- ఆక్రమణలపై మోడీ పచ్చి అబద్దాలు చెబుతున్నాడు..
- కార్గిల్ యుద్దస్మారకం వద్ద నిప్పులు చెరిగిన రాహుల్..
- లడఖ్ రక్తం, డీఎన్ఏలలో గాంధీజీ, కాంగ్రెస్ భావజాలం ఉంది..
న్యూ ఢిల్లీ :
భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకున్న విషయాన్ని దాచి పెడుతున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇందులో నిజాలు దాస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. చైనా భూమిని ఆక్రమించలేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్తున్నదంతా అబద్ధమని ఆరోపించారు. మన భూమిని చైనా సైన్యం ఆక్రమించిందని చెప్పారు. ఆయన కార్గిల్లో శుక్రవారం నిర్వహించిన సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా కార్గిల్ యుద్ధ వీరుల స్మారక కేంద్రం వద్ద అమరులకు నివాళులర్పిస్తారు. లడఖ్ వ్యూహాత్మక ప్రదేశం. ఒక విషయం సుస్పష్టం. భారత దేశ భూమిని చైనా ఆక్రమించుకుంది. చైనా ఒక అంగుళం భూమినైనా ఆక్రమించుకోలేదని ప్రతిపక్షాల సమావేశంలో ప్రధాన మంత్రి చెప్పడం విచారకరం. ఇది అబద్ధం అని రాహుల్ గాంధీ ఆరోపించారు. భారత్ జోడో యాత్ర గురించి ప్రస్తావిస్తూ, తాను కన్యాకుమారి నుంచి కశ్మీరు వరకు పాదయాత్ర చేశానని చెప్పారు. దేశంలో బీజేపీ, ఆరెస్సెస్ వ్యాపింపజేస్తున్న హింస, విద్వేషాలకు వ్యతిరేకంగా నిలవడమే లక్ష్యంగా ఈ యాత్ర జరిగిందన్నారు. మోదీ తమ మనసులో మాట మన్ కీ బాత్ చెప్పడంలో తీరిక లేకుండా గడుపుతారన్నారు. తాను మాత్రం విూ మనసులో మాటను వినాలని అనుకున్నానని చెప్పారు. లడఖ్ రక్తం, డీఎన్ఏలలో గాంధీజీ, కాంగ్రెస్ భావజాలం ఉన్నట్లు తెలిపారు. రాహుల్ గాంధీ దాదాపు వారం రోజుల నుంచి లడఖ్లో పర్యటిస్తున్నారు. కార్గిల్ యుద్ధ వీరుల స్మారక కేంద్రం వద్ద అమరులకు నివాళులర్పించిన తర్వాత శ్రీనగర్ వెళ్తారు. మార్గమధ్యంలో ద్రాస్లో కాసేపు స్థానికులతో మాట్లాడతారు.