ఆంధ్రప్రదేశ్లో భారత రాష్ట్ర సమితి పార్టీ విస్తరణను ఆ రాష్ట్రానికి చెందిన ఆయా పార్టీల నేతలు, కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఏపీలో బీఆర్ఎస్ పార్టీ పాగా వేస్తే తమ ఉనికికి ప్రమాదం ఏర్పడే ప్రమాదం ఉందని భావిస్తున్న పలువురు నాయకులు.. గులాబీ పార్టీపై విద్వేషం చిమ్ముతున్నారు. గుంటూరు జిల్లాలోని మంగళగిరి రోడ్డులో నూతనంగా ఏర్పాటైన బీఆర్ఎస్ కార్యాలయాన్ని ఆ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఆదివారం ఉదయం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఏపీలోని అన్ని జిల్లాల నుంచి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అయితే ఏపీలో బీఆర్ఎస్ పార్టీకి లభిస్తున్న ఆదరణను చూసి మిగతా పార్టీల నాయకులు ఓర్వలేకపోయారు.
నిన్న రాత్రే.. బీఆర్ఎస్ ఆఫీసు వద్ద ఏర్పాటు చేసిన బోర్డును, ఫ్లెక్సీలను ధ్వంసం చేశారు. నానా హంగామా చేశారు. దీనిపై బీఆర్ఎస్ నాయకులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పార్టీ కార్యాలయంపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.