- కలెక్టర్ పర్యవేక్షణ లేకపోవడంతో టీపీవో, టీపీఎస్లదే హవా
- కోట్లకు పడగలెత్తుతున్న అవినీతి టౌన్ ప్లానింగ్ అధికారులు
- పథకం ప్రకారం ప్రభుత్వాన్ని ఆర్ధికంగా దివాళా తీయిస్తున్న వైనం
- అడ్డగోలుగా అనుమతులిస్తూ మున్సిపల్ ఆదాయానికి గండి
- కిలోమీటర్ల పొడవున నిర్మాణాలు, ఒక్కదానికి అనుమతుల్లేవు
- చైన్మెన్ల అక్రమ సంపాదనే 5 లక్షలుపైగా ఉంటుందట
- ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ దృష్టి సారించాలని స్థానికుల డిమాండ్
మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో అవినీతి రాజ్యమేలుతోంది.. కిలోమీటర్ల పొడవున అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు యదేచ్చగా చేపడుతున్నప్పటికీ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఏమి పట్టనట్టు వ్యవహరిస్తూ.. అక్రమ నిర్మాణాలను ప్రోత్సాహిస్తూ.. అందినకాడికి వెనుకేసుకుంటూ పరోక్షంగా మున్సిపల్ ఆదాయానికి గండికొడుతూ కోట్ల రూపాయల నష్టాన్ని తెచ్చిపెడుతున్నారు.. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు జరగడం ఇక్కడ సర్వ సాధారణ విషయంగా మారిపోయింది. వీటిపై స్థానికులు సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ వారు ఏమి పట్టనట్టు వ్యవహరించడంఫై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్ళితే ..
బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో టౌన్ ప్లానింగ్ సూపర్వైసర్గా పనిచేస్తున్న కావ్య వారంలో నాలుగు రోజులు మాత్రమే విధులకు హాజరవుతాని తెలుస్తోంది.వీరితో పాటు టౌన్ ప్లానింగ్ అధికారి వీరాస్వామి కూడా వారంలో శుక్ర, శని వారం మాత్రమే విధులకు హాజరవుతారట .. టౌన్ ప్లానింగ్ సూపర్వైసర్ గా పనిచేస్తున్న కావ్య,టౌన్ ప్లానింగ్ అధికారి వీరాస్వామి ఈ ఇద్దరు అధికారులే బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో కీలకమని అంతా చెప్పుకుంటున్నారు. వీరు ఆడిరదే ఆటగా.. పాడిరదే పాటగా వ్యవహారాలు నడుస్తున్నాయని అంతా అనుకుంటున్నారు. విధులకు చెప్పకుండా .. డుమ్మా కొట్టిన వీరిని ఏ అధికారి పిలిచి మందలించడట.. బోడుప్పల్ మున్సిపల్ లో ఎక్కడ అక్రమ కట్టడాలు జరిగినా.. ముందుగా తెలిసేది (చైన్ మెన్) ఒక్క తాత్కాలిక సిబ్బందికి మాత్రమే.. వీరు చిన్న చిన్న అక్రమ ఆకట్టడాల విషయాలను తామే సొమ్ము చేసుకుంటూ భారీ కట్టడాల ప్రస్తావనను టౌన్ ప్లానింగ్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్తున్నారట. ఈ తాత్కాలిక సిబ్బంది ఒక్కో నిర్మాణానికి ఒక్కో రేటు నిర్ణయించి అధికారులకు నిర్మాణదారునికి సమన్వయ కర్తలుగా పనిచేస్తూ అన్నీ వ్యవహారాలు దగ్గరుండి చక్కబెడుతుంటారాట..
తాత్కాలిక సిబ్బంది సంపాదనే 5 లక్షలుపైనే.
మున్సిపల్ పరిధిలో కిలోమీటర్ల పొడవున వందల సంఖ్యలో పుట్టగొడుగుల్లా అనుమతులు లేకుండా కమర్షియల్ షెడ్లు, బహుళ అంతస్తుల నిర్మాణాలు పుట్టుకొస్తున్న బాధ్యత కలిగిన సంబంధిత మున్సిపల్ అధికారులకు మాత్రం కనీసం చీమ కుట్టినట్లయినా ఉండటంలేదు .. ఆవు చేనులో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నచందంగా తయారయ్యింది బోడుప్పల్ మున్సిపాల్టీ పరిస్థితి.తాత్కాలిక సిబ్బంది ఒక్కో నిర్మాణానికి ఒక్కో రేటు నిర్ణయించి అధికారులకు నిర్మాణదారునికి సమన్వయ కర్తలుగా పనిచేస్తూ పోతుంటే టౌన్ ప్లానింగ్ సిబ్బంది అక్రమాలను సక్రమమం చేస్తూ మూడు పువ్వులు ఆరుకాయలుగా వ్యవహారాలు చక్కబెడుతున్నారు. దీంతో లక్షల్లో మున్సిపల్ ఆదాయానికి గండిపడుతుందని పలువురు నిబద్దతతో కూడిన అధికారులు చెబుతున్నారు.
కలెక్టర్ పర్యవేక్షణ లేకపోవడంతో టీపీవో,టీపీఎస్లదే హవా ..
మున్సిపల్లోని ఏ వార్డు కెళ్ళినా.. ఏ గళ్లీ కెళ్ళినా అక్రమ నిర్మాణాలు, సెట్ బ్యాక్ లేకపోయినా అధికారులు ఇచ్చిన అనుమతులు, అవినీతి అధికారుల బాగోతాలు అనుమతి లేకుండా పై అంతస్తులు వేసినా భవన నిర్మాణాలు దర్శనమిస్తుంటాయి . వీటిలో మొదటగా తాత్కాలిక సిబ్బంది చైన్ మెన్లు మొదటగా వసూళ్లకు దిగుతారు. భవన నిర్మాణ యజమానితో బేరం మాట్లాడుతారు. వారు ఇవ్వలేదో ఇక ఆ ఇంటి యజమానికి చుక్కలు చూపిస్తారు. ఈ వ్యవహారం అటు మేయర్కు కానీ ఇటు అధికారులకు తెలియనియనివ్వకుండా తాత్కాలిక సిబ్బంది ఎంతో జాగ్రత్త పడుతున్నారు. ఈ మధ్యనే చైన్ మెన్ రాజు అనే తాత్కాలిక సిబ్బంది ఓ ఇంటి యజమానికి పట్టపగలే చుక్కలు చూపించిన వ్యవహారంపై స్థానికంగా పెద్దే చర్చే నడిచింది. ఇకనైన ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ బోడుప్పల్లో జరిగిన, జరుగుతున్న అవినీతి అక్రమాలపై దృష్టి సారించి అవినీతి అధికారుల భరతం పట్టాలని స్థానికులు కోరుతున్నారు.