- పూర్తిగా కబ్జాకు గురైన చెరువు నాలా..
- బఫర్ జోన్లోనూ భారీగా కబ్జాలు..
- నిబంధనలకు విరుద్ధంగా కట్టపై రోడ్డు..
- చెరువు కట్టకే గేటు..పట్టించుకోని అధికారులు
- జనం కోసం తరపున లోక్షాయుక్తలో ఫిర్యాదు
- ఉన్నతాధికారులు, సర్కార్ స్పందిస్తే.. ఈర్ల చెరువుకు పూర్వ వైభవం వచ్చే ఛాన్స్..
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మదీనాగూడ గ్రామ శివారు పరిధిలోని ఈర్ల చెరువు కబ్జారాయుళ్ల చేత చిక్కి విలవిలలాడుతోంది. సర్వే నెంబర్ 26లో రికార్డుల ప్రకారం మొత్తం 50 ఎకరాల విస్తీర్ణంలో ఈర్ల చెరువు ఉండాల్సి ఉండగా.. ఇప్పుడు అది చాలా వరకూ కుంచించుకుపోయింది. కబ్జారా యుళ్లు ఈర్ల చెరువును చాలా వరకు ధ్వంసం చేసి ఆక్రమణలకు పాల్ప డ్డారు. చెరువుకు సంబంధించిన నాలా మొత్తం అడ్రస్ లేకుండా చేసే శారు. బఫర్లోని చాలా భూమి కబ్జాకు గురైంది. అంతేకాక చెరువు కట్టపై ప్రభుత్వమే నిబంధనలకు విరుద్ధంగా తారురోడ్డు వేసినా. ఇరిగేషన్ శాఖ, రెవెన్యూ అధికారులు అస్సలు పట్టించుకోకపోవడం మరీ హస్యా స్పదంగా ఉంది. దీంతో పాటు చెరువు కట్ట కింద భాగం కూడా పూర్తిగా కబ్జాలమయం కావడం గమనార్హం. అయితే శేరిలింగంపల్లి మండలంలో అత్యంత కీలకమైన ఈ చెరువు, దాని బంఫర్ జోన్ పరిధిలో చాన్నాళ్లుగా కబ్జాలు జరుగుతున్నా అలాగే ఒక బిల్డర్ అలుగు పక్కనే రెండు మూడు నెలల కింద చెరువులో మట్టి పోసి కబ్జాకు ప్రయత్నం చేస్తున్న శేరిలింగం పల్లి ఇరిగేషన్ అధికారులు, రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి చూడ కపోవడం విస్మయం కలిగిస్తుంది అని స్థానిక ప్రజలు వాపోతున్నారు.
అయితే ఈర్ల చెరువుకున్న ప్రయార్టీ దృష్ట్యా ఈ చెరువు కబ్జాలమయం కాకుండా చాన్నాళ్లుగా కొందరు తీవ్ర పోరాటాలు,ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. జనం కోసం వంటి సంస్థలు తమ శక్తికి మించి ఈర్ల చెరువును కాపాడుకునేందుకు న్యాయ,ప్రజా పోరాటాలు చేస్తోంది. 2010 నుంచి ఈ సంస్థ ఈర్ల చెరువు పరిరక్షణ కోసం లీగల్ బ్యాటిల్ చేస్తోంది. అందులో భాగంగానే జనం కోసం సంస్థ ఈర్ల చెరువు సంరక్షణ కోసం చాన్నాళ్ల క్రితమే లోకాయుక్తలో ఫిర్యాదు కూడా చేసింది. ఈ నేపథ్యంలోనే లోకాయుక్త ఈర్ల చెరువుపై సమగ్ర విచారణ చేసి సర్వే రిపోర్ట్ ను ఇవ్వడం జరిగింది. అయితే లోకాయుక్త సర్వే రిపోర్టు ఇచ్చినప్పటికీ.. అందులో కొందరు వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించడంతో ఈ వ్యవహారం ముందుకు కదలని పరిస్థితులు నెలకొన్నాయి.
అయితే ఈర్ల చెరువు, బంఫర్ జోన్ కబ్జాలపై కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం తరువుగా విచారించి ట్యాంక్ బౌండరీస్ ను ఫిక్స్ చేయించగల్గితే ఈ ప్రాంతంలో మళ్లీ ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అంతేకాక శేరిలింగంపల్లి మండలంలో అత్యంత విలువైన ఈర్ల చెరువు భూమిని కూడా సంరక్షించుకునేందుకు మార్గం సుగమం అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి.