- డాక్టర్ బానోతు చందు నాయక్ కు ఉత్తమ డీఎంహెచ్ఓ అవార్డు రావడం పట్ల స్వంత డిపార్ట్ మెంట్ విస్మయం
- గతంలో బానోతు దొంగలీలలపై ఆదాబ్ వరుస కథనాలు
- సీఐ నర్సింహ రెడ్డికి మెరిటోరియస్ అవార్డు
హైదరాబాద్ : దొంగ డీసీహెచ్ (చిన్న పిల్లల స్పెషలిస్ట్ కోర్స్) సర్టిఫికేట్ తో పబ్లిక్, ప్రభుత్వాన్ని మోసగించిన మెదక్ జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి బానోతు చందు నాయక్ కు గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ఉత్తమ డీఎంహెచ్ఓ అవార్డు రావడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. అత్యంత అవినీతి అధికారికి ఉత్తమ డీఎంహెచ్ఓ అవార్డును ప్రదానం చేశారని స్వంత డిపార్ట్ మెంట్ సిబ్బందే విమర్శిస్తున్నారు. గతంలో ఇతను పనిచేసిన రంగారెడ్డి, గద్వాల, వనపర్తి ప్రజలైతే ఈయనకు అవార్డు రావడంపై ముక్కున వేలేసుకుంటున్నారు.
బానోతు వాస్తవానికి ఎంబీబీఎస్ మాత్రమే పూర్తి చేశారు. ఎలాంటి పీజీ కోర్స్ ను చదవలేదు. కానీ, ఇతగాడు చిన్న పిల్లలకు వైద్యం చేసేందుకు అవసరమైన డీసీహెచ్ కోర్సును చదివినట్లు దొంగ సర్టిఫికేట్లను ప్రభుత్వానికి సబ్మిట్ చేయడం గమనార్హం.
అంతేకాక పేరు మార్చుకొని ఇతను గతంలో జడ్చర్లలో ప్రైవేట్ ప్రాక్టిస్ కూడా చేయడం విశేషం. ఇక గద్వాల జిల్లా అధికారిగా ఉన్నప్పుడు నేమ్ ప్లేట్ లో డీసీహెచ్ అని రాసుకోవడం గమనార్హం. బానోతు లీలలపై ఆదాబ్ కూడా చాన్నాళ్ల క్రితమే మరో శంకర్ దాదా ఈ చందు నాయక్ అంటూ కథనాలు ప్రచురించింది.
అయితే ఇంతటి అవినీతి, దొంగ సర్టిఫికేట్లతో ప్రభుత్వం, పబ్లిక్ ను మోసం చేసిన, చేస్తున్న మెదక్ డీఎంహెచ్ఓ గా ఉన్నబానోతు చందు నాయక్ కు ఇప్పుడు ఉత్తమ జిల్లా వైద్యాధికారి అవార్డు రావడం చర్చనీయాంశంగా మారింది. ఈ పురస్కారం ఇవ్వడంతో అధికారుల బాధ్యతలు ఎలా నిర్వర్తిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. బానోతు చందు నాయక్ చేసిన అవినీతి లీలలు, గతంలో ఉన్న వైద్య శాఖ అధికారులు సహకరించిన విషయాలపై పూర్తి ఆధారాలతో మీ ముందుకు తీసుకురానున్నంది ఆదాబ్ హైదరాబాద్.. మా అక్షరం.. అవినీతిపై అస్త్రం..