Sunday, April 28, 2024

దర్యాప్తునకు సిద్దం

తప్పక చదవండి
  • కాలేశ్వరం అక్రమాలపై సీబీఐ ప్రకటన
  • హైకోర్టులో కౌంటర్‌ దాఖలు చేసిన అధికారులు
  • విచారణ ఫిబ్రవరి 2కు వాయిదా వేసిన కోర్టు

హైదరాబాద్‌ : కాళేశ్వరం ప్రాజెక్టు దర్యాప్తుపై సీబీఐ అధికారులు హైకోర్టులో కౌంటర్‌ దాఖలు చేశారు. కౌంటర్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ నిర్మాణంలోని అక్రమాలపై దర్యాప్తుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వం గానీ ఆదేశిస్తే దర్యాప్తు చేస్తామని అధికారులు పేర్కొన్నారు. దర్యాప్తునకు అవసరమైన వనరులు, సౌకర్యాలు ప్రభుత్వం కల్పించాలన్నారు. అదనపు ఎస్పీ, ముగ్గురు డీఎస్పీలు, ఆరుగురు ఇన్స్‌పెక్టర్లు, 4గురు ఎస్‌ఐలతో పాటు సిబ్బంది కావాలన్నారు. సీబీఐ అధికారుల కౌంటర్‌ను పరిశీలించిన న్యాయస్థానం ఫిబ్రవరి 2న మరోసారి విచారణ చేస్తామని పేర్కొంటూ తదుపరి విచారణ ఆరోజుకు వాయిదా వేసింది. హైకోర్టు ఆదేశిస్తే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని సీబీఐ తెలిపింది. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు తమకు ఎలాంటి సమాచారం లేదని, ఉత్తర ప్రత్యుత్తరాలు జరగలేదని హైకోర్టుకు తెలియజేసింది. కాళేశ్వరంలో అవినీతిపై దర్యాప్తు చేయాలని ఫిర్యాదు చేసినా సీబీఐ నుంచి స్పందన లేదని పేర్కొంటూ న్యాయవాది రామ్మోహన్‌ రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిపై సీబీఐ హైదరాబాద్‌ విభాగం హెడ్‌, ఐపీఎస్‌ అధికారి డీ కళ్యాణ్‌ చక్రవర్తి తన కౌంటర్‌ దాఖలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు నిధులు రుణాలుగా ఇచ్చిన బ్యాంకుల కన్సార్షియం నుంచి సైతం ఎలాంటి ఫిర్యాదు అందలేదని హైకోర్టుకు తెలిపారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందన్న ఆరోపణలపై నేరుగా జోక్యం చేసుకుని దర్యాప్తు చేసే అంశంపై సీబీఐకి పరిమితులు ఉన్నాయని, దాన్ని దృష్టిలో పెట్టుకుని ఫిర్యాదులపై స్పందించలేదని పేర్కొన్నారు. పిటిషనర్‌ అందజేసిన ఫిర్యాదుపై పరిశీలన జరుపుతున్నామని, ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వ పాత్ర ఏంటని తేలాల్సి ఉందన్నారు. కేవలం రాష్ట్ర ఉద్యోగులే ఉంటే నేరుగా జోక్యం చేసుకోవడానికి తమకు అవకాశం ఉండదని తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు