- భయాందోళనలో విద్యార్థులు….
మఖ్తల్ : మఖ్తల్ మున్సిపాలిటీ పరిధిలోని దండుగ్రామంలోని ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా తయారైంది. ఇప్పటికే వరుసగా కురుస్తున్నవర్షాలకు పాఠశాలలోని రెండు గదుల్లో పెచ్చులూడటంతోపాటు గోడలకు బీటలువారి, ఎప్పుడు కూలుతుందో తెలియని ప్రమాదకరస్థితికి చేరుకుంది. దీంతో పాఠశాలలోని ఆ రెండు గదుల్లో కేవలంసా మాన్లకు మాత్రమే పరిమితం చేశారు. విద్యార్థులను బయట వరండాలో కూర్చోబెడుతున్నట్లు హెచ్ఎం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మొత్తం మూడు గదులు ఉండగా…రెండు గదులు ప్రమాదకరస్థితికి చేరుకున్నాయని, మిగతా ఒక్క రూమ్ లోనే దాదాపు 75 మందికిపైగా విద్యార్థులతో నెట్టుకొస్తున్నామని తెలిపారు. ఇప్పటికే అధికారులకు అనేకసార్లు అదనపు గదుల కోసం ప్రతిపాదనలు పంపినా…మనఊరు మనబడిలో దండు పాఠశాల ఎంపిక కాలేదన్నారు. ఇటు మరుగుదొడ్లు సైతం పూర్తిగా అధ్వాన్నస్థితికి చేరుకున్నాయి. వంటగది సైతం షెడ్డు కింద ఆపసోపాలు పడుతూ…విద్యార్థులకు మద్యాహ్నభోజనం అందిస్తున్నారు. పాఠశాల కాంపౌండ్ వాల్ సైతం ధ్వంసమైంది. ఇప్పటికైనా పాఠశాలకు త్వరగా అదనపు గదులు నిర్మించి, ఆదుకోవాలని కోరుతున్నారు. బాలుర ఉన్నత పాఠశాలలో సైతం.. మఖ్తల్ పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో సైతం పలు గదులు పూర్తిగా వర్షానికి తడిసిపోయి ముద్దగా మారిపోయాయి. ఇప్పటికీ బీటలు వారి ప్రమాదకరంగా తయారయ్యాయి. దాదాపు 800 వరకు విద్యార్థులు ఉన్న బాలుర ఉన్నత పాఠశాలలో తరగతి గదులు సరిపోవడం లేదని, శిథిలావస్థకు చేరుకున్న గదుల స్థానంలో నూతన గదులు నిర్మించాలని జీహెచ్ఎం అనిల్ గౌడ్ కోరుతున్నారు. వీటితోపాటు వనయకుంట, సోమేశ్వర బండ పాఠశాలల్లో సైతం గదులు అధ్వాన్నస్థితికి చేరుకోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. మన ఊరు మన బడి కింద ఈ నాలుగు పాఠశాలలు ఎంపిక కాలేదని, త్వరలోనే ఉన్నతాధికారులు ఈ పాఠశాలలకు నూతన గదులు కేటాయించి, సమస్యలు తీర్చాలని కోరుతున్నారు.
తప్పక చదవండి
-Advertisement-