Thursday, May 16, 2024

నిరుపమానాలు… సరిహద్దు భద్రతా దళ సేవలు

తప్పక చదవండి
  • డిసెంబర్‌ 1 సరిహద్దు భద్రతా దళ ఏర్పాటు దినోత్సవం

భారత దేశం స్వాతంత్య్రం సాధించాక, దేశ అంతర్జాతీయ సరిహద్దుల రక్షణ ప్రతి సరిహద్దు రాష్ట్రానికి చెందిన స్థానిక పోలీసుల బాధ్యతగా ఉండేది. అయితే ఈ విషయంలో అంతర్‌ – రాష్ట్ర సమన్వయం తక్కువగా ఉంది. 1965 ఇండో – పాకిస్తానీ యుద్ధం సమయంలో, పాకిస్తాన్‌ 9 ఏప్రిల్‌ 1965న కచ్‌లోని సర్దార్‌ పోస్ట్‌, ఛార్‌ బెట్‌ మరియు బెరియా బెట్‌లపై దాడి చేసింది. సాయుధ దాడిని ఎదుర్కోవడంలో రాష్ట్ర సాయుధ పోలీసుల అసమర్థతను ఈ దాడి బట్టబయలు చేసింది. యుద్ధం ముగిసిన తర్వాత, భారతదేశం యొక్క అంతర్జాతీయ సరిహద్దులను కాపాడే నిర్దిష్ట ఆదేశంతో ప్రభుత్వం సరిహద్దు భద్రతా దళాన్ని ఏకీకృత కేంద్ర ఏజెన్సీగా సృష్టించింది. ఈ నేపథ్యంలో 1965, 1 డిసెంబర్‌ న భారత సరిహద్దుల భద్రతను నిర్ధారించడం కోసం ఏర్పడిరది. ప్రపంచంలోని అతిపెద్ద సరిహద్దు బలగాలలో ఒకటైన భారత బి. ఎస్‌. ఎఫ్‌. దేశం కోసం 6000 కి.మీ కంటే ఎక్కువ అంతర్జాతీయ సరిహద్దుకు బాధ్యత వహిస్తుంది. ఈ ఏజెన్సీ ప్రధానంగా…సరిహద్దులు దాటిన నేరాలను నిరోధించడం, భారత భూభాగంలోకి అనధికారికంగా ప్రవేశించనీయ కుండా చేయడం, సరిహద్దులో స్మగ్లింగ్‌ మరియు ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలను నిరోధించడం, చొరబాటు నిరోధక విధులు, సరిహద్దుల మధ్య నిఘా సేకరణ, సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ప్రజలలో భద్రతా భావాన్ని పెంపొందించడం లక్ష్యాలు.
భారత సైనికులు ఇరవై నాలుగు గంటలు సరిహద్దుల్లో దేశానికి కాపలా కాస్తూ ఎడారి ఎండల్ని, మంచుకొండల మంచును, నిరంతరం కురిసే వర్షాలను లెక్క చేయకుండా దేశ రక్షణలో ప్రాణ త్యాగానికైనా సిద్ధపడి ఉండడం వల్ల మాత్రమే మనం శాంతి యుతంగా జీవించ గలుగు తున్నాం. తమ కుటుంబాలకు దూరంగా మంచు కొండల్లో, ఎముకలు కొరికే చలిలో విధులు నిర్వర్తిస్తూ దేశాన్ని కంటికి రెప్పలా కాపలా కాస్తూ, కేవలం దేశరక్షణకే పరిమితం కాకుండా వరదలు, భూకంపాల వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజల రక్షణలోనూ ముందుంటున్న మన సైనికుల రుణాన్ని ఏ విధంగా తీర్చుకోవడం సాధ్యం.. భారతీయ సైన్యం చరిత్ర కొన్ని వేల సంవత్సరాలకు పైబడిరదే. మహాభారత కాలాల్లో కురుక్షేత్ర సంగ్రామంలో లక్షలాది మంది యుద్ధంలో పాల్గొన్నారు. రధాలు, గుర్రాలు, ఏనుగులపై నుంచి యుద్ధం సాగించడమే కాకుండా నేలపై నుంచి కూడా యుద్ధం చేసారు. అప్పట్లో విశ్వశాంతి, ధర్మ పరిరక్షణల కోసం అనేక యుద్ధాలు జరిగాయి. క్రమక్రమంగా రాజ్య విస్తరణ కాంక్షతో, నాగరికత పెరిగే కొద్దీ వాయవ్య దిశగా హిందూకుష్‌ పర్వతాల ద్వారా చొరబాట్లు పెరిగాయి. ఎన్నో శతాబ్దాల పాటు అక్కడ పర్యవేక్షణ లేదు. ఆ తరువాత చొరబాట్లకు అనేక మార్గాలు ఏర్పడ్డాయి. వీటిని ఎదుర్కొనేందుకు ఆయా ప్రదేశాల రాజ్యాధినేతలు యుద్ధాలు చేయాల్సి వచ్చేది. స్వదేశీ తెగల్లోని సైన్యం ప్రధాన ఆయుధాలు విల్లు, బాణాలు. ఆనాటి యుద్ధ కారణాలు పరిమితంగా ఉండేవి. మనుగడ, చొరబాట్లకు సంబంధించినవే ఎక్కువ. భారతీయ రాజకీయ చరిత్రలో చెపుకోదగ్గ తొలి చొరబాటు క్రీ.పూ.327 లో అలెగ్జాండర్‌ అధ్వర్యంలో గ్రీకులది.
ప్రాచీన భారతీయ సాహిత్యంలో రాజకీయాల్లో యుద్ధాల ప్రస్తావనలు ప్రముఖంగా కనిపిస్తాయి. చంద్రగుప్త మౌర్యులు కాలంలోని సైన్యాన్ని ఈ సందర్భముగా ప్రస్తావనార్హం. కళింగ, మౌర్యుల గుప్తుల కాలం లో మన దేశానికి నిలయంగా ప్రపంచ గుర్తింపు లభించినది. ఈ విధంగా రాజ్యాల రక్షణ కోసం సైన్యము సైనిక అవసరాలు కలిగాయి. స్వాతంత్య్రం సాధించుకున్నాక, స్వతంత్ర రాజ్యమైన కాశ్మీర్‌ మహారాజు ఇటు భారత దేశంలో లేదా అటు పాకిస్తాన్‌లో విలీనానికి అంగీకరించలేదు. మహారాజు భారత ప్రభుత్వాన్ని శరణు కోరి భారత దేశంలో కాశ్మీర్‌ను విలీనం చేయడానికి అంగీకరించి ఒప్పందం చేసాడు. అప్పుడు భారత ప్రభుత్వం జనరల్‌ తిమ్మయ్య నేతృత్వంలో సైన్యాన్ని పంపి పాకిస్తాన్‌ సైన్యాన్ని కాశ్మీర్‌ నుండి వెళ్ళగొట్టే చర్యలుచేపట్టింది. తర్వాత… బ్రిటీష్‌, ఫ్రెంచ్‌ సైన్యాలు భారత దేశాన్ని విడిచి వెళ్ళినా, పోర్చుగీసు సైన్యం విడిచి వెళ్ళక గోవా, డామన్‌ డయ్యులను తన ఆధీనంలో ఉంచుకుంది. భారత ప్రభుత్వం ఆపరేషన్‌ విజయ్‌ పేరుతో సైన్యాన్ని పంపగా, పోర్చుగల్‌ దేశం భారతదేశంతో సంధికి ఒప్పుకొని అన్ని ప్రాంతాలను విడిచి వెళ్ళేందుకు అంగీకరించింది. చైనాతో 1962లో జరిగిన యుద్ధంలో సైన్యం అంతులేని సాహసాలు ప్రదర్శించారు. కాశ్మీర్‌ ప్రజలు పాకిస్తాన్‌ కు మద్దతు ఇస్తారు అన్న అపోహలతో 1965లో పాకిస్తాన్‌ అధ్యక్షుడు అయూబ్‌ ఖాన్‌ తన సైన్యాన్ని పంపి కాశ్మీర్‌ను కొంత మేరకు ఆక్రమించు కున్నాడు. భారత తానేమిటో చూపెట్టింది. 1971లో తూర్పు పాకిస్తాన్‌ (ప్రస్తుత బంగ్లాదేశ్‌) లో జరిగిన తిరుగు బాటుతో దాదాపు కోటి మంది శరణార్థులు భారత దేశానికి రావడంతో భారత్‌-పాక్‌ యుద్ధం మొదలయింది. తన బలగాల న్నిటినీ పశ్చిమ పాకిస్తాన్‌ (ప్రస్తుత పాకిస్తాన్‌) వైపే గురి పెట్టగలిగింది. భారత సైన్యం జనరల్‌ అరోరా నేతృత్వంలో పాక్‌ సైన్యాన్ని లాహోర్‌ వరకు తరిమి కొట్టి 90వేల యుద్ధ ఖైదీలను పట్టుకొంది. పాక్‌ ఓటమిని అంగీకరించడంతో ఈ యుద్ధం ముగిసింది.
1999లో పాకిస్తాన్‌ తన సైన్యాన్ని పంపి తీవ్రవాదులతో కలసి బటాలిక్‌, ద్రాస్‌, టైగర్‌ హిల్‌లను ఆక్రమించు కోవడం, కార్గిల్‌ యుద్ధం జరుగుతున్న ప్రాంతాల కున్న పరిమితులవల్ల 30వేల మంది మాత్రమే పాల్గొన్నారు. సైన్యం అనేక కీలక పర్వతాలలో, చెక్‌ పోస్టుల వద్ద ఉన్న తీవ్రవాదులను సమర్థవంతంగా ఎదుర్కొని రెండు నెలల్లో అన్నింటినీ స్వాధీనం చేసుకుంది. ఇలా భారత సరిహద్దు లలో సైన్యం అంతులేని ధైర్య సాహసాలు ప్రదర్శిస్తు, సకల త్యాగాలకు సిద్ధపడి, ప్రాణాలను పణంగా పెట్టి అనుక్షణ అప్రమత్తులై దేశ రక్షణ చేస్తున్నారు. 1990వ దశకంలో, వాస్తవానికి భారతదేశం యొక్క బాహ్య సరిహద్దులను రక్షించే బాధ్యతను స్వీకరించినప్పటికీ , జమ్మూ మరియు కాశ్మీర్‌, పంజాబ్‌ మరియు ఈశాన్య ఏడు రాష్ట్రాలలో తిరుగుబాటు నిరోధక మరియు తీవ్రవాద వ్యతిరేక కార్యకలా పాలలో బిఎస్‌ఎఫ్‌.కు బాధ్యతలు అప్పగించ బడ్డాయి. పంజాబ్‌లో ఉన్నప్పుడు, బ్లూ స్టార్‌, బ్లాక్‌ థండర్‌ వంటి కార్య కలాపాలలో పాల్గొంది.
జమ్మూ కాశ్మీర్‌లో, మొదట్లో తీవ్రవాద దాడులతో నష్టపోయినప్పటికీ, తరువాత విజయాలు సాధించింది. 2001 ఆగస్టు 2003లో జరిగిన భారత పార్లమెంటు దాడికి ప్రధాన సూత్రధారి మరియు అతని డిప్యూటీ కమాండర్‌తో పాటు జైష్‌-ఎ-మహ్మద్‌ చీఫ్‌ మరియు ఘాజీ బాబాను చంపిన ఘనత కూడా బి ఎస్‌ ఎఫ్‌ కు ఉంది. నక్సల్‌ హింసను ఎదుర్కోవడానికి మధ్య భారతదేశంలో బి యస్‌ ఎఫ్‌ కొన్ని యూనిట్లు కూడా మోహరించ బడ్డాయి. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇటీవలే సరిహద్దు భద్రతా దళం అధికారాల పరిధిని పెంచింది. ఈ మేరకు అధికారులకు అరెస్టు, సెర్చ్‌, స్వాధీనం చేసుకునే అధికారాలను ఇచ్చింది. ఈ అధికార పరిధి అంతర్జాతీయ సరిహద్దులను కాపాడే పశ్చిమ బెంగాల్‌, పంజాబ్‌, అసోం మూడు రాష్ట్రాలలో బిఎస్‌ఎఫ్‌ తన విస్తరించబడిన అధికారాలను అమలు చేయడానికి జూలై 2014 కంటే ముందటి నోటిఫికేషన్‌ షెడ్యూల్‌ను సవరిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.
రామ కిష్టయ్య సంగన భట్ల…
9440595494
డిసెంబర్‌ 1 సరిహద్దు భద్రతా దళ ఏర్పాటు దినోత్సవం

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు