Tuesday, May 7, 2024

242 మంది ఆచూకీ గల్లంతు

తప్పక చదవండి
  • 92కు చేరిన జపాన్‌ మృతుల సంఖ్య
  • 7.5 తీవ్రతతో సంభవించిన భూకంపం
  • ముగిసిన రెస్క్యూ ఆపరేషన్‌

టోక్యో : జపాన్‌లో భూకంప మృతుల సంఖ్య 92కి చేరింది. గల్లంతైన వారి సంఖ్య 242కి చేరిందని అధికారులు శుక్రవారం తెలిపారు. జనవరి 1 నూతన సంవత్సరం రోజున 7.5 తీవ్రతతో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. అనంతరం వందలాదిగా వచ్చిన ప్రకంపనలకు సుమారు 330 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికీ సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, గురువారం మధ్యాహ్నం వాజిమాలోని వారి నివాసాల శిథిలాల నుండి ఇద్దరు మహిళలను బయటకు తీసినట్లు తెలిపారు. భూకంపం ధాటికి తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో నోటో ద్వీపకల్పంలోని ఓడరేవు నగరమైన వాజిమా కూడా ఒకటి. ప్రకంపనల తీవ్రతకు అగ్ని ప్రమాదం సంభవించడంతో వందలాది ఇళ్లు దగ్థమయ్యాయి. ఇప్పటికీ ఆ ప్రాంతమంతా మసి, పొగ వ్యాపించి ఉన్నాయి. సుజు ప్రాంతం కూడా పూర్తిగా ధ్వంసమైంది. ఫిషింగ్‌ బోట్లు మునిగిపోయాయి. సునామీ ధాటికి బోట్లు ఎగిరిపడ్డాయి. ఇషికావా ప్రాంతానికి విద్యుత్తు, నీటి సరఫరా నిలిచిపోయాయి. సుమారు 30,000 గృహాలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోగా, రెండు సమీప గ్రామాలు సహా 89,800 గృహాలకు నీటి పంపిణీ నిలిచిపోయింది. వందలాది మంది ప్రభుత్వ వసతి గృహాల్లో ఉన్నారు. అయితే ఇప్పటి వరకు 242 మంది ఆచూకీ లేకుండాపోయినట్లు తెలుస్తోంది. రెస్క్యూ బృందాలు సుమారు 72 గంటల పాటు తీవ్రంగా అన్వేషించారు. రెస్క్యూ ఆపరేషన్‌ గురువారం ముగిసిపోవడంతో.. 242 మంది ఆచూకీ కోసం వెతుకులాట ప్రారంభమైంది. సెల్ఫ్‌ డిఫెన్స్‌ దళాలు మిస్సైన వారి గురించి తీవ్రంగా వెతుకుతున్నట్లు తెలుస్తోంది. కూలిన ఇండ్ల కింద అనేక మంది చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. సుజు, వాజిమా పట్టణాల్లో ఎక్కువగా ఇండ్లు కూలాయి. అక్కడ మిస్సైన వారి సంఖ్య పెరిగే అవకాశం ఉన్నది. ఇప్పటికీ ఇంకా వేలాది ఇండ్లకు విద్యుత్తు, నీటి సరఫరా నిలిచిపోయింది. కొండచరియలు విరిగిపడడం, రోడ్లు బ్లాక్‌ కావడం వల్ల అనేక మంది దూరంగా ఉండిపోవాల్సి వస్తోంది. ప్రతి ఒక్కర్నీ గుర్తించే వరకు రెస్క్యూ ఆపరేషన్‌ ఆగదు అని జపాన్‌ ప్రధాని ఫుమియో కిషిదా తెలిపారు. భూకంప బాధితుల కోసం ఈసారి బడ్జెట్‌లో 34 మిలియన్ల డాలర్లు కేటాయించినట్లు జపాన్‌ సర్కారు తెలిపింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు