలకు వేదికగా ప్రగతి భవన్..
- అన్న అనుబంధాన్ని తెలియచేస్తూ కవిత ట్వీట్..
హైదరాబాద్ : ప్రగతి భవన్లో రక్షా బంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. తోబుట్టువుల ప్రేమానురాగాలు, అనుబంధాలకు వేదికగా ప్రగతి భవన్ నిలిచింది. రాఖీ పండుగ సందర్భంగా సీఎం కేసీఆర్కు ఆయన తోబుట్టువులు రాఖీలు కట్టారు. అక్కలు లక్ష్మీబాయి, జయమ్మ, లలితమ్మ, చెల్లెలు వినోదమ్మ కలిసి కేసీఆర్కు రాఖీ కట్టి ఆశీర్వదించారు. అనంతరం తోబుట్టువులకు కేసీఆర్ పాదాభివందనాలు చేసి ఆశీర్వాదాలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభమ్మ, తదితరులు పాల్గొన్నారు. ఆదిలావుంటే రాఖీ పండుగ అంటేనే అనుబంధాలకు ప్రతీక. తమ సోదరులకు తోబుట్టువులు రాఖీ కట్టి.. ఈ అనుబంధం కలకాలం కొనసాగాలని కోరుకుంటారు. ఒకరికొకరు ఆశీర్వాదం తీసుకుంటారు. అంతటి ప్రత్యేకమైన రాఖీ పండుగ రోజు.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎమోషనల్ ట్వీట్ చేశారు. అమ్మలోని మొదటి అక్షరం ’అ’, నాన్నలోని చివరి అక్షరం ’న్న’ కలిపితే నా ’అన్న’ అంటూ మంత్రి కేటీఆర్తో ఉన్న ఫొటోను ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. ఇక మంత్రి కేటీఆర్ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. రాఖీ పండుగ నేపథ్యంలో రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్కు ఎమ్మెల్సీ కవిత రాఖీ కట్టారు. సోదరి సౌమ్య జోగినిపల్లితో కలిసి హైదరాబాద్లోని ఆయన నివాసానికి వెళ్లిన ఎమ్మెల్సీ కవిత రాఖీ కట్టారు. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ ట్విట్టర్ వేదికగా ఫొటోలను షేర్ చేశారు. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ అని పేర్కొన్నారు.