- భారీగా ముడుపులు తీసుకుని సహకరిస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు..
- పార్కు స్థలంలో నిర్మాణానికి రక్షణగా ఓప్రజాప్రతినిధి..
- పార్కును కాపాడాలంటున్న కాలనీ ప్రజలు..
చదువుతో బాటు ఆటలు కూడా పిల్లలకు ఎంతో అవసరం.. పిల్లలు శారీరకంగా ధృడంగా ఉంటేనే చదువుల్లో కూడా చురుగ్గా ఉంటారు.. ఇది ఆరోగ్య నిపుణులు చెబుతున్న మాట.. అలాంటి పిల్లల కోసం కేటాయించిన పార్క్ మీద కన్నేసిన కబ్జాకోరులు, వారితో చేతులు కలిపిన జీ.హెచ్.ఎం.సి. టౌన్ ప్లానింగ్ అధికారులు ముందు తరాల పిల్లల జీవితాలతో ఆటలాడుతూ వారి బంగారు భవిష్యత్తును బుగ్గిపాలు చేస్తున్నారు.. బంగారు తెలంగాణ నినాదంతో ముందుకు సాగుతున్న అధికార ప్రభుత్వ ప్రతినిధులు, ఉన్నతాధికారులు పట్టించుకోక పోవడంతో ఓ పిల్లల పార్క్ యథేచ్ఛగా కబ్జాకు గురి అవుతోంది.. వివరాలు చూద్దాం..
నాచారం : పార్కు స్థలాలను కాపాడవలసిన టౌన్ ప్లానింగ్ అధికారులే కబ్జాదారులకు వత్తాసు పలుకుతున్న దారుణం నాచారంలో చోటుచేసుకుంది. కాప్రా సర్కిల్ పరిధిలోని నాచారం డివిజన్ సావర్కర్ నగర్, సంస్కృతి హిల్స్ కాలనీల మధ్య ఏర్పాటు చేసిన పార్కు స్థలంలో యదేచ్చగా అక్రమ నిర్మాణం చేపడుతున్నా టౌన్ ప్లానింగ్ అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలు వినిపిస్తున్నాయి. పిల్లల పార్కుల సైతం కబ్జాల గురవుతుంటే కాప్రా టౌన్ ప్లానింగ్ అధికారులు భారీ స్థాయిలో ముడుపులు తీసుకొని, నిమ్మకుండిపోతున్నారని ఆరోపణ వినిపిస్తున్నాయి. నాచారం సావర్కర్ నగర్ జిహెచ్ఎంసి పార్కులో అక్రమ నిర్మాణం చేపడుతుంటే స్థానిక నాయకులు, కాలనీ ప్రజలు ఎన్నిసార్లు టౌన్ ప్లానింగ్ అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకున్న దాఖలాలు లేవని ప్రజల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
భారీగా ముడుపులు తీసుకున్న టౌన్ ప్లానింగ్ అధికారులు..! :
నాచారం పార్కు స్థలంలో చేపడుతున్న నిర్మాణంలో జోనల్ స్థాయిలో అధికారులకు భారీగా ముడుపులు అందినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకవైపు భవన నిర్మాణానికి అనుమతులు ఉన్నాయని చెబుతూనే, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారుల వెనకాల ఓ ప్రజా ప్రతినిధి చక్రం తిప్పుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నాచారం డివిజన్ లోని, సావర్కర్ నగర్, సంస్కృతి హిల్స్ కాలనీలో ఉన్న పార్కు స్థలాన్ని కాపాడాలంటూ కాలనీ ప్రజలు కోరుతున్నారు. పార్కు స్థలంలో నిర్మాణం చేస్తున్న భవనాన్ని పార్క్ కు కేటాయించాలని కాలనీ సంఘాల నాయకులు కోరుతున్నారు.