- ఆరుగురు భారత క్రికెటర్లకు చోటు..
మంగళవారం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రకటించిన ‘వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్’లో ఏకంగా ఆరుగురు భారత క్రికెటర్లకు చోటు దక్కింది. ఈ ఎలైట్ టీమ్కు కెప్టెన్గా రోహిత్ శర్మ ఎంపికయ్యాడు. 2023 సంవత్సరంలో అద్భుతంగా రాణించిన 11 మంది క్రికెటర్లతో కూడిన జట్టును ఐసీసీ ప్రకటించింది. సోమవారం ఐసీసీ ప్రకటించిన టీ20 జట్టులో నలుగురు టీమిండియా ఆటగాళ్లు ఎంపికయిన విషయం తెలిసిందే. దాంతో అంతర్జాతీయ క్రికెట్లో తమకు తిరుగులేదని భారత క్రికెటర్లు మరోసారి నిరూపించారు. 2023లో వన్డేల్లో రోహిత్ శర్మ 52 సగటుతో 1255 పరుగులు చేశాడు. ఐసీసీ ప్రపంచకప్ 2023లో ఆఫ్ఘనిస్తాన్పై 131 పరుగులు బాదాడు. అంతేకాకుండా భారత జట్టును అద్భుతంగా ముందుకు నడిపించాడు. దాంతో అతడికి వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్ కెప్టెన్సీ దక్కింది. ఐసీసీ జట్టులో సగానికి పైగా మనోళ్లే ఉన్నారు. శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్, మొహమ్మద్ షమీలు 11 మందిలో చోటు దక్కించుకున్నారు. వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ ఆడిన భారత్, ఆస్ట్రేలియాల నుంచి ఏకంగా 8 మంది ఐసీసీ జట్టుకు ఎంపికవ్వడం విశేషం. వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, ట్రావిస్ హెడ్, విరాట్ కోహ్లీ, డారిల్ మిచెల్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), మార్కో జాన్సేన్, ఆడమ్ జంపా, మొహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ షమీ.