Tuesday, May 14, 2024

కీలక మార్పులతో బరిలోకి భారత జట్టు

తప్పక చదవండి

ఆసియా కప్‌-2023 సూపర్‌-4లో అద్భుత ప్రదర్శనతో అదరగొట్టిన రోహిత్‌ సేన.. ఈ టోర్నీలో ఫైనల్స్‌కు చేరిన తొలి టీమ్‌గా రికార్డుకెక్కింది. ఈ క్రమంలో రానున్న లీగ్‌ దశలో తమ చివరి మ్యాచ్‌ను బంగ్లాదేశ్‌తో తలపడనున్న భారత్‌.. తుది జట్టులో కీలక మార్పులతో బరిలో దిగబోతున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, జస్‌ప్రీత్‌ బుమ్రాలకు విశ్రాంతి ఇచ్చేందుకు మేనేజ్‌మెంట్‌ ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం అందింది. కీలక ఆటగాళ్లపై పనిభారాన్ని తగ్గించడంతో పాటు రానున్న ప్రపంచ కప్‌ కోసం ఇతర ప్లేయర్ల సన్నద్ధతను పరీక్షించేందుకే ఈ మేరకు నిర్ణయం తీసుకుందట. మరోవైపు కొలంబో వేదికగా జరిగిన భారత్‌- పాకిస్థాన్‌ సూపర్‌-4 మ్యాచ్‌.. వర్షం కారణంగా రెండు రోజుల పాటు సాగింది. ఆదివారం మొదలైన మ్యాచ్‌.. భారత్‌ గెలుపుతో సోమవారం ముగిసింది. అయితే ఇందులో గెలుపొందిన రోహిత్‌ సేన.. మళ్లీ 15 గంటల్లో శ్రీలంకతో మ్యాచ్‌ ఆడాల్సి వచ్చింది. అయితే అక్కడ కూడా మన ప్లేయర్లు సత్తా చాటి ఫైనల్స్‌లోకి ఎంట్రీ ఇచ్చేశారు. అయితే వరుసగా మూడు రోజుల పాటు రోహిత్‌ సేనకు తగినంత విశ్రాంతి దొరకనందున ఆ ప్రభావం క్రికెటర్లపై ఉండనుందని విశ్లేషకుల అభిప్రాయం. ముఖ్యంగా ఓపెనర్‌గా దిగిన కెప్టెన్‌ రోహిత్‌కు ఇది అదనపు భారం. అంతే కాకుండా తన పదిహేనేళ్ల కెరీర్‌లో ఇలా వెనువెంటనే వన్డే ఆడటం ఇదే తొలిసారి అంటూ ఇటీవలే విరాట్‌ కూడా వ్యాఖ్యానించాడు. ఇప్పుడు తన శరీరానికి కావాల్సినంత విశ్రాంతి అవసరమని పేర్కొన్నాడు. మరోవైపు విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ ఇప్పటికే టీ20 ద్వైపాక్షిక సిరీస్‌లలో ఆడటం లేదు. దీంతో వీరిద్దరిని దృష్టిలో ఉంచుకుని వన్డే వరల్డ్‌కప్‌కు ముందే మేనేజ్‌మెంట్‌ వీరికి విశ్రాంతినిచ్చేందుకు ప్లాన్‌ చేస్తోంది. ఇక వీరిద్దరితో పాటు జస్‌ప్రీత్‌ బుమ్రాకు కుడా రెస్ట్‌ ఇవ్వాలని మేనేజ్‌మెంట్‌ భావిస్తోందట. ఈ క్రమంలో ఒకవేళ రానున్న మ్యాచ్‌కు రోహిత్‌ దూరమైతే అతని స్థానంలో హార్దిక్‌ పాండ్యా కెప్టెన్‌గా బాధ్యతలు చేపడతాడు. ఇక తన ఫిట్‌నెస్‌ నిరూపించుకుంటే శ్రేయస్‌ అయ్యర్‌ కూడా ఈ మ్యాచ్‌తో రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు మిస్టర్‌ 360 సూర్యకుమార్‌ యాదవ్‌ కూడా రానున్న మ్యాచ్‌లో ఆడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. బుమ్రాకు రెస్ట్‌ ఇస్తే.. అతని ప్లేస్‌లో మహ్మద్‌ షమీ తుది జట్టులోకి రావొచ్చు. ఇదిలా ఉండగా.. రోహిత్‌ ప్లేస్‌లో శుభ్‌మన్‌ గిల్‌కు జోడీగా ఇషాన్‌ కిషన్‌ వస్తే.. మూడో స్థానంలో సూర్యకుమార్‌.. నాలుగో స్థానంలో శ్రేయస్‌.. ఆ తర్వాతి స్థానాల్లో రాహుల్‌, హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌ టాప్‌-8లో బ్యాటింగ్‌ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు