- పిల్లలకు చదువులు కావాలి : ఆర్ కృష్ణయ్య
సికింద్రాబాద్ : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న మొత్తం ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అద్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 25 వేల పోస్టులు ఖాళీగా ఉంటే, కేవలం 5 వేలకు ప్రభుత్వం నోటిఫికేషన్ వేయడం సిగ్గు చేటన్నారు. దీనిని నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర డి.ఎడ్ బి.ఎడ్ అభ్యర్థుల ఆధ్వర్యంలో ఆదివారం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద నిరసన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి ఆర్ కృష్ణయ్య ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పీఆర్సీ ప్రకారం 25వేల ఖాళీలు ఉన్నాయని, కనీసం ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో చెప్పినట్లు 16 వేల టీచర్ పోస్టులకు అయినా నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు. లేదంటే రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకులను ఎక్కడ తిరగనీయబోమని హెచ్చరించారు. ఉపాధ్యాయుల కొరతతో అనేక పాఠశాలల్లో విద్యార్థులు విద్యలో వెనకబడి పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాకు గొర్లు, బర్లు వద్దని, మా పిల్లలకు చదువులు కావాలని ప్రజలు కోరుకుంటు న్నారన్నారు. చదువుతోనే సమాజం బాగుపడుతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించి జ్ఞాన సమాజాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎంపి, ఎమ్మేల్యే ల సీట్లు పెంచుతున్నారు కానీ, ఉద్యోగాలకు సీట్లు పెంచడం లేదన్నారు. టీచర్ పోస్టుల కోసం ఎదురు చూసే వారు ప్రతి గ్రామంలో 50 నుండి 60 మందికి వరకు ఉన్నారని, రాష్ట్ర వ్యాప్తంగా ఏడు లక్షల మందికి పైగా ఉన్నారన్నారు. పెళ్లిల్లు కాక చాలామంది గడ్డాలు పెంచుకొని తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఉన్న ఖాళీలకు అయిన నోటిఫికేషన్స్ విడుదల చేసి మొత్తం ఉద్యోగాలను భర్తీ చేయాలన్నారు. ఛత్తీస్ ఘడ్ లాంటి ట్రైబల్ రాష్ట్రంలో కూడా ప్రభుత్వ పాఠశాలలు అద్భుతంగా ఉన్నాయన్నారు. తాగుబోతుల తెలంగాణ కాదు బంగారు తెలంగాణ కావాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ బీసీ యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్ ముదిరాజ్, విద్యార్థి సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
తప్పక చదవండి
-Advertisement-