Friday, May 3, 2024

కుల గణన దేశానికి ‘ఎక్స్‌-రే’ లాంటిది..

తప్పక చదవండి
  • ప్రక్రియను వీలైనంత త్వరగా చేపట్టండి
  • కేంద్రంపై మరింత ఒత్తిడి తీసుకువస్తాం
  • కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ

న్యూ ఢిల్లీ : కుల గణన.. దేశానికి సంబంధించి ఒక ‘ఎక్స్‌-రే’ వంటిదని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్నారు. ఈ ప్రక్రియను వీలైనంత త్వరగా చేపట్టడానికి కేంద్రంపై మరింత ఒత్తిడి తెచ్చేందుకు తాము సమాయత్తం అవుతున్నట్లు ఆయన పేర్కొన్నారు కుల గణన ప్రక్రియను.. దేశానికి సంబంధించి ఒక ‘ఎక్స్‌-రే’గా అభివర్ణించారు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ. దీని ద్వారా దేశంలోని ఓబీసీలు, దళితులు, గిరిజనులు సహా ఇతర వర్గాల సమగ్ర సమాచారం తెలుసుకుని, వారి స్థితిగతులను పూర్తిగా అర్థం చేసుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా నిర్వహించేలా కేంద్రంపై మరింత ఒత్తిడి తెచ్చేందుకు తాము కసరత్తు చేస్తున్నట్లు రాహుల్‌ పేర్కొన్నారు. కుల గణన అంశంపై ప్రధాని నరేంద్ర మోడీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసిన మరుసటి రోజు మధ్యప్రదేశ్‌లోని షాడోల్‌ జిల్లాలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో రాహుల్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలోని ఓబీసీలు, దళితులు, గిరిజనుల స్థితిగతుల గురించి వాస్తవాలను తెలుసుకోవటానికి ఉపయోగపడే కుల గణన ప్రక్రియను త్వరితగతిన నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వంపై మేము ఒత్తిడి తెస్తాము. ఈ విషయంలో రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లోని మా ప్రభుత్వాలు ఇప్పటికే కసరత్తు ప్రారంభించాయి. కుల గణన చేయడం అనేది దేశానికి ఒక ఎక్స్‌-రే. దీని ద్వారానే దేశంలోని బడుగు, బలహీన వర్గాలు అభివృద్ధి సాధిస్తాయని అన్నారు. ‘‘కాంగ్రెస్‌ హయాంలో చేపట్టిన కుల గణన సమాచారాన్ని బయటపెట్టాలని మేము ప్రధాన మంత్రికి సవాలు విసిరాము. కానీ ఆయన దాని గురించి మాట్లాడరు. దీనికి బదులుగా పాకిస్థాన్‌, ఆఫ్గానిస్థాన్‌ సహా ఇతర దేశాల గురించి ప్రస్తావిస్తారు. ముందు ఎంతో ముఖ్యమైన కుల గణన అంశంపై నోరు విప్పండి’ అని మోడీని ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేశారు రాహుల్‌ గాంధీ. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రయోగశాల గుజరాత్‌ కాదని.. మధ్యప్రదేశ్‌ అని భారతీయ జనతా పార్టీ ప్రముఖ నేత ఎల్‌కే అడ్వాణీ రాసిన పుస్తకంలో రాసి ఉందని రాహుల్‌ ప్రస్తావించారు. మధ్యప్రదేశ్‌ బీజేపీ చేసిన అనేక స్కామ్‌లకు నిలయం అని ఎద్దేవా చేశారు. ఇందులో వ్యాపం కుంభకోణం నుంచి, వైద్యం, మధ్యాహ్న భోజన పథకం వంటి అనేక సంక్షేమ పథకాలు ఉన్నాయని ఆరోపించారు. అలాగే రాష్ట్రంలో గిరిజనలు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను నివారించడంలో బీజేపీ ప్రభుత్వం పూర్తిగా అలసత్వం వహిస్తోందని రాహుల్‌ మండిపడ్డారు. మధ్యప్రదేశ్‌లో వచ్చేనెల 17న ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్‌ 3న ఫలితాలు వెలువడనున్నాయి. ప్రస్తుతం ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు